Others

అమరజీవి స్ఫూర్తితో నవ్యాంధ్ర నిర్మాణము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు జితిన్‌దాస్ తరువాత అత్యంత సుదీర్ఘ కాలము ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన ఘనత అమరజీవి పొట్టిశ్రీరాములుకే దక్కింది. స్వాతంత్య్రోద్యమము కాలం నాడే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి పునాదులేర్పడ్డాయి. 1912లోనే ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ప్రస్తావన వచ్చింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాష్ట్రాల విభజనను ఏ ప్రాతిపదికన విభజించాలనే విషయంపై ఆనాటి కేంద్ర ప్రభుత్వం చర్చ జరిపింది. అవిభక్త మద్రాసులో వున్న తెలుగువారు ఎప్పటినుంచో ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కొందరు జాతీయ నాయకులు ప్రత్యేకాంధ్ర వైపు మొగ్గుచూపారు. అయితే నాయకుల మధ్య అనైకత్యవల్ల 1952 వరకు ప్రత్యేకాంధ్ర కార్యరూపం దాల్చలేదు. అమరజీవి పొట్టిశ్రీరాములు గాంధీజీ మార్గంలో పయనించి 1952 అక్టోబర్ 19న మద్రాసులో మహర్షి బులుసు సాంబమూర్తిగారి ఇంటి వద్ద ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించి డిసెంబర్ 15 వరకు 58 రోజులపాటు దీక్ష చేసి అసువులు బాసారు. ఆయన ప్రాణత్యాగము ఫలితంగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని జిల్లాలను కలిపి ఆంధ్ర రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పరచింది. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయగా, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. విశాలాంధ్ర అనే భావన కారణంగా 1956లో ఆంధ్ర, తెలంగాణాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటుచేశారు. పొట్టి శ్రీరాములు చిన్నతనంనుండే గొప్ప దేశభక్తి కలిగియుండి గాంధీజీ ఆశయాలను పుణికిపుచ్చుకున్నారు. ఒకవైపు స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూనే, మరోవైపు నిమ్నవర్గాల హక్కుల కోసం పోరాడారు. ఆనాటి సమాజంలో బహుజనులకు దేవాలయాల్లో ప్రవేశముండేది కాదు. దళితులు దేవాలయాల్లో ప్రవేశించాల్సిందేనని పట్టుబట్టి వారికి ఆలయ ప్రవేశాన్ని శ్రీరాములు కల్పించారు. ఆయన మరణానంతరం హైదరాబాద్‌లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏర్పాటుచేశారు. 2008లో నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణము చేశారు. 1969 నుండి 2014 వరకు ప్రత్యేక తెలంగాణ కొరకు జరిగిన పలు ఉద్యమాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణాను 29వ రాష్ట్రంగా ప్రకటించింది. రాజధాని లేని ప్రాంతంగా నవ్యాంధ్ర మిగిలింది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ప్రసిద్ధి పొందింది. నాడు పొట్టి శ్రీరాములుగారు మొక్కవోని దీక్షతో ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన తీరును నేటి నాయకులు స్ఫూర్తిగా తీసుకొని నవ్యాంధ్ర పునర్ నిర్మాణానికి నడుం బిగించాలి. ప్రత్యేక హోదా లేదా అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగడానికి చట్టబద్ధమైన ప్రత్యేక ప్యాకేజీ విషయంలో నాయకులు అందరూ ఒకే త్రాటిపైకి వచ్చి సమిష్టి నిర్ణయాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి వుంది.
(నేడు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా)

- యం. రాంప్రదీప్ 9492712836