Others

ఆహారంలో ఏది బెస్ట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది శాకాహార యుగం. నాన్‌వెజ్ మానేసి చాలాకాలమైందంటూ ఒకింత గర్వంగా చెప్పుకొనే రోజులివి. అయితే మాంసాహారం తినేవారు ఎక్కువ బలంగా ఉంటారని, శాకాహారులకు అన్నిరకాల ప్రోటీన్లు లభించవన్న వాదన మాత్రం వినిపిస్తూనే వుంది. నిజానికి ఏ ఆహారం తీసుకోవాలనేది ముఖ్యం కాదు. దాన్ని మనం ఏ పద్ధతిలో తీసుకుంటున్నామనేది ప్రధానం. నిజానికి మాంసాహారులైనా శాకాహారం తీసుకోకుంటే అనారోగ్యం పాలవుతారనే విషయం చాలామందికి తెలియదు. ప్రొటీన్లు మాంసాహారంలోనే కాదు, శాకాహారంలో కూడా పుష్కలంగా లభిస్తాయి. కాని శాకాహార పదార్థాల్లో కొన్నింటిలో కొన్ని రకాల అమైనో ఆమ్లాలు మాత్రమే లభిస్తాయి. శాకాహారంలో ప్రొటీన్ల నాణ్యత పెంచడం మన చేతుల్లోనే వుంది. మన శరీరం తయారుచేసుకోలేని అమైనో ఆమ్లాలన్నీ అందే విధంగా అన్ని రకాల పదార్థాలు కలిపి సమంగా తీసుకుంటే మాంసాహారానికి ధీటుగా శాకాహారం నుంచి నాణ్యతగల ప్రొటీన్లు పొందవచ్చు.
ఇడ్లీ, దోసె, పెసరట్టు లాంటి వాటిలో పప్పులను కూడా కలుపుతాం. కాబట్టి మామూలు అన్నం కంటే ఇవి మంచి ప్రొటీన్లు అందిస్తాయి. నూనె గింజలతో చేసిన పల్లీ చట్నీ, నువ్వుల కారం వంటి వాటితో కలిపి తింటే వీటిలోని ప్రొటీన్ల నాణ్యత మరింత పెరుగుతుంది. ఇలా సక్రమ పద్ధతిలో తీసుకుంటే శాకాహారం తీసుకునేవారు అవసరమైన అన్ని రకాల అమైనో ఆమ్లాలను పొందగలుగుతారు. పప్పులో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఈ పప్పుల్లో లేని మిథియొనైన్ అనే అమైనో ఆమ్లం బియ్యంలో వుంటుంది. పప్పు ధాన్యాల్లో ఉండే లైసిన్ బియ్యంలో ఉండదు. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్ల నాణ్యత పెంచడానికి తప్పనిసరిగా రోజూ పప్పన్నం తినాలి. సాధారణంగా వయసు పెరిగిన వారు పప్పు తింటే గ్యాస్ సమస్యతో బాధపడాల్సి వస్తుందని పప్పులకు దూరంగా ఉంటారు. కాని చాలా సమయం వరకూ ఏమీ తినకుండా ఉంటేనే కడుపులో బాగా ఆమ్లం తయారై గ్యాస్ సమస్యకు దారితీస్తుంది. అంతేగాని దీనికి పప్పు తినడమే కారణమనుకోవడం సబబు కాదు. వృద్ధాప్యంలో పప్పులు ఎక్కువగా తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఎక్కువగా ఎములకు బలం చేకూరడానికి కాల్షియంతోపాటు ప్రొటీన్లు కూడా కావాలి. పప్పులు తీసుకోవడంవల్ల ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఏదైనా గాయం అయినప్పుడు పప్పులు మానేయాలని, లేకపోతే చీము పడుతుందని చాలామంది భావిస్తారు. కాని పప్పు తినడంవల్లనే గాయం త్వరగా మానే అవకాశం వుంది. గాయం మానాలంటే ఆ భాగంలో కొత్త కణజాలం ఏర్పడాలి. ఇందుకోసం ప్రొటీన్లు కావాలి. కాబట్టి ప్రొటీన్లనిచ్చే పప్పు అధికంగా తీసుకోవడం గాయాన్ని మాన్పడంలో తోడ్పడుతుంది.
అలాగే గింజలలో అధిక ప్రొటీన్లను పొందవచ్చు. ముఖ్యంగా తెల్ల నువ్వుల్లోయాంటి ఆక్సిడెంట్లు, మిథయునైన్ అనే అమైనో ఆమ్లం అధిక మోతాదులో ఉంటాయి. అందుకే ఆయిల్ టెక్నాలజీ నిపుణులు రోజూ ఒక చెంచాడు తెల్ల నువ్వులను తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. చిక్కుళ్ళు, శెనగ, బఠాని వంటి లెగ్యూమ్స్‌లలో అధిక మోతాదులో ప్రొటీన్లు లభ్యమవుతాయి. వీటి గింజలను మొలకెత్తించినపుడు ఎంజైములు చైతన్యవంతవౌతాయి. కాబట్టి వీటిని తీసుకుంటే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. అలాగే గోధుమ రంగు సోయా చిక్కుళ్లలో అత్యధిక శాతం ప్రొటీన్లు ఉంటాయి. వీటిని పది నిముషాలు వేయించిగాని, కొద్దిసేపు నానబెట్టి కుక్కర్‌లో ఉడికించి గాని తింటే ఆరోగ్యకరం.
మసాలా దినుసులు వాడే గసగసాల్లో 27 శాతం ప్రొటీన్లు ఉంటాయి. వీటి ద్వారా అన్నింటికన్నా ఎక్కువ కాల్షియం లభిస్తుంది. వీటిని మసాలాగానే కాక పాయసం రూపంలో కూడా తీసుకోవచ్చు. రాత్రి పూట పాలలో కలుపుకుని తాగితే వాటిలో ఉంటే ఓపియం ప్రభావం వల్ల నిద్ర బాగా పడుతుంది.
శరీర పెరుగుదలకు, కండరాల దృఢత్వానికి ప్రొటీన్లు మాత్రమే కాదు, కేలరీలు కూడా కావాలి. అందుకే మాంసాహారం తీసుకోవడవల్లనే శరీరానికి బలం చేకూరుతుందనుకోవటం నిజం కాదు. కేలరీలను తగిన మోదులో అందించే శాకాహారం కూడా తీసుకుంటూ క్రమపద్ధతిలో వ్యాయామం చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. మనం తీసుకున్న ప్రొటీన్లు జీర్ణం కావాలంటే శక్తి కావాలి. ఈ శక్తికోసం కార్బోహైడ్రేట్లమీద ఆధారపడక తప్పదు.
అందుకే అన్నం, కూరగాయల వంటి శాకాహారం జోలికిపోకుండా కేవలం చికెన్లు, మటన్లు తీసుకుంటే ఏ మాత్రం లాభం ఉండదు. సూక్ష్మ పోషకాలైన విటమిన్లు, ఖనిజాలు కూడా ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు జీర్ణం కావడానికి కావలసిన కొన్నిరకాల ఎంజైమ్స్, కో ఎంజైమ్స్ తయారుకావడానికి ఈ ఖనిజాలు అవసరం. మాంసాహారంలో లభించని ఖనిజాలు శాకాహారంలో ఉంటాయి.
మాంసాహారులు సైతం పండ్లు, కూరగాయలను తీసుకోక తప్పదు. మాంసాహారంలో పీచు పదార్థాలు అసలే వుండవు. జీర్ణ ప్రక్రియ సాఫీగా జరగడానికి, పేగుల కదలికలకు ఈ పీచు పదార్థాలు వున్న ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అందువల్ల ఫైబర్ కోసం శాకాహారంపై ఆధారపడక తప్పదు.

-కంచర్ల సుబ్బానాయుడు