Others

శివకేశవులకు ప్రీతికరం కార్తీక పౌర్ణమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీకమాసం అన్ని మాసములలో, అత్యంత పవిత్రమైనదిగా భావించ బడుతున్నది. ‘న కార్తీక సమో మాస:’ అని అత్రి మహాముని వచనము. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్థం. ‘‘చంద్రుడు పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రములో సంచరించే మాసం కార్తీక మాసం’’. ఇందు కార్తీక పౌర్ణమి శివరాత్రితో సమానమైనదిగా భావించ బడుతుంది. దీనిని ‘‘త్రిపుర పూర్ణిమ, రాస పూర్ణిమ, దేవ దీపావళి’’ అని కూడా అంటారు. ఈ దినాన్ని మనువులలో పద్నాలుగవ వాడైన భౌత్యుని పేరున భౌత్యమన్వంతరాది, ఇంద్ర సావర్ణిక మన్వంతరమని కూడా అంటారు. ఈనాడు కైలాస నాథుడు త్రిపురాసురుడిని సంహరించాడు.
శంకరుని కీర్తిని నారదుని వల్ల విన్న త్రిపురాసురుడు శివుడంటే అసూయ చెంది, కైలాస పర్వతం మీదకు దండెత్తి వెళ్ళి, శంకరుడిని యుద్ధానికి రమ్మంటాడు. మూడు రోజుల తీవ్ర యుద్ధానంతరం పరమ శివుడు, త్రిపురాసురుడిని సంహరించాడు. దేవతలు అభయంకరుడైన శంకరుడిని స్తోత్రం చేశారు. వెయ్యేళ్ళ అసుర పాలన అంతరించిన శుభ సందర్భాన శివుడు తాండవం చేశాడని పురాణాధారం. ఈ దినాన దీపం వెలిగిస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలన్ని హరించుకు పోతాయని విశ్వాసం. రోజంతా ఉపవాసం ఉండి, రోజుకొక వత్తి చొప్పున 365 వత్తులను కూడిన దీపాన్ని వెలిగిస్తారు. కొందరు దీపాలను నదిలో లేదా చెరువులో వదులుతారు. ఇళ్ళల్లో తులసి కోట వద్ద దీపాలను వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాటి శివాలయంలో దీపారాధన ముక్కోటి దేవతల పూజ, సకల పుణ్య నదుల స్నాన ఫలం దక్కి, ఇహ పరలోక సుఖసౌఖ్యాలు, ముక్తి లభించగలవని నమ్మకం. ఈ రోజున కేదాశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్ళను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా పెట్టి, పూజలు చేయడం ప్రాచీన కాలం నుండి సంప్రదాయంగా వస్తున్నది. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని నమ్మకం. జైనులకు, పంజాబీలకు ఇది విశిష్టదినం. గంగా మహోత్సవం కూడా ఈ రోజునే నిర్వహిస్తారు. తెలుగువారు కార్తీక పూర్ణిమ వ్రతంలో చలిమిడి చేస్తారు. అరవవారు వేపుడు బియ్యం, అటుకులు చేస్తారు. బలి చక్రవర్తికి ఒళ్ళంతా మంటలు పుడితే, కార్తీక పౌర్ణమి నాడు శివారాధన చేస్తే, మంటలు తగ్గినట్లు, మహిషాసురుడితో యుద్ధం చేసిన సమయాన శివలింగాన్ని బద్దలు కొట్టిన పాప నివృత్తికై పార్వతీదేవి కూడా శివారాధన చేసినట్లు పురాణ కథనాలు. నాలుగు మాసాలు బుద్ధుడు ఉత్తమ లోకంలో తల్లి వద్ద ఉండి, తిరిగి భూలోకానికి ఈదినమే దిగి వచ్చే క్రమంలో బౌద్ధులు దీపమాలికలు వెలిగించి, మత స్థాపకునికి స్వాగతోపచారాలు చేస్తారు. బర్మాలో ప్రతి ప్రతి చోటు దీపాలతో నిండి ఉంటుంది. ‘‘నందన సంవత్సరమున, పొందుగ కార్తీక శుద్ధ పున్నమ నాడున్, వింధ్యాద్రి సేతుబంధన, సందున నొక వీరుడేలు సరుగన వేమా’’ అని క్రీ.శ.1532లోదిగా పరిశోధకులు నిర్ణయించిన వేమన పద్యంలో కార్తీక పున్నమి ప్రస్తావన ఉంది. కార్తీక శుద్ధ పూర్ణిమ రోజున కృత్తికా దీపోత్సవమును ఆచరించడం, ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు గావించి, కార్తీక దామోదరుని పూజ, దీపారాధన గావించుట అత్యంత పుణ్యప్రదం.

- సంగనభట్ల రామకిష్టయ్య