AADIVAVRAM - Others

బండెనక బండి కట్టి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండుగలు ఎన్ని ఉన్నా మేడారం జాతర అంటే సమ్మక్క, సారలమ్మలను కొలిచే భక్తులకు మహా సంబరం. మేడారం జాతర కంటే రెండు నెలల ముందు నుంచే తమ పిల్ల పాపలతో వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఎడ్ల బండ్లను సిద్దం చేసుకోవడంతో పాటు జాతరలో బలి ఇచ్చేందుకు మొక్కుకున్న కోడి పుంజులను, మేక పోతులను, గొర్రె పొట్టే ల్లను తమ వెంట తీసుకువెళ్లేందుకు సమకూర్చుకుంటారు. జాతరకు వెళ్లడానికి ముందు ఇంటిని శుద్ధి చేసుకొని, ఇంట్లో సమ్మక్క పండుగను చేసుకుంటారు. మేడారం చేరుకోవడానికి దూరప్రాంతాలైన చత్తీస్‌గడ్, ఒడిషా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన గిరిజనులు నెల ముందే బయలు దేరుతారు. దగ్గర ప్రాంతాల్లోని వారేమో వారం ముందు బయలు దేరి, ముందుగా సిరిసిల్ల రాజన్న జిల్లా జిల్లా వేములవాడ రాజన్నను, సిద్దిపేట జిల్లా కొమురెల్లిని మల్లన్నను దర్శించుకుంటారు. రాజన్నను తప్పని సరిగా దర్శించుకున్న తర్వాతే మేడారానికి రావడం అనావాయితీగా వస్తోంది. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఏ సౌకర్యానికి కూడా ఇతరులపై ఆధారపడరు. తమ వెంటే వంట చెరుకును, వంట సరుకులను, సామాగ్రిని, ఉండటానికి కావాల్సిన గుడారాలను ఎడ్ల బండ్లకు పైనా కట్టుకొని వస్తారు. మార్గ మధ్యలో వచ్చే గుళ్లు గోపురాలను దర్శించుకుంటూ, నీళ్లున్న చోట వంటలు చేసుకుంటు, సత్రాల్లో బస చేసుకుంటు మాఘశుద్ధ పౌర్ణమికి రెండు రోజుల ముందు తడ్వాయి అడవుల్లోకి చేరుకుంటారు. జాతరకు ముందు రెండు వారాల ముందు దండకారణ్యంలో ఎక్కడ చూసిన చీమల బారుగా వెళ్లే ఎడ్ల బండ్లే కనిపిస్తాయి. మేడారానికి నాలుగు, అయిదు కిలో మీటర్ల దూరంలోనే బస చేయడానికి అనువైన చోటు చూసుకొని, అక్కడ గుడారాలను వెసుకుంటారు. మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు రోజు వచ్చే బుధవారం రోజున సారలమ్మను తీసుకురావాడానికి మేడారం నుంచి కనే్నపల్లికి వెళ్లే పూజారుల వెంట భక్తులు వెళ్తారు. సారలమ్మ బుధవారం రాత్రికి మేడారం గద్దెలకు చేరుకోగానే, ఆ మరుసటి రోజు గురువారం ఉదయం నుంచే పూజారులు (వడ్డెరలు) తమ ఇలవేల్పుకు పూజాలు ఆరంభిస్తారు. అవీ సాయంత్రం మూడు గంటలకు ముగియగానే, మేడారం నుంచి పూజారుల కుటుంబాలు సాంప్రదాయ గిరిజన వాయిద్యాలతో చిలుకల గుట్టకు బయలుదేరుతారు. వారి వెంట సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, దేవాదాయశాఖ అధికారులు, లక్షలాది మంది భక్తులు చిలకల గుట్ట దిగువ భాగానికి చేరుకుంటారు. గుట్టపైకి మాత్రం కేవలం పూజారులు మాత్రమే వెళ్తారు. అక్కడికి గిరిజనులకు తప్పా మరొకరికి ప్రవేశం లేని గుడిలో పూజలు జరిపి, ఆ తర్వాత గుట్ట దిగి కిందకి బయలుదేరుతారు. మొదటిసారి సమ్మక్కను తెచ్చే పూజారి భక్తులకు కనిపించగానే, సంబంధిత జిల్లా ఎస్సీ గాలిలోకి మూడు సార్లు కాల్పులు జరుపుతారు. సమ్మక్క బయలు దేరిందనడానికి కాల్పుల శబ్ధాన్ని సంకేతంగా భావించి మేడారంలో సిద్ధంగా ఉంచుకున్న కోళ్లు, గొర్రె పోటెళ్లు, మేకపోతులను బలి ఇస్తారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం దాకా గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు సమర్పించాక భక్తులు తిరుగు పయనమవుతారు. గురువారం రాత్రి నిండు పౌర్ణమి వెలుతురులో మేడారం అడవిలో చెట్లు, పుట్ట, చెమల మధ్యలో భక్తుల వంటల మంటలు, వాటి వల్ల కమ్ముకునే పొగ మేఘాలు, విందు వంటకాల గుబాలింపులు, గిరిజన సాంప్రదాయిక వాయిద్యాల చప్పుళ్లు భక్తులకు అలౌకిక ఆనంద పారవశ్యుల్ని చేస్తుంది.

-నార్లగిరి యాదగిరి