Others

అసహాయులకు ఆసరా ఆమె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు సుష్మాస్వరాజ్ జయంతి
*
భారతదేశానికి ఆమె అందించిన సేవలు నిరుపమానం.. ఆమె రాజకీయ చతురత, పరిపాలనా దక్షత అనన్యసామాన్యం.. ఆమె విదేశాంగ విధానం ఈ దేశ భవిష్యత్తుకే గట్టి పునాదులు వేసింది. అత్యంత నిబద్ధత, అనంత సేవా దృక్పథంతో ముందుకు పోయిన ధీరవనితగా ఈ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న సుష్మాస్వరాజ్ దుందుభి స్వరం మూగబోయి 6 నెలల కాలమయింది.. అనితర సాధ్యమైన వాక్పటిమతో ఇతరుల మనసులను సునాయాసంగా గెలుచుకునే సుష్మాస్వరాజ్ నేడు లేకపోవడం బాధాకరమే.. ఎందుకంటే ఆమె గంగా ప్రవాహ ప్రసంగాలు ప్రతీ భారతీయుని గుండెల్లో చిరకాలం మారుమ్రోగుతూనే ఉంటాయి. మనిషి, మనీషి కావడానికి ఆమాత్రం చాలదా! మానవ జన్మ సార్థక్యం అవడానికి ఈమాత్రం చాలదా! అభినవ భారతావనిలో అలాంటి గంభీర భావనా చైతన్య స్వరూపి కనుమరుగు కావడం అనివార్యమే కావచ్చు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవం ద్వారా నేటి రాజకీయ క్షేత్రములో అలుపెరుగని పోరాటం చేసిన ఘనత ఆమె స్వంతమే.. భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మరియు కేంద్ర మాజీమంత్రి శ్రీమతి సుష్మాస్వరాజ్ గత ఏడాది ఆగస్టు 6వ తారీఖున రాత్రి 10.15 గంటల సమయంలో తీవ్ర గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో వెనువెంటనే అత్యవసర చికిత్స అందినప్పటికీ లాభం లేకుండా పోయంది. ఆమె అప్పటికే తుదిశ్వాస విడిచారు. భారతీయ నారీశిరోమణి అచ్చం ఇలా ఉంటుందని ప్రపంచానికి తన కట్టూబొట్టూ, వేషధారణ ద్వారా అనునిత్యమూ పరిచయం చేసే రాజకీయ విదుషీమణి సుష్మా స్వరాజ్. విదేశాంగమంత్రి అంటే ఎవరు? ఏయే బాధ్యతలు కలిగి ఉంటారు? ఏ విధులు నిర్వహిస్తారు? అనేది సామాన్య ప్రజలకు ఇదివరలో తెలిసేదికాదు. అలాంటి మంత్రిత్వశాఖను తనదైన ముద్రతో ప్రజాక్షేత్రంలో ఉంచిన ఘనత ఆమె స్వంతం. ఆపన్నులకు నేనున్నానని అభయహస్తాన్ని అందించే మానవతామూర్తి సుష్మాస్వరాజ్. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా, మరీ ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా ఏ భారతీయ పౌరుడైనా తన ఆవేదనను, ఆక్రందనను వెలిబుస్తే వెనువెంటనే స్పందించి ఆయా వ్యక్తుల బాధలను తీర్చి, వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచే కరుణామయి సుష్మాస్వరాజ్. అనేకమంది దేశపౌరులు బ్రతుకుజీవుడా! అంటూ విదేశాలకు వెళ్లి మోసగాళ్ల వలలో చిక్కుకొనే సందర్భంలో ఆయా మోసగాళ్ల మోసాలకు బలై బిక్కుబిక్కుమంటూ దిక్కులేక నీరసించిపోయిన వారిని తిరిగి దేశం రప్పించేందుకు ఆయా విదేశీ ప్రభుత్వాలతో మరియు ప్రతినిధులతో నెరపిన దౌత్యం అపూర్వం, అనితర సాధ్యం. అనుకోని పరిణామాల వల్ల ఈ దేశాన్ని విదేశీ మూలాలున్న వనిత పరిపాలించే పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో ఆ సంక్లిష్ట సమయంలో నిర్మాణాత్మక దృష్టితో వ్యవహరించి తన పదునైన విమర్శనా శక్తితో అడ్డుకట్ట వేయడం జరిగింది. ఒకవేళ ఏమైనా ఆ వనిత చేతిలోకి ఈ దేశం పోయే పరిస్థితి వస్తే నేను శిరోముండనం చేయించుకొని కుటీరంలో సన్యాసి జీవితం గడుపుతూ, మూలనపడి ఉంటానని చెప్పడం సాహసోపేతమైన నిర్ణయమే. సుష్మాస్వరాజ్ స్వస్థలం ప్రస్తుతం హర్యానా లోని అంబాల కంటోనె్మంట్. హరిదేవ్ శర్మ, లక్ష్మీదేవి పుణ్య దంపతులకు ఆమె 1952 ఫిబ్రవరి 14న పుట్టారు. ప్రాథమిక విద్యాభ్యాసం అంబాలలో, బీఏ డిగ్రీ సనాతన ధర్మ కాలేజ్‌లో, ఎల్.ఎల్.బి. మాత్రం చండీఘడ్ లోగల పంజాబీ యూనివర్సిటీలో సాగింది. తండ్రి రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్.ఎస్.ఎస్) కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. తన కళాశాల విద్యలో ఉత్తమ విద్యార్థిగా మరియు ఎన్.సి.సి లో ఉత్తమ క్యాడెట్ గా ఆమె గుర్తింపు పొందారు. దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసిన సుష్మాస్వరాజ్ రాజకీయవేత్తగానే కాకుండా సుప్రీంకోర్టులో మంచి వాదనా పటిమగల న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆమె 1975లో స్వరాజ్ కౌశల్‌ను వివాహమాడారు. ఆమెకు కుమార్తె బాన్సురి స్వరాజ్ ఉన్నారు. సుష్మాస్వరాజ్‌కు కళలు అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా లలితకళలు, నాటకాలపై ఆసక్తి ఎక్కువ కూడా. చిన్ననాటి నుండే తండ్రి అడుగుజాడల్లో పెరిగిన ఆమె పెద్దయ్యాక తన నిర్మాణాత్మక సందర్భోచిత గంభీర వాక్పటిమతో అనేకమంది భారతీయుల మనసు దోచుకున్నారు. దివంగత నేతలైన అటల్ బిహారీ వాజ్‌పాయి, జైపాల్ రెడ్డి లాంటి ఉత్తమ పార్లమెంటేరియన్‌ల మరియు గొప్పవక్తల సరసన నిలిచి వారిలాగే ఉత్తమ పార్లమెంటేరియన్‌గా సత్కరించబడడం విశేషం. ఆమె విద్యార్థి దశ నుండే రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారు. ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు విధానాలకు వ్యతిరేకంగా జరిగే అనేక ఆందోళనలలో మరియు పోరాటాలలో ధైర్యంగా పాల్గొన్నారు. ఆ తర్వాత జనతాపార్టీలో చేరి ఆనాటి అత్యయిక పరిస్థితికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలలో పాల్గొని విస్తృతంగా ప్రచారం చేసేవారు. 1977లో తొలిసారిగా హర్యాణా నుండి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి, 25 ఏళ్ల వయసులో యంగెస్ట్ క్యాబి నెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1990లో రాజ్యసభ సభ్యురాలుగా, 1996లో లోక్‌సభ సభ్యురాలుగా పదవులు చేపట్టడం జరిగింది. తర్వాత జరిగిన ఎన్నికలలో అనగా 1998లో ఢిల్లీలో గల హజ్ ఖాస్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, అదే సంవత్సరం ముఖ్యమంత్రిగా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించడం జరిగింది. ఢిల్లీ ప్రజల సంక్షేమానికి ఆమె తీసుకున్న నిర్ణయాలు శ్లాఘనీయం. సుష్మా చేపట్టని పదవి లేదంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఆమె 1990 నుంచి 93 వరకు మిజోరం గవర్నర్ గా పనిచేసియున్నారు. ఇంకా 1996లో అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రభుత్వం కేవలం 13 రోజులపాటు కొనసాగిన పరిస్థితుల్లో, సుష్మా స్వరాజ్ కేంద్ర సమాచార శాఖామంత్రిగా కీలక బాధ్యతలు తీసుకున్నారు. మరలా ఆమె 2000 సెప్టెంబర్ 30 నుండి 2003 జనవరి 29 మధ్య తిరిగి సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. ఇంకా 2009 జూన్ 3న లోక్‌సభలో ప్రతిపక్షపార్టీ ఉపనేతగా బాధ్యతలు చేపట్టారు. దాంతో లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేతగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఇంకా 2014 మే 26 నుంచి 2019 మే 30 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన మహిళ సుష్మాస్వరాజే. వివిధ సందర్భాలలో ఆమె భారత పార్లమెంటులో మాట్లాడుతున్నప్పుడు రాజకీయ ప్రత్యర్థివర్గాలు సైతం ఔరా! ఇంతటి గొప్ప ప్రసంగపాఠవాలు ఈమె సొంతమే కదా! అని ఆశ్చర్యపోయేవారట. లోక్ సభలో జరిగిన చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే విప్లవాత్మక నిర్ణయానికి తన వంతుగా ఆనాడు ఆమె కృషి చేశారు. 2009 నుండి 2014 వరకూ ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా పార్లమెంట్‌లో ఉండటం తెలంగాణా వాదానికి మరింత బలం చేకూరింది. పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందినపుడు ఆమెనే కాదు ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోండి అని ఎంతో భావోద్వేగంతో పార్లమెంటు లోపల ప్రసంగిం చారు. 2017 నవంబర్ నెలలో హైదరాబాద్ హెచ్.ఐ.సి.సిలో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు విదేశాంగమంత్రి హోదాలో ముఖ్యఅతిథిగా హాజరైన నేపథ్యంలో ఈ దేశంలో ఎవరికి నేను ఏమైనా కావచ్చును కానీ, తాను తెలంగాణకు మాత్రం చిన్నమ్మనే అంటూ మరోసారి ప్రకటించడం తెలంగాణా ప్రజలకు ఎంతో సంతోషాన్నిచ్చింది. గత ఏడాది ఆగస్టు నెలలో పదిహేను రోజుల వ్యవధిలో ఇద్దరు ఢిల్లీ మాజీ మహిళా ముఖ్యమంత్రులు కన్నుమూయడం యాదృచ్ఛికం కావచ్చు. కాకపోతే మరణం ఎవరికైనా, ఎంతటి వారికైనా అనివార్యం కదా! అతిపిన్న వయసులో రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా మరియు లోక్‌సభలో ప్రతిపక్షనేతగా పనిచేసిన తొలిమహిళ ఈమె. ఒక జాతీయస్థాయి రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించిన తొలిమహిళ కూడా ఈమెయే. ఇంకా 2008 మరియు 2010 సంవత్సరాలలో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా రెండుసార్లు అవార్డు అందుకున్న తొలిమహిళగా ఈ దేశప్రజల హృదయాలలో చెరగని ముద్రవేసుకుని చిరస్థాయిగా నిలవడం ఆమె రాజకీయ వ్యవహారశైలికి దర్పణంగా చెప్పవచ్చు. హిందీ, ఆంగ్లం, సంస్కృ తం మరియు కన్నడం వంటి భాషల్లో ప్రసంగించగల ఏకైక మహిళానేతగా ఆమె భారతదేశ చరిత్రలో కలకాలం గుర్తుంటారు. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైన పరిస్థితుల్లో కూడా కేంద్ర విదేశాంగ శాఖామంత్రిగా తన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించడం విశేషం. 2016లో ఆమెకు మూత్రపిండాల మార్పిడి శస్తచ్రికిత్స జరిగింది. అందువల్ల ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయనని ముందుగానే ప్రకటించారు. గత సంవత్సరం లోక్‌సభలో 370 రాజ్యాంగ అధికరణం ఆమోదం పొందడం పట్ల మరియు జమ్మూకాశ్మీర్, లద్దాక్ లను ప్రత్యేక కేంద్రపాలిత రాష్టాలుగా ప్రకటించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు కూడా.

- పిల్లా తిరుపతిరావు, 7095184846