Others

‘అంపశయ్య’పై మానవాళి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవజాతి ఈ సృష్టిలో మహోత్కృష్టమైనది. ఆలోచనా జ్ఞానం, విచక్షణ వంటి పలు విశిష్టతలతో విలక్షణమైన లక్షణాలతో మానవ మేథస్సు సృష్టించబడింది. ఈ సృష్టిలో అద్భుతమైన శక్తిసంపదల సృష్టికి మానవ మేథస్సు నిలువెత్తు సాక్షిభూతం. కొన్ని జీవరాశులు మానవ జాతి కంటే బలమైనవి అయినా వాటికి బుద్ధిబలం, విచక్షణా శక్తి లేకపోవడం పెద్ద లోటు. అందుకే అన్ని విధాలా సకల జీవరాశులలో మానవుడే అత్యంత శక్తిసంపన్నుడు.
పురాణకాలం నుండి నేటి కాలం వరకూ మానవజాతి ఔన్నత్యాన్ని గురించి అనేక ప్రాచీన గ్రంథాల్లో, తాళపత్రాలలో, ఆధునిక రచనల్లో విశదీకరించడం జరిగింది. అటువంటి మహిమాన్వితమైన మానవ శక్తి నిర్మాణాత్మకంగా ఉపయోగపడకుండా విధ్వంసకరంగా పరివర్తిన చెందడం నేటి వ్యవస్థ చేసుకున్న పాపపరిహార ఫలితమేమో అనిపించక మానదు. వివేకం స్థానంలో మూర్ఖత్వం, విచక్షణ స్థానంలో విధ్వంస మనస్తత్వం బలంగా నాటుకుపోయాయి. మానవ మేథస్సు వక్రమార్గంలో పయనిస్తుంది. మానవుని ఆలోచనా విధానం వక్రగతిలో పురోగతి చెందడం అనర్థదాయకం. ఆటవికం.
యుగాలు గడిచాయి. తరాలు అంతరించాయి. కొత్తనీరొచ్చి పాత నీరును పక్కకు గెంటినట్టుగా పాతతరాన్ని, పాత తరపు ఆలోచనలను నవతరం ఎప్పటికప్పుడు పక్కకు నెడుతూ కొత్తొక వింత - పాతొక రోతగా మారుతూ, స్థానభ్రంశం చెందడం కాలానికున్న సహజ లక్షణం. అయితే గతంలో ఒక తరం వారి ఆలోచనా విధానాలను అవగతం చేసుకుంటూ వారిని గౌరవిస్తూ వారు చూపిన బాటలో పయనించడానికి ప్రయత్నం చేసేవారు. విలువలకు పెద్ద పీట వేస్తూ, సమాజంలో ఎలాంటి అలజడులు, అశాంతి లేకుండా జీవించేవారు. కుల, మత, వర్గ బేధాలు పాతకాలంలో ఉన్నప్పటికీ అందరూ కలసి మెలసి అరమరికలు లేని జీవన విధానం అనుసరించేవారు. పెద్దలను గౌరవించడం, విలువలను పాటిస్తూ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ, సాధ్యమైనంతవరకూ సుహృద్భావ వాతావరణంలోనే జీవించేవారు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఖండిస్తూ, న్యాయబద్ధమైన తీర్పులు చెప్పే పెద్దరికం నాటి వ్యవస్థలో ఉండేది. బలహీనులు కూడా ఎవరి అండా లేకపోయినా యథేచ్ఛగా జీవించేవారంటే నాటి సమాజంలోని హుందాతనం, పెద్దరికం, న్యాయ నిర్ణయాలే కారణం. అలాంటి పరిస్థితులు నేటి కాలంలో ఎక్కడా కనిపించవు. బలవంతులకే అగ్రతాంబూలం - డబ్బున్న వారికి సమాజంలో విలువ. డబ్బుంటే తప్పులన్నీ ఒప్పులుగా చెలామణి అవుతున్న రోజులివి. మంచికి వంచన తప్ప విలువ లేదు. అవకాశవాదం వేయితలల విషవృక్షంగా అవతరించింది. మాటకు విలువ తగ్గింది. మనిషి సృష్టించిన నోటు మనిషినే కబళించే విడ్డూరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నోటుకున్న ప్రాధాన్యత నోటి మాటకు లేదు.
స్నేహబంధాలు తెగిపోతున్నాయి. రక్తసంబంధాలు రావణకాష్ఠంలా రగిలిపోతున్నాయి. సమాజమంతా అసూయతో నిండిపోయింది. అహంకారపు పైత్యప్రకోపాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. దొడ్డిదారిలో ధనార్జన చేసి, పైకి రావడానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తున్నారు. పాతకాలంలో ఎవరైనా అక్రమార్జనతో పైకి వస్తే సమాజం వారిని ఛీత్కరించేది. అలాంటి వారికి ఎవరూ విలువనిచ్చేవారు కాదు. ప్రస్తుత సమాజంలో ఎలా సంపాదించావన్నది కాదు. ఎంత సంపాదించావన్నదే ప్రధానంగా మారిపోయింది. ఎవరన్నా పలకరిస్తే మీకెంత మంది సంతానం అని అడిగేవారు ఒకప్పుడు! మీకెంత ఆస్తి ఉంది? మీ పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారా? ఎన్ని కోట్లు కూడబెట్టారు? అనే ప్రశ్నల పరంపర మొదలవుతున్నది నేటి కాలంలో!!
మానవ ఆయుఃప్రమాణం కొవ్వొత్తిలా కరిగిపోతున్నది. జీవించిన కొద్ది కాలంలో కూడా కడుపు నిండా తినలేరు... కంటి నిండా నిద్రపోలేరు. రకరకాల రోగాలతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నా, మనిషిలో ఈ జీవితంపై వైరాగ్యం కానరాదు. సక్రమంగా జీవించి తనువు చాలిద్దామన్న ఆలోచన మచ్చుకైనా మన మస్తిష్కంలో జనించదు. అవయవాన్నీ చెడిపోయి, అంపశయ్యపై ఉన్నా, ధనాశ చావు... లోభత్వం నశించదు. లేవలేక మనిషి మంచం పాలైనా, తాను పోయినా తమ బిడ్డలకు కోట్లు కూడబెట్టాలనే వికృతమనస్తత్వాలు మారడం లేదు పోయే ముందు కూడా!!
మనసుని తీవ్ర కలతకు గురిచేసే పరిణామాలు నేటి సమాజంలో చోటుచేసుకుంటున్నాయి. సమాజమంటే మనుషుల సమూహమే కదా, మనుషుల ‘‘మనసు’’ లేని మనస్సుల్లో అంకురించే అవాంఛనీయ, అమానవీయ, విధ్వంసకర బీజాలు మనసున్న ప్రతి ఒక్కరినీ కదలించకమానవు. మనం ఎదుకు బ్రతుకుతున్నామో మనకైనా తెలుస్తుందా? కనీసం ఆలోచించే మనస్తత్వమైనా మనుషుల్లో నిక్షిప్తమై ఉందా? అంటే లేదనే సమాధానమే మనకు చటుక్కున తిరిగి వస్తుంది.
ఇతరులను హింసించే వారు కొందరైతే, హింసతో సంతోషించే వారు మరికొందరు. పెట్టిన చేతులను నరికేవారు మరికొందరు. మన సొమ్ము స్వాహా చేస్తూ పరమనీచంగా బ్రతికే పూతికాహారులు మరికొందరు.
ఆస్తులు దోచుకు తినే రక్తసంబంధాలు ఒకవైపు, అందరూ ఒక్కటై ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్టుగా బంధాలనే బలవంతంగా తెంపేసి, నీతులు చెప్పేవారు మరికొందరు. పరుల ఆస్తులను అతిసులభంగా కాజేసి, వారి ఆహారాన్ని పూతికాహారుల్లా భోంచేసే వారంతా నీతులు వల్లించడం దెయ్యాలు వేదాలు వల్లించడమే. ఇలాంటి పాపిష్టి వాళ్లకు మరికొందరు పాపిష్టి శకుని సంతతి దుర్మార్గులు అగ్నికి ఆజ్యం తోడైనట్టు. వాళ్లతో కలిసి శకుని మంత్రాంగాలతో బాధాతప్త హృదయాలను చితిమంటల్లోకి తోసేసి, ఆ మంటల్లో చలి కాచుకునే దుర్మార్గులు తామే పెద్దలమంటూ గెద్దల్లా తయారై ద్రోహ చింతనతో దగ్గరవ్వడం మానవజాతి పతనానికి పరాకాష్ట. రాబందుల జాతి తరిగిపోతున్న బంధువుల రూపం లో ఎక్కడ పీనుగు కనబడితే అక్కడ వాలిపోయే మానవ రూప రాబంధులే అడుగడుగునా మనకు అగుపిస్తున్నాయి.
ఎందుకిలాంటి మనస్తత్వాలు మనిషిలో వికృతంగా గూడుకట్టుకుపోతున్నాయో అర్థం కావడం లేదు. పోయిన తర్వాత ఆరడుగుల నేల కూడా మనది కానప్పుడు, అన్నీ తెలిసిన మానవుడు ఎందుకింత స్వార్థపరుడవుతున్నాడు? ధనమే ఇంధనమని ఎందు కు ప్రాకులాడుతున్నాడు? ఎందుకు సజావుగా జీవించడం లేదు? కరెన్సీ కట్టలలోనే మోక్షాన్ని వెతుక్కుంటూ, స్వార్థమే పరమార్థమని భ్రమిస్తూ కరెన్సీ చుట్టూ పరిభ్రమిస్తూ, కాలాన్ని కర్పూరంలా హరిస్తూ, పరులను హింసిస్తూ, పైశాచికానందంలోనే వికృతమైన సంతృప్తి పొందే నేటి కాలపు వింత ధోరణులు ధ్వంస జీవన ప్రమాణాలకు పరాకాష్ట. ఇలాంటి ధోరణులు విడనాడకపోతే మానవజీవితం ఆత్మహత్యా సదృశ్యమే!! సద్గుణాల వలనే మనిషి ఉత్తముడు కాగలడు తప్ప తెచ్చిపెట్టుకున్న డాంభికాల వలన కాదు. శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాగలదా? మనలోని మంచితనం వలనే మనకు విలువ పెరుగుతుంది. ఓర్వలేనితనంతో కొంతమంది మనల్ని అందరికీ దూరం చేసినా దీర్ఘకాలంలో అది వారికే ఎదురుతిరిగే ఆయుధం అవుతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని ఫలం దీర్ఘకాలంలో మధురంగానే ఉంటుంది. ఈ వాస్తవాన్ని గమనించి ప్రతీ వ్యక్తి పరులకు అపకారం చేయకుండా సద్వర్తనంతో మెలగడమే ఉత్తమోత్తమం. సృజనశీలురు. త్యాగశీలురు, సమాజహితులు, సద్వర్తనులే మానవాళి మనుగడకు మూలస్తంభాలు.

-సుంకవల్లి సత్తిరాజు