మెయన్ ఫీచర్

తరలింపుతో తుదిమజిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌తో ఆంధ్రా ఉద్యోగుల అనుబంధం ముగిసింది. అమరావతికి చేరిన తుది మజిలీ దాదాపు కొత్త కాపురమే. కొత్త సంసారంలో కష్టసుఖాలున్నట్లే అమరావతికి తరలిన ఉద్యోగులకూ ఉంటాయి. తెలంగాణ ఉద్యోగులు, హైదరాబాద్ గాలి, వాతావరణంతో విడదీయలేనంతగా పెనవేసుకున్న అనుబంధం ఉన్నట్లుండి తెగిపోవడం ఎవరికైనా బాధాకరమే.
హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివెళ్లే సమయంలో, ఉద్యోగుల భావోద్వేగం చూసిన వారి హృదయం కలుక్కుమనడం సహజం. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి! విభజన మిత్రులను విడదీసినట్లే, కొత్త కలయికలు సరికొత్తబంధాలకు తెరలేపుతుంటుంది. కాబట్టి అమరావతికి తరలివెళ్లిన ఉద్యోగులు ఇకపై కొత్త జీవితానికి అలవాటుపడక తప్పదు.
తరలింపు ఇప్పుడు కాకపోయినా మరో నెల, రెండు నెలలకయినా తప్పదు. కాబట్టి, పెరిగిన ఊరు, దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని, కుటుంబాన్ని విడిచి తన మాట కోసం అమరావతి వచ్చిన ఉద్యోగులకు సౌకర్యాల విషయంలో సీఎం చంద్రబాబు పెద్ద మనసు చూపాలి. తరలింపులో విజయం సాధించిన బాబు, వారికి కష్టం కలగకుండా చూసుకునే బాధ్యత కుటుంబపెద్దగా తీసుకోవాలి. వారంతా ఇష్టంతో వచ్చారా? కష్టంగా వచ్చారా అన్నది అప్రస్తుతం. కానీ వచ్చిన వారికి సమస్యలు లేకుండా చూడటంతోపాటు, మహిళా ఉద్యోగుల సమస్యలపై సత్వరం స్పందిస్తే బాబు గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగులు తమ చివరి మజిలీని అమరావతినే ఎన్నుకున్నారు కాబట్టి. ఒకరకంగా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి తరలిన చివరి తరం ప్రతినిధులుగా చరిత్రలో నిలిచిపోతారు కాబట్టి! ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా బాధ్యతతో వ్యవహరించాలి. రాజకీయాలు వేరు, ఉద్యోగ జీవితం వేరు. కాబట్టి, అమరావతికి వచ్చిన ఉద్యోగులలో ఆత్మస్థైర్యం నింపకపోయినా, వచ్చి పొరపాటు చేశామన్న భావన కల్పించకపోతే అదే పదివేలు. ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉద్యోగ సంఘ నేతలకే ఉంది. తరలింపుపై ప్రభుత్వం-ఉద్యోగుల మధ్య అనుసంధానకర్త పాత్ర పోషించారు. ఆ సమయంలో, తమ కంటే ప్రభుత్వ పక్షానే ఎక్కువగా తూగారని నిందలు పడిన నేతలు, ఇప్పుడు తమ సహచరుల సమస్యలపై తక్షణం స్పందించి, నిందలు తొలగించుకోవలసి ఉంది. ఉద్యోగ నేతలు పాలకుల మెహర్భానీ కోసం యత్నించడం ఇప్పుడు కొత్తగా వస్తున్నదేమీ కాదు. కాకపోతే తమ సహచరుల కష్టాలకూ స్పందించాల్సి ఉంటుంది.
అసలు ఆంధ్రులది ఒకరకంగా తొలి నుంచీ కాందిశీకుల బతుకే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి నిర్దయగా వెళ్లగొట్టబడిన ఆంధ్రులకు అప్పుడూ రాజధాని లేదు. వచ్చిన తర్వాతనే కర్నూలును ఎంచుకున్నారు. పోనీ అక్కడా స్థిరంగా ఉన్నారా అంటే అదీ లేదు. మూడేళ్లకే హైదరాబాద్‌కు తరలివెళ్లారు. హైదరాబాద్‌లో ఆరు దశాబ్దాలు దక్కన్ పీఠభూమితో అనుబంధం పెంచుకున్నారు. అభివృద్ధిలో భాగస్వాములుగా మారి, రెండోతరం దానిని అనుభవించేలోపు మళ్లీ రాజధాని లేని రాష్ట్రానికి తరలింపు. అంటే 63 సంవత్సరాలు ఆంధ్రులు కాందిశీకుల్లా బతికారన్న మాట. అద్దె ఇల్లు ఎప్పుడూ సొంతం కాదు. దానిపై హక్కులుండాలనుకోవడం అత్యాశనే. వాస్తవాల్లో బతకుండా ఊహల్లో విహరింపచేసిన పాపం రాజకీయ పార్టీలదే. ఏపి నుంచి సీఎంలుగా పనిచేసిన వారంతా హైదరాబాద్ మీద దృష్టి పెట్టడం వల్ల, అభివృద్ధి-నిధులు అన్నీ ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. తెలంగాణ సీఎంలూ అందుకు విరుద్ధంగా ఏమీ వ్యవహరించలేదు. ఫలితంగా అటు ఆంధ్ర-ఇటు తెలంగాణలోని జిల్లాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి ఎవరి బతుకులు వారు బతుకున్నారు.
కానీ ఏపిలో చంద్రబాబు, తెలంగాణలో చంద్రశేఖర్‌రావు ఇద్దరూ ఇప్పటికయినా వాస్తవంలోకి రావాలి. ఇద్దరూ కేవలం రాజధానులపై మనసుపారేసుకుని, జిల్లాలు విస్మరిస్తే దాని ఫలితం తర్వాత తరం అనుభవించాల్సి ఉంటుంది. ఇద్దరికీ ‘తొలి సీఎం’ అన్న ఖ్యాతి చరిత్రలో నిలిచిపోతుంది. అది చిరస్థాయిగా నిలబెట్టుకోవాలా? లేదా? అన్నది వారి చేతుల్లోనే ఉంది. ఈ విషయంలో చంద్రులిద్దరూ అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి సారించాలి. తెలంగాణతో పోలిస్తే, ఆంధ్రకు వనరులున్నా కష్టపడాలి. తెలంగాణ వడ్డించిన విస్తరి. ప్రతిదీ హైదరాబాద్‌ను పోల్చుకునే పద్ధతి మారాలి. హైదరాబాద్ ఒక్కరోజులో నిర్మాణమయిందేమీ కాదు. దానికి 400 ఏళ్లు పట్టింది. ఆ లెక్కన అమరావతి నిర్మాణానికి ఎంత కాలం పడుతుంది? బాబు నవనిర్మాణ దీక్ష సందర్భంగా తన విజనరీని వెల్లడించారు. 2029కల్లా ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో టాప్‌టెన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. మంచిదే! బాబు సంకల్పం మెచ్చదగ్గదే. మరి ఆ లెక్కన ఇప్పటికే ఏపికంటే ముందున్న రాష్ట్రాలు ఎంత ముందుకు వెళ్లాలి? అప్పుడు ఏపి ఇంకా వెనుకబడే ఉంటుంది కదా? కాబట్టి, ఇలాంటి పదాలపటాటోపం, గంభీర నినాదాలు పక్కకుపెట్టి, ఉన్న వనరులను అందుబాటులోకి తీసుకువచ్చి, కొత్త రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలి. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎన్ని ఆరోపణలున్నప్పటికీ, బాబుపై జనాలకు ఇంకా ఆ నమ్మకం ఉంది. దాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనదే!
నిజానికి తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి తర్వాత చెప్పుకునే అభివృద్ధి మిగిలిన జిల్లాల్లో కనిపించవు. అందుకే హైదరాబాద్‌కు వలసలు! అదే వరంగల్, కరీంనగర్ వంటి జిల్లాల్లోనూ వౌలిక సదుపాయాలు, సంస్థల ఏర్పాటుపై దృష్టి సారిస్తే వలసలు ఎందుకుంటాయి? ఏపిలో కూడా విశాఖ, కర్నూలు, అనంతపురం, ఒంగోలు వంటి ప్రాంతాలపై దృష్టి సారించాల్సి ఉంది. వీటిపై దృష్టి సారించకపోతే మరో ఉప ప్రాంతీయ ఉద్యమాలొస్తాయి. రాజకీయం ఏ పనయినా చేయిస్తుంది. అప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ లెక్కలేనంత మంది కేసీఆర్‌లు ఉద్భవిస్తారు. ఇప్పటికే ఏపిలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ఉద్యమాలు పురుడుపోసుకున్నాయి. అవి ఏ స్థాయికి చేరుకుంటాయన్నది పక్కకుపెడితే, మనసులో ఒక భావన అంటూ రాకూడదు. వస్తే ఆ భావన తొలగించడం కష్టం. అందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యమే నిలువెత్తు నిదర్శనం. తెలంగాణలో ఉత్తర-దక్షిణ తెలంగాణ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే, అభివృద్ధి వికేంద్రకరణపై దృష్టి పెట్టక తప్పదు. ఇద్దరు చంద్రులూ రాజకీయాలు, పరిపాలనలో అనుభవజ్ఞులే.
కేసీఆర్ పేరుకు సీఎం అయి రెండేళ్లయినా, బాబు దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు అనేక విజయవంతమైన పథకాలకు పురుడుపోసింది ఆయనేనన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కాకపోతే ఆయన ప్రభ బాబు వల్ల వెలగలేదంతే. ఇప్పుడు రెండేళ్ల పాలన చూస్తే ఆయన పాలనకు కొత్త అని ఎవరూ ఆక్షేపించలేరు. విమర్శలు పక్కకుపెడితే.. సమీక్షలు, నిర్ణయాలు, ఎత్తుగడ, ప్రతివ్యూహాలు కేసీఆర్ లోని అపార పాలనానుభవం ఉన్న వ్యక్తిని ఆవిష్కరిస్తాయి. కాబట్టి మరికొందరు కేసీఆర్‌లు తయారయ్యే అవకాశాన్ని ఇస్తారా? ఇవ్వరా? అన్నది ఆయన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో తెరాస సర్కారుకు హానీమూన్ ముగిసినట్లే. రెండేళ్లు విపక్షాలకు దొరక్కుండా, చాకచక్యంగా బండి నడిపిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షాలకు చేతి, నోటి నిండా పనికల్పించారు. మిగులు బడ్జెట్ ఉన్న బంగారు తెలంగాణలో రూ. 286 కోట్ల మేర ఆర్టీసీ, రూ. 1527 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచాలన్న నిర్ణయం ప్రజలపై భారం మోపేదే. ఇప్పటివరకూ వరాలు మాత్రమే ఇస్తూ వెళ్లిన కేసీఆర్, ఇప్పుడు వడ్డనతో నడ్డి విరవడాన్ని జనం జీర్ణించుకోలేరు. ఎవరికైనా నొప్పి తగలనంత వరకూ ఏమీ అనిపించదు. రెండేళ్లు ప్రతిపక్షాలు ఎంత హడావిడి చేసినా జనం స్పందించకపోవడానికి ప్రధాన కారణం అదే. డబుల్‌బెడ్ రూములు, మూడెకరాలు, పించన్లు, కొత్త సచివాలయం, కొత్త ఆసుపత్రులు, సిడ్నీలాంటి నగరాల వంటి నినాద హోరును వీనులవిందుగా ఆస్వాదించిన జనాలకు, తాజాగా పెంచిన చార్జీలు నేరుగా తగిలే దెబ్బలు. అందుకే వ్యతిరేకత మొదలవుతుంది. దాన్ని అడ్డుపెట్టుకుని జనాలకు చేరువయి, కావలసినంత సర్కారు వ్యతిరేకతను పోగేసేందుకు విపక్షాలు రెడీగా ఉన్నాయి. భూ సేకరణ ఏ ప్రభుత్వానికయినా ఇబ్బంది కలిగించేదే. ఇప్పుడు మల్లన్నసాగర్ వ్యవహారమూ అంతే. పెరిగిన ధరలు, భూసేకరణ నిరసనోద్యమం వల్ల సర్కారుకొచ్చే నష్టమేమీలేదని తెరాస భక్తులు, అలౌకిక ఆనందంతో అడ్డంగా వాదించవచ్చు.
కానీ, వ్యతిరేకతకు ఎక్కడో ఒకచోట పునాది పడుతుంది. విపక్షాలు రెండేళ్లు సర్కారుపై ఎన్ని విమర్శలు చేసినా జనం స్పందించలేదు. కారణం సమస్యలు లేకపోవడమే. ఇప్పుడు చార్జీల దెబ్బలు అనుభవించేది వారే కాబట్టి, దాని నొప్పి అనుభవించేవారికే తెలుస్తుంది. ఇప్పటివరకూ వరాలను చూసి మురిసిపోయిన జనాలు, చార్జీల దెబ్బకు వాస్తవంలోకి రావడం సహజం. అయితే, చార్జీలు పెంచే సమయంలోనే కేసీఆర్ ఏపి భవన్ మాదేనని, కృష్ణానదీజలాల హక్కుల అంశాలపై విస్తృత ప్రచారం ప్రారంభించారు. ఇలాంటి నిర్ణయాలను పక్కదారిపట్టించేందుకు, ఏ ప్రభుత్వమైనా ఇలాంటి జిమ్మిక్కులనే ప్రయోగిస్తుంది. కేసీఆర్ కూడా అదే చేశారు.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144