ఆంధ్రప్రదేశ్
బ్రిటిష్ కాలంనాటి చలాన్లకు చెల్లు చీటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, ఫిబ్రవరి 13: వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేవలు పొందటానికై బ్రిటీష్కాలం నుంచీ ఆయా శాఖల ఖాతాలకు సబ్ ట్రెజరీ కార్యాలయం, ఆపై అనుబంధ స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చెలాన్ల రూపంలోనే చెల్లించాల్సి వచ్చేది. ఇక పాత విధానానికి ప్రభుత్వం మంగళం పాడింది. కొద్దిరోజుల్లో సరికొత్త విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు ముందుగా నిర్ణీత సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి టోకెన్ నెంబర్ తీసుకుని ఆపై సీల్ వేయించుకోవాల్సి వచ్చేది. ఉదాహరణకు ఒక ఆస్తి రిజిస్ట్రేషన్కు సంబంధించి రిజిస్ట్రార్ కార్యాలయంలో చెప్పిన విధంగా రిజిస్ట్రేషన్ ఫీజు సొమ్మును తిరిగి రిజిస్ట్రేషన్ శాఖ పద్దుకు జమచేయాల్సి ఉంటే సబ్ ట్రెజరీ కార్యాలయంలో చలాన్ను పూర్తిచేయాలి. ఆ కార్యాలయంలో ట్రెజరీ అధికారి సంబంధిత శాఖ హెడ్ ఆఫ్ అకౌంట్ నెంబర్ను ఆ చెలానాపై వేసి సంతకంతో బ్యాంక్ టోకెన్ నెంబర్తో స్టాంప్ వేస్తారు. అదే ఫారంపై ఒరిజినల్, డూప్లికేట్, ట్రిప్లికేట్ ఇలా మూడు రశీదులుండేవి. ఒక రశీదును తమ వద్ద ఉంచుకుని మిగిలిన రెండింటిని ఇచ్చివేయాలి. తర్వాత ఆ రశీదులతో సంబంధిత ఎస్బీఐ బ్రాంచ్కెళ్లి చూపించి నగదు చెల్లించాల్సి వచ్చేది. ఇందుకోసం ఆ రెండుచోట్లా గంటల తరబడి క్యూలో నిరీక్షించాల్సి వచ్చేది. చివరకు మూడో ప్రతిని తన వద్ద ఉంచుకుని రెండో ప్రతిని సంబంధిత శాఖ కార్యాలయంలో అప్పగించాల్సి వచ్చేది. రవాణా, రిజిస్ట్రేషన్, భూగర్భ గనులు, తదితర అంశాల్లో ప్రతి సేవకూ నిర్ణీత ఫీజును పైవిధంగానే చెలాన్ రూపంలో చెల్లించాల్సి వచ్చేది. ఈ చెలన్ విధానంలో ఇటీవల కోట్లాది రూపాయల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు వే బిల్లులు లేకుండా సరుకులు రవాణా జరిగే సమయంలో వాణిజ్య పన్నులశాఖ అధికారులు తమ తనిఖీల్లో ఆ సరుకులను సీజ్ చేసి సంఘటన స్థలంలోనే జరిమానా విధించి రశీదు అందించేవారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఒకరు ఏరోజుకారోజు ఆ మొత్తం సొమ్మును సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి చెలానా రూపంలో వాణిజ్యశాఖ హెడ్కు జమచేస్తున్న దశలో పలుచోట్ల సిబ్బంది ట్రెజరీకి వెళ్లకుండానే నకిలీ రబ్బర్ స్టాంపు సంతకాలతో రశీదులు సృష్టించి తమ ఫైళ్లలో పొందుపరిచేవారు. ఒక్కోసారి ఎప్పటికోగాని వాస్తవాలు వెలుగుచూసేవి కావు. దాంతో ఇటీవలే వాణిజ్యపన్నుల శాఖ వరకు చలాన్ల స్థానంలో ఆన్లైన్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయటం ప్రారంభించారు. ఇటీవల కాలంలో పలు ట్రెజరీ కార్యాలయాల్లో వివిధ ప్రభుత్వ శాఖల నిధులు కోట్ల రూపాయల్లో గల్లంతవుతున్న నేపధ్యంలో రాష్ట్ర ట్రెజరీ శాఖ దాదాపు పది నెలలపాటు కసరత్తు చేసి కాంప్రెహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (సమగ్ర ఆర్ధిక నిర్వహణా విధానం)ను రూపొందించింది. తర్వాత పౌర సేవలను మరింత సరళతరం చేశారు. ఈ విధానంలో ఇంటి నుంచే సెల్ఫోన్ నుంచి సంబంధిత ప్రభుత్వ శాఖ హెడ్ ఆఫ్ ది ఎకౌంట్ నెంబర్ను గుర్తించి నెట్ బ్యాంకింగ్ విధానంలో నిర్ణీత ఫీజును నమోదు చేయటంతోనే సెకన్లలో డబ్బు జమ అయినట్లుగా ఆయా శాఖల నుంచి మెసేజ్ వచ్చేస్తుంది. ఈ మెసేజ్ను సంబంధిత కార్యాలయంలో చూపించి సులువుగా సేవలను పొందవచ్చు. ఒకవేళ నెట్ బ్యాంకింగ్ పట్ల అవగాహన లేనివారు ట్రెజరీ శాఖతో సంబంధం లేకుండానే తమ సమీప బ్యాంక్కు వెళ్లి చెలానా రూపంలో నిర్ణీత ఫీజును కూడా చెల్లించడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అత్యధిక మంది తమ సెల్ఫోన్ నుంచే ఆన్లైన్లో టెలిఫోన్, కరెంట్ బిల్లులను చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు ఏ ప్రాంతంలో ప్రభుత్వ సేవలు పొందాలంటే విధిగా అక్కడికే వెళ్లి చెలానా చెల్లించాల్సి వచ్చేది. ఇక రాష్ట్రంలో ఎక్కడ నుంచి అయినా నెట్ బ్యాంకింగ్ విధానంలో చెల్లించి సేవలందుకునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతానికి స్టేట్ బ్యాంక్లో రాష్ట్రంలో ఏ బ్రాంచి నుంచి అయినా చెల్లింపులకు అవకాశం ఉండగా త్వరలోనే మరో 15 జాతీయ, గుర్తింపు బ్యాంక్లను ఖరారు చేయబోతున్నారు. ఈ సరికొత్త విధానం మరికొద్ది రోజుల్లోనే అమల్లోకి రాబోతున్నది. ఇక దీనివల్ల సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో సిబ్బందికి పూర్తిగా పని తగ్గబోతున్నది. వీరందరినీ ఇతరత్రా సేవలకు వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
chitram...
ప్రస్తుతం ట్రెజరీల్లో కడుతున్న చలానా ఫారమ్