డైలీ సీరియల్

యాజ్ఞసేని 38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ దృతరాష్ట్రుడు భీష్మద్రోణ విదురులతో సంప్రదించిన తరువాత నిర్ణయాన్ని చెబుతానన్నాడు.
దృతరాష్ట్రుడు భీష్మద్రోణ విదురులను పిలిపించాడు. వారితో సంప్రదించాడు.
భీష్మ ద్రోణ విదురులతో సంప్రదించిన ధృతరాష్ట్రుడు తదుపరి కర్తవ్యమేమిటో ఆలోచించసాగాడు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడి మనోగతాన్ని భీష్ముడు తెలిసికొన్నాడు. దుర్యోధనుడు కూడా వచ్చాడు. అప్పుడు భీష్మ పితామహుడు ధృతరాష్ట్ర దుర్యోధనులను చూచి-
‘‘దుర్యోధనా! పాండవులతో యుద్ధం జేయటం నాకు సమ్మతంగాదు. నాకు ధృతరాష్ట్రుడు ఎంతో పాండురాజు కూడా అంతే. ధృతరాష్ట్రా! గాంధారి పుత్రులు, పాండురాజు పుత్రులు నీకూ నాకూ సమానమైనవారే. వారు నాకెట్లు రక్షింపదగినవారో నీకూ అట్లేగదా! పాండవులతో యుద్ధం నాకిష్టంలేదు. వారికి అర్థరాజ్యం ఇవ్వాలి. సంధి చేసుకోవాలి. ఈ రాజ్యం వారి తాతతండ్రులకు కూడా చెందినదే’’ అని దుర్యోధనుని చూచి-
‘‘దుర్యోధనా! ఈ రాజ్యం నీవు నీ తండ్రిదని భావించావు. అట్లే వారు తమ తండ్రిదని తలంచారు. పాండవులు ఈ రాజ్యాన్ని పొందలేనపుడు మీరు కూడా ఈ రాజ్యాన్ని పొందలేరు! అధర్మంగా ఈ రాజ్యాన్ని నీవు పొందావు. నీకంటే ముందే వారు ఈ రాజ్యాన్ని పొందారని నా అభిప్రాయం. ప్రేమతో వారికి అర్థరాజ్యాన్ని ఇమ్ము. అది అందరికినీ శ్రేయస్కరం. నీ కీర్తిని నీవే కాపాడుకో! కీర్తియే మానవులకు గొప్ప బలం. అది నశించినవాని జీవితం నిష్ఫలం.
మనుజుల కీర్తి నశించనంతవరకు వారు జీవించినట్లుగా భావించాలి. కీర్తి నశించిన తరువాత వారు చచ్చినవారితో సమానము. కురుకులానికి తగిన ధర్మాన్ని ఆలోచించుము.
వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యాన్ని పాండవులకు ఇచ్చి వాళ్ళతో స్నేహంగా యుండి కీర్తి నిలుపుము’’ అని భీష్మపితామహుడు దుర్యోధనుకి హితబోధ చేశాడు.
భీష్మపితామహుడు చేసిన హితబోధ విన్న ద్రోణాచార్యుడు దుర్యోధనునితో-
‘‘దుర్యోధనా! మీ తాత భీష్మపితామహులు నుడివినమాట అనేక విధాల చాలా మంచిది. మిక్కిలి శ్రేష్ఠమైనది. మేలుచేసేది. ధర్మమైనది. సజ్జనులకు కూడా ఇష్టమైనది. అందువలన ఆయన చెప్పిన మాటను స్వీకరించుము. కౌరవులు, కర్ణుడు శకుని చెప్పిన మాటలు విని నీవు పాండవులతో యుద్ధం చేయటం ఎందుకు? దుశ్శాసనుని, వికర్ణుని పంపి పాండవులను సగౌరవంగా పిలిపించి వారి తండ్రి భాగాన్ని వారికి ఇమ్ము’’ అని అన్నాడు.
భీష్మద్రోణాదుల మాటలను విన్న కర్ణుడు-
‘‘మిత్రమా! ముసలివాళ్ళు తమకు అనుకూలంగా వుండేటట్లుగానే చెబుతారు. రాజులకు మేలు కలిగేటట్లు చెప్పరు. శత్రువులైన పాండవులను తెచ్చుకోవడమేమిటి? మంత్రులు మనస్సులో కల్మషం ఉంచుకొని ఏదోవిధంగా మాట్లాడుతారు.
పూర్వం నితంతుడు అనే మగధరాజు శక్తి సన్నగిల్లి, ఇంద్రియాలు చెడి, ఊపిరి మాత్రమే మిగిలి రాజ్యపాలనలో అసమర్థుడై ఉండగా, అతడి మంత్రి తానొక్కడే ప్రాధాన్యం వహించి రాజ్యపాలనంతా తన వశం చేసుకొని నితంతు మహారాజును త్రోసిపుచ్చి అతడి రాజ్యసంపదను అంతా తానే గ్రహించాడు. అందువల్ల వీరిద్దరి మాటలు నీకు కీడు చేసేటటువంటివి’’ అని అన్నాడు.
కర్ణుని మాటలు విన్న ద్రోణాచార్యుడు అతడిని కఠినంగా మందలించాడు.
అప్పుడు విదురుడు కల్పించుకొని ధృతరాష్ట్రునితో...
‘‘మహారాజా! భీష్మద్రోణులు చెప్పినదే ఉచితంగా యున్నది. దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు అవివేకులు. వారి మాటలు వినక పాండవులను రప్పించి ప్రేమోతో అర్థరాజ్యాన్ని యిమ్ము. పాండవులు యిప్పుడు ద్రుపద దృష్టద్యుమ్నులతోకలిసి అజేయులు. బాంధవ్య బంధనం అమితమయింది.
నీ పుణ్యంవలన ఆ మహాత్ములు లక్క యింట్లో తల్లితో గూడా బ్రతికి బయటపడ్డారు. నీకు అంటిన అపకీర్తి బురదను, పాండవులపట్ల దయచూపటం అనే నీళ్ళతో కడుక్కో! నీ కొడుకు దుర్యోధనుడు చేసే తప్పులవలన లోకంలోని ప్రజలందరికి అపాయం కల్గుతుంది. అట్లుగాకుండా రక్షింపుము’’ అని హితబోధ చేశాడు.
‘‘మీరు ఆజ్ఞాపించిన విధంగా పాండవులకు సగభాగం రాజ్యాన్ని ఇచ్చాను’’ అని భీష్మద్రోణ విదుర దుర్యోధ మొదలైన పుత్రులందరి ఎదుట నిర్ణయించాడు ధృతరాష్ట్రుడు. పాండవులను రప్పించానికి విదురుని ద్రుపద పురానికి పంపాడు.

- ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము