జాతీయ వార్తలు

ముంబయి, ఫిబ్రవరి 22: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ను ముంబయి పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. మంగళవారం రాత్రి తాజ్ హోటల్లో దక్షిణాఫ్రికాకు చెందిన భారతీయ వ్యాపారి ఇక్బాల్ శర్మపై దౌర్జన్యం చేసి కొట్టాడన్న ఆరోపణపై పోలీసులు ఆయనను అరెస్టు చేసారు. హోటల్లో సైఫ్ అలీఖాన్ తనపై దాడి చేసినట్లు ఇక్బాల్ శర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దక్షిణ ముంబయిలోని నారిమన్ పాయింట్ వద్ద సైఫ్ అలీఖాన్ లాయరు చాంబర్లో ఉన్న ఆయనను పోలీసులు అరెస్టు చేసి కొలాబా పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. దాడి జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో సైఫ్ అలీఖాన్ స్నేహితురాలు, బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా అతనితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సైఫ్పై పోలీసులు బెయిలుకు అవకాశం ఉన్న సెక్షన్ కింద కేసు నమోదు చేసినందున అతడ్ని బెయిలుపై విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. హోటల్లో సైఫ్, అతని వెంట ఉన్న వాళ్లు పెద్దగా గొడవ చేస్తూ ఉండడంపై ఇక్బాల్ శర్మ అభ్యంతరం చెప్పాడని, అది గొడవకు దారి తీసినట్లు చెప్తున్నారు.
Add new comment