అర్చన పర్యాటకం

స్మ్మరించినంతనే..

  • - దాసరి దుర్గాప్రసాద్ 8977676085
  • 19/02/2012

కాశీ క్షేత్రాన్ని వారణాసి అని, బెనారస్ అని పిలుస్తుంటాం. పురాతన శైవ ధామాలలో ఇది ఒకటి. సకల పాపాల పాతక నాశినిగా, జ్ఞాన ప్రదాయినిగా, ముక్తిప్రదాయినిగా పేర్గాంచింది. గాయత్రీ మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీ నగరంతో సమానమైన మహానగరం, విశే్వశ్వర లింగానికి సమానమైన మరో లింగం లేదని పురాణాలు చెప్తాయి. పావన గంగానదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం మనకు లభించిన పుణ్యధామం. కాశీ విశ్వనాథ లింగ దర్శనం ముక్తిదాయకం. శివపురి, ముక్త్భిమి, తపఃస్థలి, అవిముక్త్, వారణాసి, కాశీ తదితర పేర్లతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం గురించి కాశీ ఖండంలో ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. గంగా నదీమతల్లి ధనుషాకారంలో ఉన్న ఈ దివ్య క్షేత్రాలలోనే వరుణ, అసి నదులు గంగలో కలుస్తాయి. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి ‘వారణాసి’అనే పేరొచ్చింది. ఇక్కడ 3000 సంవత్సరాల క్రితం ‘కాశీ’జాతివారు నివసించేవారు. అందువల్ల దీనికి ‘కాశీ’అనే పేరొచ్చింది. సాక్షాత్తు పార్వతీపరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని, శివుని త్రిశూలంపై కాశీనగరం నిర్మించబడిందని పురాణ వచనం. పురాతన కాలంలోని ఆలయాన్ని తిరిగి శివభక్తురాలైన అహిల్యాభాయి హాల్కర్ 1777లో ఈ ఆలయాన్ని నిర్మించగా పంజాబ్ కేసరి మహారాజా రణ్‌జీత్‌సింగ్ ఈ ఆలయంపై బంగారు రేకును తొడిగించినట్టు చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తుంది. కాశీ క్షేత్రంలో కొలువైన కాశీవిశ్వనాథ్ లింగదర్శనం సర్వపాపహరణం. శివ కైవల్యప్రాప్తికి మూలం. గర్భాలయంలో కొలువుదీరిన విశే్వశ్వరుడు లింగ రూపంలో దర్శనం ఇస్తాడు. ఈ లింగ ఆకారం చిన్నది.
కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందంటారు. ‘కాశ్యంతు మరణాన్ముక్తిః’. ఇక్కడ శవ దహనం జరుగుతూనే వుంటుంది. ఆ కారణంగా ఈ క్షేత్రాన్ని మహాశ్మశానమని పిల్వడం జరుగుతోంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రంగా విఖ్యాతిగాంచిన కాశీ క్షేత్ర మహిమ, విశ్వనాథ లింగ మహత్తు విశేషమైనది.
ఈ పవిత్ర క్షేత్రం ఆవిర్భావానికి సంబంధించి పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. సనాతన బ్రహ్మ మొదట నిర్గుణం నుంచి సగుణ శివరూపధారణ చేశాడు. తిరిగి శివశక్తి రూపంతో స్ర్తి-పురుష భేదంతో రెండు రూపాల ధారణ చేశాడు. ప్రకృతి పురుషుడు (శక్తి-శివుడు) ఇద్దరినీ శివుడు ఉత్తమ సృష్టి సాధనకై ఆకాశవాణి ద్వారా తపస్సుచేయమని ఆదేశించాడు. తపస్సుకై ఉత్తమ స్థానం ఎంపిక చేశాడు. అపుడు నిర్గుణ శివుడు తననుంచే సమస్త తేజస్సునూ సేకరించి అత్యంత శోభాయమానమైన ‘పంచకోశీ’నగరం నిర్మించాడు. అక్కడ స్థితుడైన విష్ణువు ఎంతోకాలం నుంచీ శివునికై తపస్సుచేశాడు. అతని శ్రమ ఫలించి అక్కడ అనేక జలధారలు ప్రవహించాయి. ఈ అద్భుత దృశ్యం చూసి విస్మయం చెందిన విష్ణువు తల ఆడించగానే ఆయన చెవినుంచి ఒక మణి కింద పడింది. అప్పటినుంచీ ఆ స్థానం మణికర్ణికగా పేర్గాంచింది. మణికర్ణిక ఐదు క్రోసుల విస్తారంగల సంపూర్ణ జలరాశినీ శివుడు తన త్రిశూలంలో బంధించాడు. దానిలో విష్ణువు భార్యాసమేతంగా నిదురించాడు. శివుని ఆజ్ఞమేరకు విష్ణువునాభినుంచి బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మద్వారా అద్భుత సృష్టి జరిగింది. మహాపుణ్యదాయక పంచకోశ నగరి కోట్లాది రకాల పాతక నాశిని. ఉత్తమ ముక్తిదాయిని. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల ద్వారా శాసించబడే ఈ నగరంలో దేవతలు కూడా మృత్యువును కోరుకుంటారు. కాశీనగరం మోక్షప్రదాయిని. ఈ క్షేత్రంలో చేసిన ఏ సత్కార్యమైనా సహస్రకల్పాలలో కూడా క్షయం కాదు. మానవ జన్మ శుభాశుభ ప్రకారాలుగా ఉంటుంది. బనార నామధేయుడైన ఒకరాజు ఈ తీర్థ స్థానపు వైభవాన్ని ద్విగుణీకృతం చేశాడు. అందువల్ల కాశీని బనారస్ అని కూడా పిలుస్తారు. బనారస్‌లో 1500 భవ్య ఆలయాలున్నాయి. కాశీలోని గంగా జలాన్ని రామేశ్వర క్షేత్రాన వున్న రామేశ్వర లింగానికి అభిషేక జలంగా వినియోగిస్తారు. కాశీనగరాన కాలభైరవుడు శునక వాహనుడై గస్తీ తిరుగుతుంటాడని ప్రతీతి. ఈ నగరం బ్రహ్మసృష్టి కాకపోవడంవల్ల బ్రహ్మ ప్రళయాన ఇది నశించదు. అలాగే గంగానది తీరాన కాశీ క్షేత్రాన 64 స్నాన ఘట్టాలున్నాయి. ఇవి ప్రసిద్ధమైన పవిత్ర ఘట్టాలుగా పేర్గాంచాయి. ఆసీఘాట్, దశాశ్వమేధ ఘాట్, వర్ణసంగమ్, పంచగంగ, మణికర్ణక, హరిశ్చంద్ర ఘాట్‌లు ముఖ్యమైనవి. ఈ దివ్య క్షేత్రాన 59 శివలింగాలు, 12 సూర్యనారాయణమూర్తులు, 56 వినాయకులు, 8 భైరవులు, 9 దుర్గామాతలు, 13 నరసింహులు, 16 కేశవాలయాలున్నాయి. వీటిలో బిందుమాధవుడు, డుండి విఘ్నేశ్వరుడు, దండి పాణేశ్వరుడు ఆలయాలు ముఖ్యమైనవి. కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగాలలో హరిశ్చంద్రాది మహారాజులతోపాటు రామాయణ, భారత, భాగవత ప్రాశస్త్యంగల అపురూప క్షేత్రమిది. మోక్షపురాలలో ఒకటిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో అమ్మవారు విశాలాక్షి. అక్షిత్రయంలో ఒకటి. అష్టాదశ పీఠాలలో ఒకటి. మాతా అన్నపూర్ణేశ్వరి ఆలయం కూడా ఈ క్షేత్రంలో ఉంది. మహారాజా రణజీత్‌సింగ్ కాశీవిశ్వనాథ ఆలయ గోపురాలను సువర్ణ ఖచితం చేయించగా ఈ మందిరంలోగల ప్రంచడమైన గంటను నేపాల్ రాజు బహూకరించాడు. కాశీ పుణ్యక్షేత్రం, విశే్వశ్వర జ్యోతిర్లింగం ప్రపంచంలోని అతి పవిత్రమైన స్థానాలు. కాశీ క్షేత్రంలో మరణం, అంతిమ సంస్కారం ముక్తిమార్గాలుగా భావిస్తారు. కాశీ క్షేత్ర సందర్శనం, కాశీ విశ్వనాథుని దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయి.
- దాసరి దుర్గాప్రసాద్
8977676085

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading