క్రీడాభూమి
ఫైనల్లో చోటు దక్కేదెవరికో?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటికే రెండుసార్లు చాంపియన్గా అవతరించిన కోల్కతా నైట్ రైడర్స్ శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్పై దృష్టి సారించింది. ఈ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనున్న కోల్కతా గెలుపుపై ధీమాతో ఉంది. రౌండ్ రాబిన్ లీగ్లో సన్రైజర్స్, కోల్కతా విజయాలను నమోదు చేసుకున్నాయి. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 25 పరుగులతో గెలుపొందిన కెప్టెన్ దినేష్ కార్తీక్ నాయకత్వంలోని కోల్కతా క్వాలిఫయర్-2లో సన్రైజర్స్తో పోటీకి అర్హత సాధించింది. కోల్కతా వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్లలో (ఈనెల 12న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 31 పరుగుల తేడాతో గెలుపొందింది. 15న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 19న సన్రైజర్స్ హైదరాబాద్పై ఐదు వికెట్లతో గెలిచింది. 23న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను 25 పరుగుల తేడాతో ఓడిచింది) కోల్కతా ఘన విజయాలను తన ఖాతాలో నమోదు చేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ఉంది.
టేబుల్ టాపర్గా నిలిచిన సన్రైజర్స్ అన్ని టీమ్ల కంటే పాయింట్లుపరంగా, నెట్ రన్రేట్పరంగా ఏవిధంగా చూసుకున్నా మెరుగుగా ఉన్నా గడిచిన వరుస నాలుగు మ్యాచ్లలో ఓటమి చెందింది. (ఈనెల 13న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. 17న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 14 పరుగులతో ఓటమి చెందింది. 19న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 22న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది). నిర్లక్ష్యంతోపాటు మిడిల్ ఆర్డర్ వైఫల్యం హైదరాబాద్ వరుస ఓటములకు కారణమయ్యాయనేది కాదనలేని వాస్తవం. కేవలం కెప్టెన్ కేన్ విలియమ్సన్ (ఇంతవరకు 685 అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు) ఒక్కడే దాదాపు ప్రతిసారి జట్టును గెలిపించే భారాన్నంతా మోయడంతో జట్టుకు ఈ పరిస్థితి వచ్చింది. అయితే, సన్రైజర్స్ ప్రధాన బలం బౌలర్లే. భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ కౌల్, సందీప్ శర్మ వంటివారితోపాటు విదేశీ బౌలర్లు రషీద్ ఖాన్ వంటివారు తమ అద్భుత బౌలింగ్తో జట్టును కాపాడుకుంటూ వస్తున్నారు. సన్రైజర్స్ గెలుపులో బౌలర్లే కీలక పాత్ర పోషిస్తుండడం, కెప్టెన్ విలియమ్సన్ సహా ఒకరిద్దరు బ్యాట్స్మెన్లు తలో కొంత సహకారం అందిస్తున్నా శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్లో, మరోపక్క ఫీల్డింగ్లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్న కోల్కతాను ఢీకొనాలంటే కష్టసాధ్యమే. అయినా కోల్కతా బ్యాట్స్మెన్లను త్వరితగతిన పెవిలియన్ దారిపట్టిస్తే హైదరాబాద్కు మ్యాచ్ సులభతరం అవుతుందనడంలో సందేహం లేదు. ఈనెల 22న చెన్నై సూపర్ కింగ్స్తో ముంబయిలో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఆట చివరి వరకు ఎంతో ఉత్కంఠ రేకెత్తించినా, సన్రైజర్స్ బౌలర్ కార్లోస్ బ్రాత్వైట్ డెత్ ఓవర్లు వేసినా ఫలితం కాలేదు. ఈ మ్యాచ్లో గెలిచిన చెన్నై డైరెక్ట్గా ఈనెల 27వ తేదీన ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగే తుదిపోరు (ఫైనల్)కు సిద్ధమైంది. సన్రైజర్స్ జట్టులో భువనేశ్వర్ కుమార్ ఇంతవరకు తొమ్మిది వికెట్లు, ఆఫ్గనిస్తాన్ మణికట్టు మాంత్రికుడు రషీద్ ఖాన్ 18 వికెట్లు, సిద్ధార్థ కౌల్ 19 వికెట్లు తీసుకున్నారు. ఇక బ్యాటింగ్లో కెప్టెన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు (685), ఆ తర్వాత శిఖర్ ధావన్ (437), మనీష్ పాండే (284), యూసుఫ్ పఠాన్ (212) పరుగులు చేసినా కెప్టెన్ మినహా మిగిలినవారు సాధించిన ఘనత చెప్పుకోదగ్గదేమీ కాదు. శుక్రవారంనాటి రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో హైదరాబాద్ టీమ్లోని మిడిలార్డర్ ఆటతీరు మెరుగుపడితే పటిష్టమైన కోల్కతాను ఢీకొనవచ్చునని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక కోల్కతా టీమ్కు కెప్టెన్గా కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దినేష్ కార్తీక్ విజయవంతమైన బ్యాట్స్మన్గా, వికెట్ కీపర్గా సమర్థవంతమైన, చరుకైన పాత్రను పోషిస్తున్నాడు. గత కెప్టెన్ గౌతం గంభీర్ మాదిరిగా సక్సెస్ఫుల్ కెప్టెన్గా దినేష్ కార్తీక్ పేరుగాంచాడు. దినేష్ నాయకత్వంలో బ్యాట్స్మెన్లు, బౌలర్లు సమర్థవంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ కారణం వల్లనే వరుసగా జరిగిన నాలుగు మ్యాచ్లలో ఘన విజయాలను తమ ఖాతాలో నమోదు చేసుకుంది కోల్కతా నైట్ రైడర్స్. కెప్టెన్ దినేష్ కార్తీక్ సైతం జట్టులోని మిగిలిన బ్యాట్స్మెన్ల కంటే అద్భుతంగా రాణిస్తూ కెప్టెన్సీ ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చుతున్నాడు. ఓపెనర్లు బాగా రాణించకున్నా మిడిలార్డర్లో బరిలోకి దిగుతున్న దినేష్ కార్తీక్ ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడుతున్నాడు. సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ వంటివారు బ్యాటింగ్లో కెప్టెన్కు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇక బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ (16 వికెట్లు), పీయూష్ చావ్లా (13 వికెట్లు) వంటివారితోపాటు ఆండ్రూ రస్సెల్, యువ పేసర్ ప్రసీధ్ కృష్ణ వంటివారు ఆల్రౌండ్ ప్రతిభ చూపుతుండడంతో సొంత మైదానంలో ప్రత్యర్థిని మట్టికరిపించి ఫైనల్కు చేరి, చెన్నై సూపర్ కింగ్స్తో తలపడి ఐపీఎల్ కప్ను మూడోసారి కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధిస్తామనే ధీమాతో ఉంది దినేష్ కార్తీక్ సేన. తమ సొంత మైదానంలో ఏప్రిల్ 14న జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో సన్రైజర్స్ చేతిలో పరాజయాన్ని చవిచూసిన కోల్కతా హైదరాబాద్ సొంత గడ్డపై ఈనెల 19న జరిగిన మ్యాచ్లో అవే ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి అందుకు తగిన ప్రతీకారం తీర్చుకుంది. ఇపుడు మళ్లీ తమ సొంత మైదానంలో అదే జట్టుతో జరిగే రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో ఘన విజయాన్ని తన ఖాతాలో నమోదు చేయాలని కోల్కతా తహతహలాడుతోంది.
చిత్రం.. సన్రైజర్స్, నైట్రైడర్స్ జట్ల కెప్టెన్లు కేన్ విలియమ్సన్, దినేష్ కార్తీక్