క్రీడాభూమి
ఐపీఎల్ కిరీటం దక్కేదెవరికో?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తుది సమరం ఆదివారం ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరుగనుంది. ఇప్పటికే ఫైనల్కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్, శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్పై గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈ ‘బిగ్ ఫైట్’లో మరోసారి తలపడనున్నాయి. ఈనెల 22న ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠ పోరులో చివరికి విజయం చెన్నైనే వరించింది. దీంతో సూపర్ కింగ్స్ డైరెక్ట్గా ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ పోటీలో పరాజయం పాలైన సన్రైజర్స్ శుక్రవారం కోల్కతాతో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో ఘన విజయాన్ని నమోదు చేసుకోవడంతో ఆదివారం నాటి ఫైనల్లో మళ్లీ చెన్నైతో తలపడనుంది. 2018 ఐపీఎల్ కిరీటం ఎగురవేసుకుపోవడానికి ఈ రెండు జట్లు తహతహలాడుతున్నాయి. 2010, 2011 సీజన్లలో జరిగిన ఐపీఎల్లలో చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్గా అవతరించింది. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో హైదరాబాద్ను ఓడించి మూడోసారి టైటిల్ను కైవసం చేసుకోవడంతో హ్యాట్రిక్ సాధించాలనే ఉత్సాహంతో ఉంది. అదేవిధంగా సన్రైజర్స్ 2016 ఐపీఎల్ సీజన్లో ఒకసారి మాత్రమే చాంపియన్గా అవతరించినా, రెండోసారి కూడా ఈ కిరీటాన్ని దక్కించుకోవాలని ఉబలాటపడుతోంది.
శుక్రవారం ఈడెన్ గార్డెన్స్లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ సర్వత్రా ఉత్కంఠను రేకెత్తించినా చివరకు ఐపీఎల్లో రెండుసార్లు చాంపియన్లుగా అవతరించిన కోల్కతా జట్టును హైదరాబాద్ 14 పరుగుల తేడాతో ఓడించి, ఫైనల్లో చోటు దక్కించుకుంది. ఇదే ఉత్సాహంతో చెన్నైతో జరిగే తుది పోరులో రాణించి మరోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంటామని సన్రైజర్స్ ఆశాభావంతో ఉంది. హైదరాబాద్ జట్టులో అఫ్గనిస్తాన్ లెగ్స్పిన్నర్ రషీద్ ఖాన్ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించడంతో ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో కేవలం 19 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్ బ్యాట్స్మన్గా కూడా తనదైన పాత్రను పోషించాడు. కేవలం 10 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేయడంతోపాటు రెండు అద్భుత క్యాచ్లు పట్టడమే కాకుండా ఒకరిని రనౌట్ చేశాడు. చెన్నైతో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో సైతం రషీద్ ఖాన్ 11 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్న విషయాన్ని గమనంలోకి తీసుకుంటే ఫైనల్లో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి క్వాలిఫయర్లో గాయం కారణంగా ఆడలేకపోయిన శాం బిల్లింగ్స్ స్థానంలో వచ్చిన ఫఫ్ డుప్లెసిస్ 67 పరుగులతో అజేయంగా నిలబడడంతో ఆ మ్యాచ్లో ధోనీ సేన విజయం సాధించింది. సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్తోపాటు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ కౌల్, ఆల్రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్ వంటివారు అద్భుతంగా రాణిస్తుండడంతో మ్యాచ్ను తమవైపు తిప్పుకునే సామర్థ్యం కలిగి ఉన్నారు. హైదరాబాద్ జట్టులోని మిడిలార్డర్ విఫలమవుతున్నా కెప్టెన్ విలియమ్సన్, ఓపెనర్లతోపాటు బౌలర్లు సమష్టిగా రాణిస్తే చెన్నైకి ఇబ్బందులు తప్పవని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇక చెన్నై సూపర్కింగ్స్లో కెప్టెన్ ఎం.ఎస్.్ధనీతోపాటు షేన్ వాట్సన్, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఫఫ్ డుప్లెసిస్ వంటివారు అద్భుతంగా రాణిస్తుండడంతోపాటు బౌలర్లు రవీంద్ర జడేజా, హర్బజన్ సింగ్, శార్దూల్ ఠాకూర్ వంటివారు తమ పాత్రను సమర్థవంతంగా పోషించి సన్రైజర్స్ను కట్టడి చేసే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా దాదాపు ఇరు జట్లు అన్నివిధాల సమాన బలాబలాలున్న నేపథ్యంలో ఫైనల్ పోరులో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.