శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

శబరికి దర్శనం ఇచ్చి పంపా తీరం చేరిన రామలక్ష్మణులు( అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పడమటి దిక్కుగా పోతున్న రామలక్ష్మణులు దారిలో కొండలు, తీయటి పండ్లున్న అడవులు, చెట్లు చూసుకుంటూ పోయి కొండ దగ్గర ఆ రాత్రి గడిపి, సూర్యోదయం అవగానే పరిశుద్ధ జలాల పంపానదిని చూస్తూ తిరిగి ప్రయాణం కొనసాగించారు. పడమటి దిక్కున వున్నా ఒడ్డులో వెతికి అక్కడ శబరి వుండే రమ్యమైన ఆశ్రమాన్ని చూసి సమీపించారు. (పంప ఒడ్డున ఈ ఆశ్రమం ఇప్పటికీ వుందట. ఈ గుహ వాకిట్లో పట్టపగలు ఎండలు మండిపోతున్నప్పటికీ, దుప్పటి కప్పుకొనేంత చల్లటి గాలి వీస్తుంది) శబరి వీరిని చూసి చేతులు మోడ్చి, వారి పాదాలను అంటి నమస్కరించి, పాద్యం ఇచ్చి, తగిన ఉపచారాలను అన్నింటినీ శాస్త్ర ప్రకారం కావించింది. ఆ తరువాత నిలబడి వున్న ఆమెను చూసి శ్రీరామచంద్రుడు పలకరించాడు.
‘సాధుచారిత్రా! నీ తపస్సులు, వ్రతాలు విఘ్నం లేకుండా జరుగుతున్నాయి కదా? కోపంలోను, ఆహారంలోను నిర్మలమైన మనస్సు కలదానా! నియమం వుంది కదా? నువ్వు నియమించుకున్న వ్రతాలు నెరవేరుతున్నాయా? మనస్సు సర్వదా ప్రసన్నంగా, శాంతంగా వుంది కదా? గురుసేవలు కొనసాగుతున్నాయి కదా? దానివల్ల ఫలితం అనుభవానికి వస్తున్నదా?’ అని రామచంద్రమూర్తి శబరిని ప్రశ్నించగా, తపస్సు ధనంగా కల ఆ పుణ్యస్ర్తి, ముక్తులైన వారికి సమ్మతమైన నడవడికల ఆ యోగ సిద్ధురాలు, కౌసల్యా పుత్రుడిని చూసి మిక్కిలి భక్తితో, వినయంతో ఈ విధంగా అన్నది.
(గురువు, గురుపుత్రులు లేరు కదా! ఇప్పుడేమి శుశ్రూష అనకూడదు. గురువు పోయినా నిజమైన శిష్యులు గురుపాదుకలు వుంచుకుని వాటికి గురుపూజ చేసినట్లే చేస్తారు. మనస్సు, వాక్కు, కాయం శుద్ధంగా ఉంచుకుని గురుభక్తి, దైవభక్తి కలిగుంటే భగవంతుడు మనల్ని వెతుక్కుంటూ తానే వస్తాడని శబరి - రామ చరిత్రం వల్ల అర్థమవుతున్నది. భగవత్ దర్శనాపేక్ష వుంటే చాలు. రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ పోయి దర్శించడం శబరికి సాధ్యమయ్యేదా?)
‘అపహతపాపా! నా గురు శుశ్రూషకు ఫలం నిన్ను చూసిన తరువాత ఇప్పుడే కదా ఫలించింది? గురు శుశ్రూషకు ఫలం భగవత్సాక్షాత్కారం. అది నాకు ఇప్పుడే కలగడం వల్ల గురు శుశ్రూష ఇప్పుడే ఫలించింది. అలాగే నా తపాలకు, వ్రతాలకు ఫలమేంటి? భగవత్సాక్షాత్కారమే! అది కూడా నీ దర్శన భాగ్యాన ఇప్పుడే ఫలించింది పుండరీకాక్షా! భూమీద జన్మించిన వారిలో సార్థకజన్ముడు ఎవడు? భగవంతుడిని సాక్షాత్కారింప చేసుకున్నవాడే! ఇప్పుడు నేను నిన్ను కళ్ళారా ప్రాకృత చక్షువులతో చూడగలగడం అంటే నా జన్మ సార్థకం అయినట్లే కదా? దేవతా శ్రేష్ఠుడా! నిన్ను చేతులారా పూజించి మోక్షం పొందుతాను. నీ దయార్ద్ర దృష్టి వల్ల పాపాలు నశించాయి. అరిషడ్వర్గం హతమయింది. మోక్షం లభించింది.’
‘శ్రీరఘు రామచంద్రా! నేను శుశ్రూష చేస్తుండే నా గురువులు, మీరు చిత్రకూటానికి వచ్చారనీ, ఇక్కడికి వస్తారనీ, మీ దర్శనం చేసుకుంటే నాకు మళ్లీ జన్మలేని లోకం లభిస్తుందనీ చెప్పిన కారణాన మీ కొరకు వేచి చూస్తున్నాను. సంతోషంగా మీ కోసం మంచివి, ఏరి కోరి నానా రకాలైన కందమూల ఫలాలు సంపాదించాను.’ శబరి మాటలకు ఆమెను చూసి రామచంద్రమూర్తి ఇలా అన్నాడు. ‘అమ్మా! నీ గురువుల ప్రభావం విన్నాను. అది ప్రత్యక్షంగా చూడాలని కోరికగా వుంది. కాబట్టి నీకిష్టం వుంటే ఆ చిత్రాలను చూపించు.’
రామచంద్రమూర్తి అడిగిన దానికి బదులుగా శబరి, ఆయనతో ఇలా జవాబిచ్చింది. ‘రామచంద్రా! వర్షించే మేఘాలలాగా నల్లగా వ్యాపించి మృగాలతో, పక్షులతో నిండి వున్న ఈ మతంగవన స్థలంలో తమ మంత్రాల శక్తితో మా గురువులు తీర్థాలను కల్పించారు. పడమటి వేది మీద మా స్వాములు ముసలితనంతో వణుకుతున్నప్పటికీ భగవదారాధన మానకుండా పూలతో పూజించేవారు. వారి తపోమహిమ వల్ల వేదులు వాళ్లు లేకున్నా దిక్కులన్నిటినీ ప్రకాశింప చేస్తున్నాయి. శుష్కోపవాసాలు చేసి బలహీనులై నడవలేని కారణాన సముద్రాలకు పోలేకపోతే, వాళ్ల పిలుపు మేరకు సముద్రాలే ఇక్కడికి వచ్చాయి. చూడు.. రామచంద్రా! మా గురువులు స్నానాలు చేసి తడిసిన నారవస్త్రాలు ఈ చెట్ల కొమ్మల మీద వుంచి పోయారు. వారి తపః ప్రభావం వల్ల నేటికీ అవి ఆరలేదు. వారు దేవతారాధనలో పూజించిన పూలు ఇప్పటికీ వాడిపోలేదు. వినతగినవన్నీ విన్నావు.. చూడతగినవన్నీ చూశావు. ఇక నేను నా గురువులున్న చోటుకు పోయి వాళ్లను దర్శించాలి. నాకు ఆజ్ఞ ఇవ్వు.’
ఆ పుణ్యాత్మురాలు చెప్పిన అమతలన్నీ విన్న రామచంద్రుడు ఆమె గురుభక్తికి, దైవభక్తికి మెచ్చి, ఇలా అన్నాడు. ‘సాధుచారిత్రా! నువ్వు చేయాలనుకున్న సత్కార్యాలన్నీ గ్రహించినట్లే భావించు. నీ కోరిక ప్రకారం వెళ్లిపో.’
శబరి పరమపదానికి పోగా, ఏకాగ్ర మనస్కుడై, తన తమ్ముడు లక్ష్మణుడిని చూసి రామచంద్రుడు మతంగముని గురించి చెప్పాడిలా. ‘ఆహా! ఏమి, ఈ ఋషుల మహిమ? అవి చూస్తూ వుంటే చాలా ఆశ్చర్యంగా వుంది. లక్ష్మణా! ఇక్కడ జింకలు, పులులు, మచ్చికతో సహజ విరోధం వదిలి నమ్మకంగా తిరుగుతున్నాయి. మునీశ్వరులు వున్నప్పుడే కాకుండా వాళ్లు పోయిన తరువాత కూడా వాళ్ల తేజస్సు వ్యాపించి ఉన్నందున హింస అనేది కనపడటం లేదు. మునీశ్వరుడు సృష్టించిన సముద్ర జలాలతో పితృ తర్పణం చేశాం. ఇది మనకు మేలు చేస్తుంది. లక్ష్మణా! మన కష్టకాలం పోయింది. ఇక సౌఖ్యమే కలుగుతుంది. ఇక్కడికి సుగ్రీవుడు వుండే పర్వతం దగ్గరే. ఎంతో దూరం లేదు. ఇక మనం పంపకు పోదాం. అక్కడే కదా సుగ్రీవుడు వానరులతో వుండే ఋశ్యమూకం ఉన్నది. మనం సుగ్రీవుడిని చూడడానికి పోదాం పద. సీతను వెతికే పని అతడిదే కదా?’ అన్న మాటలకు లక్ష్మణుడు తానూ ఆ విషయమే ఆలోచిస్తున్నానని అన్నాడు. వాళ్లు పంపాతీరం చేరారు.
పంపా సరోవరం చూసిన రామలక్ష్మణులు దాని సౌందర్యానికి, వ్రతనిష్ఠ కల మునులతో కూడిన దాని మహిమకు ఆశ్చర్యపడి నేత్రానందంగా దానే్న చూసుకుంటూ పోయారు. దానికి కొంచెం దూరంలో వున్న మతమ్గు కొలనులో స్నానం చేసి ఆ రాజకుమారులు సమీపంలోని అందమైన వనాలను చూస్తూ పోసాగారు. అలా పోతున్న వారికి అందమైన తీగలతో ప్రకాశించే బొట్టుగు చెట్లు, మాదిఫల వృక్షాలు, గనే్నరులు, మొల్ల తీగెలు, మర్రులు, ఏడాకుల అరటులు, మొగలి చెట్లు, ఎర్ర గనే్నరులు, మామిడి తోపులతో కూడిన ఆ వనం అలంకరించబడిన పడుచులాగా వుంది. చిలుకలు, గుడ్డికొంగలు, నేమిళ్లు లాంటి మనోహరమైన పక్షుల ధ్వనులు వింటూ సంతోషంగా పంప చేరారు.
అప్పుడు రాముడు లక్ష్మణుడితో, ‘ఈ పంప ఒడ్డున వున్న ఋశ్యమూక పర్వతం మీదనే కదా ఆ పుణ్యాత్ముడు సుగ్రీవుడున్నది? శోకతప్తుడినై రాజ్యాన్ని కోల్పోయి, భార్యను పోగొట్టుకుని ఎలా బతకాలి? కాబట్టి మన పని కోసం నువ్వు సుగ్రీవుడిని చూడడానికి వెళ్లు. నేను పోవడం మర్యాద కాదు.’ ఇలా లక్ష్మణుడితో చెప్తూ, రామచంద్రమూర్తి అధికమైన దుఃఖంతో పంపా తీరాన్ని చూడడానికి అనువైన స్థలానికి తమ్ముడితో కలిసి చేరాడు. అందమైన ఆ కొలను చూసిన వారికి ఇన్నాళ్లు కలగని సంతోషం కలిగింది. - అరణ్యకాండ సమాప్తం

-సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12