రాష్ట్రీయం

శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆణివార ఆస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 17: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాలకట్ల ఆణివార ఆస్థానం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ పెద్ద జియ్యంగార్, చిన్న జీయంగారు, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ దంపతులు, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ఇన్‌చార్జ్ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ దంపతులు పాల్గొన్నారు. ముందుగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారువాకిలి ముందు ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా వేంచేపుచేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనుల వారిని దక్షిణాభిముఖంగా వేంచేపుచేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపుచేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు చేసి ప్రసాదాలు నివేదించారు. అనంతరం తిరుమల చిన్న జీయంగారు, టీటీడీ చైర్మన్ , ఈఓ, తిరుపతి జేఈఓ, ఇతర ఉన్నతాధికారులు వెంట రాగా తిరుమల పెద్ద జీయంగారు పెద్ద వెండి తట్టలో ఆరు పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయంలోకి వచ్చారు. అందులో నాలుగు పట్టువస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలతో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు. తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో తలకు ‘పరివేష్టం’ కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు పెద్ద జీయంగారికి, చిన్న జీయంగారికి టీటీడీ తరపున కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్‌కు ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి, మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచారు. అనంతరం ఆస్థానం ముగిసింది.
వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు
పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి-ఏప్రిల్ నెలలకు మార్చారు. కాగా ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా మంగళవారం అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.