జాతీయ వార్తలు

టీఆర్‌ఎస్ ప్రభుత్వం అక్రమాల పుట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై దర్యాప్తునకు ఆదేశిస్తామని బీజేపీ లోక్‌సభ సభ్యుడు, సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ ప్రకటించారు. దత్తాత్రేయ, శాసన మండలి మాజీ సభ్యుడు వన్నాల శ్రీరాములు, వద్రె శ్రీరాం సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, చంద్రశేఖరరావు నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం తదితర అన్ని పథకాలు, ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ అక్రమాలన్నింటిపై దర్యాప్తునకు ఆదేశిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తుందని, అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 15న హైదరాబాద్‌కు వస్తున్నారు.. అయితే రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులతో చర్చలు జరిపిన అనంతరం అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం ప్రారంభం అవుతుందని దత్తాత్రేయ చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. బీజేపీకి బైచాన్స్ మెరజాటీ లభిస్తే మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా అని ప్రశ్నించగా, ఇవన్నీ ఊహాజనిత ప్రశ్నలు.. వీటికి సమాధానం ఇవ్వటం సాధ్యం కాదని దత్తాత్రేయ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణలో జరుగనున్న ముక్కోణపు పోటీలో బీజేపీ బాగా లాభపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనసభ ఎన్నికలకోసం భావసారూప్యత గల పార్టీలు, సామాజిక వర్గాలతో పొత్తు పెట్టుకుంటామని, ఎవరితో పొత్తు సాధ్యమవుతుంది.. ఎవరితో సీట్ల సర్దుబాటు చేసుకోవచ్చు అనేది పరిశీలిస్తున్నామని దత్తాత్రేయ తెలిపారు.
24 గంటల విద్యుత్, నీటి పారుదల కార్పొరేషన్‌కు కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యుదీకరణ పథకానికి నిధులు వస్తున్నాయని అన్నారు. సీతారామ ప్రాజెక్టు, ఇందిరమ్మ వరద పథకం, చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, కాంతానపల్లి, తుపాకులగూడెం నీటి పారుదల పథకాలకు కేంద్రం నుండి రూ.10,160 కోట్లు లభించాయని దత్తాత్రేయ తెలిపారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకుగాను రూ.892 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. ‘సొమ్మొకడిది సోకడిది’ అన్నట్లు కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నిధులిస్తుంటే.. చంద్రశేఖరరావు మాత్రం ఈ పథకాలన్నీ తనవేనంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని దత్తాత్రేయ విమర్శించారు. చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికలకు వెళ్లటం తొందరపాటు, నిరంకుశ చర్య అని అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఎలాంటి అవగాహన లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రశేఖరరావు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయాడని ఆయన విమర్శించారు. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఖండించారు. ప్రతిపక్షం ‘మోడీ హటావో’ అంటే బీజేపీ ‘దేశ్‌కో బచావో’ అంటున్నామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో తిరుగులేని నాయకుడు.. ఆయనతో ఎవ్వరూ పోటీ పడలేరని దత్తాత్రేయ చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వతంత్రంగా పోటీచేసి ఎప్పుడూ అధికారంలోకి రాలేదని దత్తాత్రేయ చెప్పారు. 1998లో ఘోరంగా ఓడిపోతే 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి మూలంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడన్నారు. 2006లో బీజేపీ నుండి తప్పుకుని 2014లో నరేంద్ర మోదీతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారని దత్తాత్రేయ విమర్శించారు. చంద్రబాబు స్వయం ప్రకాశం కాడు.. ఇతరుల వెలుతురుతో వెలుగుతాడని.. అలాంటి నాయకుడు ఇప్పుడు ప్రధాని మోదీని విమర్శించటం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబు నాయుడు మైనారిటీల ఓట్లకోసం బీజేపీని, నరేంద్ర మోదీని విమర్శిస్తున్నాడని ఆరోపించారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ