రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌లో ఆరని అసమ్మతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: టీఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు ఎగసిపడుతునే ఉన్నాయి. అధిష్ఠానం ఊహించని విధంగా పార్టీ ముఖ్య నేతలు ఒకొక్కరూ అసమ్మతి బాట పడుతున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్తి వ్యక్తం కావడం మాములేనని, నాలుగైదు రోజుల తర్వాత అంతా సర్దుకుంటుందని టీఆర్‌ఎస్ అధిష్ఠానం భావించింది. అయితే అభ్యర్థులను ప్రకటించి రెండు వారాలు గడుస్తున్నా అసమ్మతి రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గేలా కనిపించక పోవడం పట్ల హైకమాండ్ ఆందోళన చెందుతోంది. తాజాగా టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, ఎమ్మెల్సీ రాములు నాయక్ తిరుగుబాటు బావుటా ఎగరేయడానికి సిద్ధం కాగా, నల్లగొండ జిల్లా మునుగోడులో తాజా మాజీ ఎమ్మెల్యేకు తిరిగి టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో బహిరంగ సభ జరిగింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడిన తిరుగుబాటు అభ్యర్థి వేనేపల్లి వెంకటేశ్వర్‌రావు పదివేల మందితో సభ నిర్వహించి అధినాయకత్వానికి షాక్ ఇచ్చారు. ఇలా ఉండగా తన ఎమ్మెల్సీ పదవికి రెండు మూడు రోజులలో రాజీనామా చేయాలని రాములు నాయక్ నిర్ణయించారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ నుంచి టిక్కెట్ ఆశించిన రాములుకు టికెట్ దక్కక పోవడంతో పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని శుక్రవారం తన అధికారిక నివాసంలో (ఎమ్మెల్యే క్వార్టర్) జరిగిన సమావేశంలో రాములు నాయక్ ప్రకటించారు. ఈ సమావేశానికి గిరిజన సంఘాలతో పాటు ఉద్యోగ, వైద్య, న్యాయవాద, విద్యార్థి సంఘాలు, మేధావి వర్గాలు హాజరయ్యారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని, పైగా రిజర్వేషన్ల పెంపు అంశాన్ని మైనార్టీల రిజర్వేషన్లతో చేర్చి మరింత జటిలం చేసిందని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిన గిరిజన జనాభా దామాషాకు అనుగుణంగా ఫలాలు అందడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే అంతో ఇంతో తమ వర్గాలకు మేలు జరిగిందని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను నమ్మి గతఎన్నికల్లో గిరిజనులంతా మద్దతు ఇచ్చి గెలిపిస్తే, తమకు దక్కింది ఏమి లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. జనరల్ సీట్లలో కనీసం 20 స్థానాల్లో గెలుపు, ఓటములను ప్రభావితం చేయగల స్థాయిలో తమ జనాభా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకుండానే స్వతంత్రంగా 20 స్థానాలలో పోటీ చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు రాములు నాయక్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఇలా ఉండగా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నుంచి టీఆర్‌ఎస్ టిక్కెట్ ఆశించిన మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ పార్టీకి రాజీనామా చేసి హైదరాబాద్‌లో శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. భూపాల్‌పల్లి టికెట్ ఆశించిన భంగపడిన గండ్ర సత్యనారాయణరావును బుజ్జగించే ప్రయత్నాలు ఫలించలేదు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికే పార్టీ తిరిగి టికెట్ ప్రకటించింది. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గణనీయంగా ఓట్ల సాధించిన గండ్ర సత్యనారాయణరావుకు టిక్కెట్ ఇస్తామన్న హామీతో టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అయితే అభ్యర్థుల ఎంపికలో తన పేరు లేకపోవడంతో గండ్ర తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఆయనను బుజ్జగించేందుకు హైదరాబాద్‌కు రావాల్సిందిగా అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చినా తిరస్కరించినట్టు తెలిసింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు గండ్ర హెచ్చరించి పంపినట్టు తెలిసింది. అభ్యర్థులను ప్రకటించిన 20 నుంచి 25 స్థానాల్లో టీఆర్‌ఎస్ రెబల్స్ దడ పుట్టిస్తుండటంతో దిద్దుబాటు దిశగా అధిష్ఠానం యోచిస్తోన్నట్టు సమాచారం.