రాష్ట్రీయం
విశాఖ ఏజెన్సీలో మావోల ఘాతుకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పాడేరు, డుంబ్రిగుడ, అరకులోయ, సెప్టెంబర్ 23: మావోయిస్టుల పంజాతో విశాఖ మన్యం రక్తసిక్తమైంది. నక్సలైట్ల ఘాతుకానికి ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే బలయ్యారు. మావోయిస్టుల హిట్లిస్ట్లో ఉన్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోలు దారుణంగా హతమార్చారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో మన్యం ఉలిక్కిపడింది. విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం తూటంగి పంచాయతీ లివిటిపుట్టు గ్రామం వద్ద చోటుచేసుకున్న ఈ దారుణ హత్యల సంఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. డుంబ్రిగుడ మండలం కండ్రుం పంచాయతీ సరాయి గ్రామంలో ఆదివారం నిర్వహించ తలపెట్టిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు అరుకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ తన అనుచరులతో వెళుతుండగా మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే కిడారి ఒక వాహనంలోనూ, మాజీ ఎమ్మెల్యే సోమ మరో వాహనంలో మిగిలిన పార్టీ నాయకులు ఇతర వాహనాలలో సరాయి గ్రామం వెళుతుండగా మార్గమధ్యలో లివిటిపుట్టు గ్రామం వద్ద సాయుధులైన మావోయిస్టులు వీరి వాహనాలను అటకాయించారు. ముందు కొద్దిమంది మహిళలు ఎమ్మెల్యే వాహనానికి అడ్డుగా వచ్చారు. తమకు అర్జీలు ఇచ్చేందుకు వచ్చారని భావించిన ఎమ్మెల్యే వాహనాన్ని ఆపమన్నారు. వాహనం ఆపిన క్షణంలోనే రోడ్డుపక్కనే పొదల్లో ఉన్న సాయుధ మహిళా మావోయిస్ట్లు ఎమ్మెల్యే కారును చుట్టుముట్టారు. మరి కొద్దిక్షణాల్లోనే మరికొంతమంది మావోయిస్ట్లు తుపాకులతో వాహనాలపై గురిపెట్టారు. మావోయిస్ట్లు తమకు హాని తలపెట్టడానికి వచ్చిన భావించిన ఎమ్మెల్యే కిడారి తన వాహనంలోని వారందర్నీ అప్రమత్తం చేశారు. వచ్చిన మావోయిస్టుల్లో ఎమ్మెల్యే ఎవరు? మాజీ ఎమ్మెల్యే ఎవరు? అని ప్రశ్నించారు. ఇంతలో ఎమ్మెల్యే కిడారి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా మావోయిస్టులు అతన్ని పట్టుకుని చేతులు వెనక్కు విరిచి తాళ్లు కట్టారు. పరిస్థితిని గమనించిన సోమ తన వాహనాన్ని వెనక్కు మళ్లించే ప్రయత్నం చేశారు. ఇంతలో వెనక నుంచి మరికొంతమంది సాయుధ మావోయిస్టులు ఆయన వాహనాన్ని కూడా చుట్టుముట్టారు. ఇద్దరు గన్మెన్ల నుంచి రెండు 9 ఎంఎం ఫిస్టల్స్ను, ఒక కార్బన్ను మావోయిస్ట్లు స్వాధీనం చేసుకున్నారు. గన్మెన్లతోపాటు పార్టీ కార్యకర్తలను కూడా దూరంగా వెళ్లిపోవల్సిందిగా హెచ్చరించారు. వచ్చిన మావోయిస్ట్లు రెండు బృందాలుగా విడిపోయారు. సోమాను కొంతమంది, కిడారిని మరికొంతమంది దూరంగా తీసుకువెళ్లారు. ముందుగా వారివద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకున్నారు. తరువాత వీరిద్దరితో మావోయిస్ట్లు కాసేపు మాట్లాడారు. హుకుంపేట మండలం గూడ గ్రామం వద్ద నిర్వహిస్తున్న క్వారీని నిలిపివేయాలని గిరిజనులు ఆందోళన చేస్తున్నా ఎందుకు క్వారీని మూసి వేయకుండా నిర్వహిస్తున్నావంటూ మావోయిస్టులు కిడారిని నిలదీసినట్టు సమాచారం. అంతేకాకుండా వైసీపీ నుంచి ఎన్నికై తెలుగుదేశం పార్టీలో చేరిన వైనాన్ని కూడా మావోయిస్టులు తప్పుపట్టినట్టు చెబుతున్నారు. తను క్వారీని మూసేస్తానని, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని సర్వేశ్వరరావు మావోయిస్ట్ల వద్ద ప్రాధేయపడినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సోమ నిర్వహిస్తున్న క్వారీలను కూడా ఈ సందర్భంగా మావోయిస్టులు ప్రస్తావించి, గతంలో బాక్సైట్కు అనుకూలంగా వ్యవహరించావని, ఒడిశాలో భారీ ఎన్కౌంటర్కు పోలీసులకు సమాచారం ఇచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఏమీ చేయవద్దని, ఇకపై తాము అన్నీ వదులుకుంటామని మావోయిస్టులకు చెప్పినా వారు వినలేదు. ముందుగా సోమపై మావోయిస్ట్లు పాయింట్ బ్లాంక్ నుంచి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. కిడారి కళ్ల ఎదుటే సోమా గిలగిల కొట్టుకుంటూ అక్కడికక్కడే మరణించారు. వెనువెంటనే సర్వేశ్వరరావుపై కూడా మావోలు కాల్పులు జరిపారు. కిడారి మెడపైన ఛాతిపైన, పొట్టపైన నాలుగు రౌండ్ల కాల్పులు జరపడంతో ఆయన కూడా అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనలో 50 నుంచి 60 మంది మావోయిస్టులు పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇందులో మహిళలు అధిక సంఖ్యలో ఉన్నట్టు చెబుతున్నారు. మావోలంతా యూనిఫారం ధరించి తుపాకులు, కిట్ బ్యాగ్లు, మంచినీళ్ల బాటిల్స్ వంటి వాటిని చేతబట్టుకుని ఉన్నట్టు చెబుతున్నారు. వీరంతా కోందు భాషలో మాట్లాడడం వలన ఆదిమజాతి గిరిజనులుగా భావిస్తున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చిన అనంతరం మావోయిస్టులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు.
చిత్రాలు.. ఎమ్మెల్యే కిడారి మృతదేహం (పైన)
*మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతదేహం