రాష్ట్రీయం

లాభదాయక వ్యవసాయానికి దీర్ఘకాలిక ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: వ్యవసాయ రంగం మీద సానుకూలమైన పక్షపాతం చూపుతూ , వనరుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వ్యవసాయాన్ని స్థిరమైన, మరింత లాభసాటి రంగంగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికపై ఈ రంగంలో నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలని సూచించారు. హైదరాబాద్‌లో అగ్రి-విజన్ సదస్సును శుక్రవారం నాడు ఉప రాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్పాదకత క్షీణించిందని, సహజ వనరుల లభ్యత తగ్గిపోతోందని, ఆహారం కోసం వేగంగా పెరుగుతున్న గిరాకీ , వ్యవసాయ ఆదాయాలు తగ్గిపోవడం, వ్యవసాయ భూమి తగ్గుతుండటం, వాతావరణ మార్పులు వంటి ఎన్నో సవాళ్లను భారతీయ వ్యవసాయ రంగం ఎదుర్కోంటోందని అన్నారు.
వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు పెరుగుదల చాలా కీలకమని , ఈ రంగం సాధికారత ద్వారానే పేదరికాన్ని తగ్గించడం సాధ్యపడుతుందని అన్నారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న రంగాల్లో లక్షలాది మందికి జీవనోపాధి లభిస్తుందని తెలిపారు. భారతదేశ జీడీపీలో వ్యవసాయరంగానిది 18 శాతమని, అదే సమయంలో దేశంలో 50 శాతం మందికి ఉపాధిని అందిస్తోందని తెలిపారు. 2022 నాటికి వ్యవసాయ దారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు, శాస్ర్తియ సమాజం , కృషి విజ్ఞాన్ కేంద్రాలు, రైతుల ఉమ్మడి ప్రయత్నం అవసరమని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టిందని, ఈ నేపథ్యంలో రైతులు సాంకేతికతకు మరింత చేరువయ్యే నీటిపారుదల సదుపాయాలు, గిడ్డంగులు, శీతల గిడ్డంగులు వంటి వ్యవసాయ వౌలిక సదుపాయాల పెంపకం, కనీస మద్దతు ధర పెరుగుదల వంటి వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. రైతులు వ్యవసాయ అనుబంధ రంగాల మీద కూడా దృష్టి పెట్టాలన్న ఉప రాష్ట్రపతి వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు కలవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి చొరవ ఎగుమతులకు ఆస్కారంతో పాటు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు సాయపడతాయని, రైతులకు ఫుడ్ ప్రాసెసింగ్‌లో అవగాహన ద్వారా వృధాను అరికట్టవచ్చని తెలిపారు. రైతు ఆదాయాన్ని పెంచేందుకు మార్కెట్‌తో వారికి సత్సంబంధాలు కీలకమని, సన్నకారు రైతులకు ఆ అవకాశాలు ఉండటం లేదని, 85 శాతం మంది రైతులు ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , ఈనామ్ వంటి ఆధునిక పద్ధతులు ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని అన్నారు. భారతదేశం ఆహార దిగుమతి మీద ఆధారపడి లేదని, స్వీయ ఆహార భద్రత మనకు చాలా కీలకమని ఉప రాష్టప్రతి పేర్కొన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని, సమర్ధవంతమైన సంస్థాగత సంస్కరణలతో పాటు , జాతీయ , ప్రాంతీయ స్థాయిలో ఆహార , పోషకాహార భద్రతతో సహా వ్యవసాయ రంగంలో పెరుగుతున్న సవాళ్లను అధిగమించడం కీలకమని అన్నారు.
వాతావరణ పరిస్థితులను అధిగమించే దిశగా వ్యవసాయంలో మార్పులు రావాలని, ఉత్పాదకతను పెంచేందుకు నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, ప్రధాన మంత్రి కృషి సించయ్ యోజన, పరంపరాగత్ కృషి వికాస్ యోజన , ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వంటి గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు కృషి చేయాలని ఉప రాష్టప్రతి సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేశంలో వివిధ వర్శిటీలకు చెందిన విద్యార్థులు, కార్నెల్ యూనివర్శిటీ విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులతో పాటు శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు. అనిల్ కుమార్ ఏపూరు, సమీర్ గోయల్, టీఆర్ కేశవన్, కార్నెల్ వర్శిటీ డీన్ డాక్టర్ మ్యాక్స్ జే ఫీపర్, డాక్టర్ గిరీష్‌రెడ్డి, డి రాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో అగ్రి-విజన్ సదస్సు మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు