రాష్ట్రీయం

టీడీపీని వీడనున్న ఒకే ఒక్కడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 22: కడప జిల్లా నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఒకే ఒక్కడు మేడా మల్లికార్జునరెడ్డి వైకాపాలో చేరడం ఖాయం కావడంతో ఆ పార్టీకి జిల్లాలో గట్టిదెబ్బ తగిలినట్టయింది. గత ఎన్నికల్లో వైకాపా టికెట్‌పై గెలిచిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరారు. వీరిలో ఆదినారాయణరెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నారు.
మేడా పార్టీ వీడడంతో వీరిద్దరు మాత్రమే ప్రస్తుతం చట్టసభలో టీడీపీ ప్రతినిధులుగా మిగిలారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్‌పై కడప జిల్లాలో గెలిచిన ఒకే ఒక్కడు మేడా మల్లికార్జునరెడ్డి 2019 ఎన్నికలకు ముందు పార్టీ వీడాలని నిర్ణయించుకోవడం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుకాగానే జిల్లా నుంచి గెలిచింది తానొక్కడినే కాబట్టి మంత్రి పదవి ఖాయమని మేడా మల్లికార్జునరెడ్డి భావించారు. క్రమక్రమంగా ఆ అసంతృప్తి ఎక్కువ కావడంతో బాబు బుజ్జగించి విప్ పదవి కట్టబెట్టారు. అయినా మంత్రిని కాలేకపోయానన్న అసంతృప్తి మేడాలో అలాగే ఉండిపోయింది. వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టడంతో మేడాలో అసంతృప్తి మరింత పెరిగింది. దీంతో పార్టీ కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొంటూ వచ్చారు. మల్లికార్జునరెడ్డి సోదరుడు రఘునాధరెడ్డి పట్టుదలతో పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.
మేడా మల్లికార్జునరెడ్డి పార్టీ మారే అంశం గత ఐదారు నెలలుగా నానుతోంది. ప్రధానంగా మల్లికార్జునరెడ్డి సోదరుడు రఘునాధరెడ్డి వైకాపా నేతలతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మేడా కన్‌స్ట్రక్షన్ అనేక కాంట్రాక్టు పనులు చేపట్టడం కూడా ఈ రాజకీయ మార్పిడికి కారణమని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. వైకాపాలో చేరితే తెలంగాణలో తాము చేస్తున్న కాంట్రాక్టు పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా బిల్లులు మంజూరవుతాయనే ఉద్దేశ్యంతోనే పార్టీ మారుతున్నారని తెలుగుదేశం వర్గీయులు చెబుతున్నారు. పార్టీ మారే ఉద్దేశ్యం 6 నెలల నుంచి మనసులో పెట్టుకుని పార్టీ మీద నిందలు మోపేందుకు మేడా మల్లికార్జునరెడ్డి ఇన్ని రోజులు నాటకాలు ఆడారని తెలుగుదేశం వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మేడా వర్గీయుల వాదన మరోలా ఉంది.. తమకు రాజంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం నేతలు గానీ జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, మంత్రి ఆదినారాయనరెడ్డి గానీ తగినంత గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. అక్కడే ఉండి అవమానాలు భరించడం కన్నా పార్టీ వీడడం మేలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడిస్తున్నారు.
ఏది ఏమైనా వైఎస్‌ఆర్ కడప జిల్లాలో చాలా ముందుగానే రాజకీయ వేడి రగిల్చడంలో మేడా ఉదంతం దోహదం చేసింది. మేడా సోదరుడు తెలుగుదేశంలోనే ఉండి ఉంటే ఇరు పార్టీల్లోను టికెట్ల సంక్షోభం అసలు లేని నియోజకవర్గంగా రాజంపేట నిలిచి ఉండేది. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలతో పాటు ఒక ఆకు ఎక్కువే సంక్షోభం ఇరు పార్టీలకు ఏర్పడింది.
మేడా మల్లికార్జునరెడ్డి పార్టీ వీడగానే రాజంపేట నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపు(బలిజ)లు, మరోవైపు రాజులు ఎవరికి వారు టికెట్ల ప్రయత్నం ప్రారంభించారు. ఇటు వైకాపాలోను మేడా సోదరుల చేరికతో తొలి నుండి ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధరెడ్డికి టికెట్ అంశం ప్రశ్నార్థకంగా మారింది. మేడా సోదరుల్లో ఒకరికి రాజంపేట శాసనసభ నియోజకవర్గం టికెట్ ఇవ్వాల్సి వస్తే అమరనాధరెడ్డిని వైకాపా అధిష్టానం బుజ్జగించాల్సిన పరిస్థితి ఉంది. ఇలా ఇరు పార్టీలు రాజంపేట శాసనసభ నియోజకవర్గం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.