రాష్ట్రీయం

బీజేపీ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 6: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావటాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జనసంఘ్ వ్యవస్థాపకులు, బీజేపీ సిద్ధాంతకర్త డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 119వ జయంతి కార్యక్రమాన్ని గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే జెండా నినాదంతో కాశ్మీర్ దేశంలో అంతర్భాగమేనని తన ప్రాణాలను త్రుణప్రాయంగా బలిదానం చేసిన ధీరోదాత్తుడు శ్యామప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. రాష్ట్రంలో బీజేపీకి నానాటికీ ప్రజల నుండి ఆదరణ పెరుగుతోందని, ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి చూసి ప్రజలు తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, నమోదులో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా కార్యకర్తలు, నాయకులు నిరంతరం శ్రమించాలని కోరారు. అనంతరం సభ్యత నమోదు కార్యక్రమాన్ని కన్నా ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ జూపూడి రంగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ లక్ష్మీపతి, నాయకుడు రావెల కిషోర్‌బాబు, జిల్లా అధ్యక్షుడు నల్లబోతు వెంకట్రావ్, నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కన్నా నాగరాజు, రాష్ట్ర కార్యదర్శులు అడపా నాగేంద్రం, తాళ్ల వెంకటేష్ యాదవ్, పాలపాటి రవికుమార్ పాల్గొన్నారు.

చిత్రం... శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కన్నా తదితర నాయకులు