రాష్ట్రీయం
ఫలితాల వెల్లడిలో ఓయూ టూ లేట్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్ : అత్యాధునిక సెర్వర్లు, డాటా హబ్లను నెలకోల్పినట్టు పదే పదే చెప్పే ఉస్మానియా యూనివర్శిటీ ఫలితాలు ఇవ్వడంలో జీవితకాలం ఆలస్యం చేయడంతో యూజీ పూర్తి చేసే విద్యార్థులు జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో సీట్లు కోల్పోతున్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నా నెల రోజుల వ్యవధిలో ఫలితాలు ఇచ్చేలా అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని షెడ్యూలు మారకుండా ఫలితాలు ఇస్తుండగా, యూనివర్శిటీలో వెయ్యి మంది, 1500 మంది ఫలితాలు ఇవ్వడానికి నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు. గత రెండేళ్లుగా ఆన్లైన్ వాల్యూయేషన్కు శ్రీకారం చుట్టిన ఉస్మానియా యూనివర్శిటీ గత మే నెలలో జరిగిన ఎల్ఎల్బీ ఫైనల్ సెమిస్టర్ ఫలితాలను ఇంత వరకూ ఇవ్వకపోవడంతో క్లాట్ పీజీలో మంచి ర్యాంకులు సాధించి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో వంద మందికి పైగా సీట్లు పొందినా వారంతా సీట్లు కోల్పోవల్సి వచ్చింది. చివరికి నల్సార్లో సైతం తెంలగాణ కోటా భర్తీ కాని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లు, మూడేళ్లు కోర్సుల్లో తొలి సంవత్సరం పరీక్షల్లో జాప్యం జరిగినా, చివరి సెమిస్టర్ను గాడిలో పెట్టి సకాలంలో ఫలితాలు ఇవ్వాల్సిన వర్శిటీ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం విడ్డూరం. ఫలితాలు ఇవ్వలేదేమిటి అని ప్రశ్నిస్తే ఇచ్చేశాం కదా అని ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామచంద్రం పేర్కొనడం మరింత విడ్డూరం. ఫైనల్ సెమిస్టర్లో ఉండే సుమారు 1500 మంది విద్యార్థులకు సంబంధించి 4500 పేపర్ల వాల్యూయేషన్కు మూడు నెలల వ్యవధి తీసుకోవడంపై తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి ఇటు డిగ్రీ ఫలితాల్లోనూ, పీజీ ఫలితాల్లో కొనసాగుతోంది. ప్రీ పీహెచ్డీ ఫలితాలు ఇవ్వడానికి నెలల తరబడి సమయాన్ని తీసుకున్నారు. ఒక పక్క రెండో సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు ముగుస్తున్నా మొదటి సెమిస్టర్ ఫలితాలు ఇవ్వకపోవడం, మూడో సెమిస్టర్ ముంచుకొచ్చినా మొదటి సెమిస్టర్ మార్కుల జాబితాలను జారీ చేయకపోవడం, నాలుగో సెమిస్టర్ ఫెయిలైన అభ్యర్ధులు రీ వాల్యూయేషన్కు అప్లై చేస్తే వాటి ఫలితాలు ఆరో సెమిస్టర్ పరీక్ష గడువు వరకూ తేల్చకపోవడం వంటి గందరగోళంతో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. పీజీలో ప్రవేశాలకు సీపీజెట్ నిర్వహణ బాధ్యతను ఉన్నత విద్యామండలి ఉస్మానియా యూనివర్శిటీకే అప్పగించడం విడ్డూరం, ఫలితాలు తేలకున్నా విద్యార్థులు పీజీ అడ్మిషన్లకు సీపీజెట్ రాయాల్సి వచ్చింది. అన్ని యూనివర్శిటీల్లో జూన్లోనే డిగ్రీ పరీక్షలు పూర్తయి ఫలితాలు ప్రకటించిన సమయంలో ఉస్మానియా యూనివర్శిటీ యూజీ పరీక్షలు జరిగాయి. జూలై 5వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతునే ఉండటం మరో పక్క అదే సమయంలో పీజీ ప్రవేశపరీక్షలకు హాజరుకావడం తలకుమించిన భారంగా మారింది. ఇదే దురవస్థ లాసెట్కూ ఎదురైంది. పీజీలాసెట్లో ఒక పక్క రెగ్యులర్ పరీక్షలురాస్తూ మధ్యలో పీజీ లాసెట్కు హాజరుకావల్సి వచ్చింది. ఎల్ఎల్బీ లో చేరేందుకు సాధారణ డిగ్రీ అభ్యర్ధులకు అపుడు పరీక్షలే మొదలు కాలేదు. సీబీసీఎస్ సిలబస్ను డిగ్రీలో ప్రవేశపెట్టినా , అందుకు సంబంధించిన మార్గదర్శకాలు, పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో కళ్లుమూసి తెరిచేలోగా సెమిస్టర్ పరీక్షలు ముంచుకొస్తున్నాయి. నిరంతరం పరీక్షలు ఫలితాలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ అంశంపై దృష్టి సారించాలని స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్సు అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బీ సత్యనారాయణ విద్యా మంత్రి జగదీష్రెడ్డిని కోరారు.