రాష్ట్రీయం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏరువాడ పంచెలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల: ఏటా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించే తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల మొదటిరోజు జరిగే వెంకటేశ్వరస్వామి అంకురార్పణ ఉత్సవానికి గద్వాల ఏరువాడ జోడుపంచెలను స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు 136 సంవత్సరాల నుంచి తిరుమల శ్రీవారితో ఉన్న ఈ అనుబంధం వల్లనే ఇక్కడి చేనేత పరిశ్రమ ఖండాంతర ఖ్యాతిని అర్జించిందని ఇక్కడి చేనేత కార్మికుల నమ్మకం. శ్రీవారి సేవలకు దేశం నలుమూలల నుంచి ఎన్నో విలువైన కానుకలు అందినప్పటికీ వీటన్నింటిలోకెల్లా జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల సంస్థానం కానుకగా అందే ఏరువాడ జోడుపంచెలు ప్రముఖంగా చెప్పుకోదగ్గవి. సంస్థాన రాజు శ్రీ కృష్ణరాంభూపాల్‌తో మొదలైన సంప్రదాయాన్ని సంస్థానాదీశుల వారసులైన లతభూపాల్ నేటి వరకు కొనసాగిస్తున్నారు. సంస్థానాలు కాలగర్భంలో కలిసిపోయినా పూర్వికులు కొనసాగించిన సంప్రదాయాన్ని వారసులు ఆచరిస్తుండడం పట్ల ఇక్కడి చేనేత కార్మికులు కథలు కథలుగా విశేషంగా చెప్పుకుంటున్నారు. స్వామివారి అలంకరణ కోసం గద్వాల చేనేత కార్మికులు గత నెల రోజులుగా నామాల మగ్గంపై పంచెను నేయడం ప్రారంభించి పూర్తి చేశారు. ఐదుగురు చేనేత కార్మికులు నియమ నిష్టలతో జోడుపంచెల నేత పనిని పూర్తిచేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సెప్టెంబర్ 5న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అధికారికి జోడుపంచెలను అందించనున్నట్టు మహంకాళి కరుణాకర్ తెలిపారు.
ఐదుగురు నేత కార్మికులు నియమనిష్టలతో సంప్రదాయబద్ధంగా జోడుపంచెల నేతను కొనసాగించారు. సహజంగా నేత మగ్గాన్ని ఇద్దరు కలిసి ఒకేమారు నేస్తారు. అయితే నామాల మగ్గానికి మాత్రం ముగ్గురు కార్మికులు ఒకేసారి నేస్తారు. ఏ ఒక్కరు తప్పు చేసినా నేత ముందుకు సాగదు. దైనందిన జీవితంలో తెలిసీతెలియక తప్పులు దొర్లితే... మగ్గం దగ్గరకు వచ్చే సమయానికి ఆ విషయం తమకు పరోక్షంగా తెలుస్తుందని, అందువల్లనే అత్యంత జాగ్రత్తగా భక్తి, శ్రద్ధలతో మసులుకుంటామని నేత కార్మికులు గద్దె మురళి, కేశవ్, సాక సత్యం, షణ్ముకరావు, మహాంకాళి కరుణాకర్, మేడమ్ రమేష్ తెలిపారు. జోడు పంచెల తయారీ మొదలు వాటిని తిరుమలలో అధికారులకు అందజేసే వరకు మగ్గం ఉన్నచోట ఇంట్లో నిత్యం పూజలు చేయడం... గోవిందనామస్మరణ చేసుకుంటూ నేత పనికి పూనుకుంటామన్నారు.
జోడుపంచెల ప్రత్యేకత...
11 గజాల పొడవు, ఇరువైపులా 11 ఇంచుల బార్డర్‌తో కంచుకోట కొమ్మ నగిషీలతో ఏకకాలంలో ముగ్గురు ఒకేసారి నేయడం జోడు పంచెల తయారీలో దాగి ఉన్న సాంకేతిక పరమైన అంశం. 80 అడుగుల వెడల్పు, 13 అంగుళాల అంచు ఉంటుంది. ఏరువాడ జోడు పంచెలను తయారు చేసేందుకు నెలరోజులు పడుతుంది. ఈ సమయంలో నేత కార్మికులు నిష్టాగరిష్టులై సంప్రదాయ బద్ధంగా నేతను కొనసాగిస్తూ ప్రతిక్షణం గోవిందనామస్మరణతో పనులను చేపడుతారు. దేశం నలుమూలల నుంచి శ్రీవారికి కానుకగా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. వాటికి అలంకార ప్రాయంగా ప్రత్యేక వేడుకలలో మాత్రమే శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అలంకరిస్తారు. గద్వాల చేనేత కార్మికులు తయారు చేసిన ఏరువాడ జోడు పంచెలు మాత్రం శ్రీవారి మూలవిగ్రహానికి అలంకరిస్తారు. ఇదే ఈ జోడుపంచెలకు ఉన్న విశేషం.

చిత్రం...నామాల మగ్గంపై జోడుపంచెను తయారు చేస్తున్న కార్మికులు