రాష్ట్రీయం

మల్లన్న సాగర్‌కు రెండేళ్లలో నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: గోదావరిపై నిర్మించతలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండగానే, ఆ పనులకు సమాంతరంగా లిఫ్ట్‌ద్వారా నీటిని ఎల్లంపల్లి ద్వారా దిగువ రిజర్వాయర్లకు మళ్లించేలా కార్యాచరణ రూపొందించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని సిఎం కెసిఆర్ సమీక్షించారు. నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు అందించే డిండి ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్ల నిర్మాణాలపై నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, అధికారులతో కెసిఆర్ క్యాంపు కార్యాయలంలో శనివారం సమావేశమయ్యారు. కృష్ణా, గోదావరి నదుల మీద నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు సంబంధించిన డిజైన్ల పనుల పురోగతిని సమీక్షించారు. మల్లన్నసాగర్ నుంచి బస్వాపూర్ వరకూ నిర్మించ తలపెట్టిన ప్రధాన రిజర్వాయర్లలో నిండిన నీటిని నిండినట్టే గొలుసుకట్టు చెరువులకు మళ్లించాలని సూచించారు. నీటిని లిఫ్టుల ద్వారా నింపుతూనే చుట్టుపక్కల గ్రామాల్లో చెరువులను, కుంటలను సమృద్ధిగా నదీ జలాలతో నింపాలని, దీనివల్ల గ్రామాల్లో జలకళ తోణికిసలాడుతుందని అన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణం ద్వారా ఉత్తర తెలంగాణకు, దక్షిణ తెలంగాణకు సాగు అవసరాన్ని బట్టి నీటిని పంపిణీ చేసేందుకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. రెండేళ్లలోపే మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించే విధంగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని సిఎం తెలిపారు. డిండి ప్రాజెక్టు నుండి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ వరకు సాగునీటిని తరలించే కాలువల నిర్మాణం డిజైన్‌లను పరిశీలించారు. డిండి నుంచి శివన్నగూడెం వరకు కాలువ నిర్మాణంపై చర్చించారు. డిండి ప్రాజెక్టు ద్వారా నల్లగొండ కరువు ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ, చౌటుప్పల్, చిట్యాల ప్రాంతాలకు సాగునీటిని అందించాలన్నారు. చింతపల్లి, గొట్టిముక్కల, సింగరాయిపల్లి, కృష్ణంపల్లి రిజర్వాయర్లను కృష్ణా జలాలతో నింపి నల్లగొండ కరవును తీర్చేదిశగా పనులు సాగాలని జిల్లా ఇంజనీర్లను ఆదేశించారు. నర్లాపూర్ నుంచి డిండి ప్రధాన కాలువ నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పారు. ఈ నాలుగు రిజర్వాయర్ల నిర్మాణాల పరిధిలో ముంపు తక్కువగా ఉండేవిధంగా, దూరం పెరగకుండా నీటి కాలువల నిర్మాణాలు చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటిని నిరంతరం ఉండేట్టు చేయడం వల్ల చెరువులు, కుంటలు నిండాలని, దీనివల్ల భూగర్భ జలాల్లో నీటిమట్టం పెరుగుతుందని చెప్పారు. వర్షాలు ఎక్కువగా కురవడానికి రిజర్వాయర్లు దోహదం చేస్తాయన్నారు. కాళేశ్వరం నుంచి బస్వాపూర్ వరకు, డిండి నుంచి చివరి రిజర్వాయర్ వరకు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తయ్యేలా నల్లగొండ జిల్లా ఇంజనీర్లు కృషి చేయాలని సిఎం సూచించారు.
సమావేశంలో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపిలు బూర నర్సయ్య గౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, వేముల వీరేశం, పి శేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రవీంద్రనాయక్, నల్లగొండ జిల్లా పరిషత్తు చైర్మన్ బాలునాయక్, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌కె జోషి , ఇఎన్‌సి మురళీధర్, ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్, నల్లగొండ జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. ప్రాజెక్టుల పనులపై సాగునీటి అధికారులతో సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్. చిత్రంలో మంత్రి హరీశ్