రాష్ట్రీయం

ఉత్తరాంధ్రకు అందమైన అతిథులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 2: సరిహద్దులు దాటుకుంటూ ప్రయాణిస్తాయి. మూడు నెలలు విడిది చేస్తాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు ఎదిగేదాక ఇక్కడే ఉండి, మళ్లీ తమ దేశాలకు ఎగిరిపోతాయి. ఇది శతాబ్దాలుగా సిక్కోల్ ప్రజలు తిలకిస్తున్న దృశ్యం. శ్రీకాకుళం జిల్లాలో సందడి చేయడానికి సైబీరియన్ పక్షులు వచ్చేశాయి. పక్షుల రాకతోనే వర్షాలు వస్తాయని ఇక్కడ ప్రజల నమ్మకం. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామంలో వలసపక్షుల సందడి ప్రారంభమైంది. సరిహద్దును దాటుకుంటూ వచ్చే ఈ అందమైన అతిథుల విహారం స్థానికులను కనువిందు చెయ్యడానికి సిద్ధమైంది. ప్రతీ ఏడాది జూలైలో సైబీరియా నుంచి వలసవచ్చే ఈ పక్షులను స్థానికులు ఎంతో సంప్రదాయబద్ధంగా చూసుకుంటారు. ఓపె బిల్డ్ స్పార్క్ శాస్ర్తియ నామం గల వీటిని స్థానికులు నత్తగొట్టు పక్షులుగా పిలుచుకుంటారు. జూలై మాసంలో వచ్చే ఈ వలస పక్షులు మూడు నెలలపాటు తేలుకుంచిలోనే విడిది చేస్తాయి. ఇవి వస్తే కానీ వర్షాలు కురవవన్న నమ్మకంతోపాటు, ఏటా గుడ్లు పెట్టి పొదిగే సమయంలో ఇక్కడికి సైబీరియా పక్షులు రావడం ఆనవాయితీగా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. పక్షులను అతిథులుగా భావించే సంప్రదాయం సిక్కోల్ ప్రజలకే దక్కింది. ఈ పక్షులు తూర్పు, దక్షిణ ఆసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక మొదలుకొని తూర్పుప్రాంతంలో సంచరిస్తుంటాయి. ఈ సీజన్‌లో తేలుకుంచి చేరుకుని ఇక్కడి చెట్లపై జూలై నుంచి సెప్టెంబర్ వరకు నివాసం ఉండి తర్వాత వెళ్ళిపోతాయి. ప్రతీ సంవత్సరం ఈ సీజన్‌లో పక్షులను చూడటానికి వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఈ పక్షుల రాక, తమ తాతముత్తాతల నుంచి జరుగుతోందని, అప్పటి నంచి వీటిని తమ ఊరుకు వచ్చే అతిథుల్లా భావిస్తున్నామని గ్రామస్థులు ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. ఈ అతిథి పక్షులు సెప్టెంబర్ మొదటి వారంలో తిరుగుప్రయాణం అవుతుంటాయి. తేలుకుంచిలో గల వలసపక్షుల విడిది కేంద్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే సందర్శకులూ వస్తారు, తమకు ఆనందంగా ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు.

చిత్రం.. ఇచ్ఛాపురం మండలం తేలుకుంచిలో విడిది చేసిన విదేశీ పక్షులు