తెలంగాణ

రేవంత్ దారెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31:తెలంగాణలో అసలే అంతంత మాత్రంగా ఉన్న టిడిపిలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిని ఇతర నాయకులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. తెలంగాణలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టిడిపి, తెలంగాణ ఏర్పడిన తరువాత వెలవెలబోయింది. విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో సైతం చివరకు 15 స్థానాల్లో విజయం సాధించినా, ఆ తరువాత పరిణామాలతో పూర్తిగా బలహీనపడింది. టిడిపి ఆవిర్భావం నుంచి అండగా నిలిచిన సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకులు సైతం టిడిపికి తెలంగాణలో భవిష్యత్తు లేదని టిఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో ఇతర పార్టీలో అవకాశాలు లేని వారు, టిఆర్‌ఎస్‌లో ఇమడలేని వారు, టిఆర్‌ఎస్‌లోకి వెళ్లడానికి అవకాశం లేని నాయకులు మాత్రమే టిడిపిలో మిగిలిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు వరకు కనీసం హైదరాబాద్‌లోనైనా పార్టీ బలంగా ఉంటుందని భావించారు. ఫలితాలు వచ్చాక చివరకు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు సైతం టిఆర్‌ఎస్ బాట పట్టారు. టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న టిడిపి నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీలో ఈ అసంతృప్తి గోల, ఫిర్యాదులు ఏమిటో అని ఆంధ్ర నాయకులు విసుక్కుంటున్నారు. తెలంగాణలో పార్టీకి అసలు భవిష్యత్తే లేనప్పుడు రెండు కళ్ల సిద్ధాంతం అంటూ చంద్రబాబు మాట్లాడడం సమయం వృధా అని ఆంధ్ర నాయకులు విమర్శిస్తున్నారు. తెలంగాణలో టిడిపి పుంజుకునే అవకాశాలు ఏ కోశాన కనిపించక పోవడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇటీవల స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితుల తరుఫున 48 గంటల దీక్షకు కూర్చున్నారు. సాధారణంగా టిడిపి చిన్న కరపత్రాన్ని ముద్రించినా, ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ ఫోటోలు తప్పని సరిగా ఉండాలి. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం భారీ కటౌట్లు తయారు చేయించినా, ఈ సంప్రదాయాన్ని పాటించలేదు. తొలిసారిగా ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలు లేకుండా కేవలం తన ఫోటోలతోనే దీక్షకు సంబంధించిన బ్యానర్లు, కటౌట్లు తయారు చేయించారు. ఎన్టీఆర్ భవన్ వద్ద, మల్లన్నసాగర్ ముంపు దీక్ష శిబిరం వద్ద అన్ని చోట్ల ఇవే ఏర్పాటు చేయించారు. రేవంత్‌రెడ్డి స్వతంత్రంగా వెళ్లడం మిగిలిన నాయకులకు మింగుడుపడ లేదు. అయితే మిగిలిన నాయకులు టీవి చర్చల్లో టిడిపి తరపున మాట్లడడం, విలేఖరుల సమావేశాల్లో మాట్లాడడం మినహా పార్టీ కార్యక్రమాలు అంటూ చేస్తున్నవేవీ లేవు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి మాత్రం స్వతంత్రంగా ప్రతి అంశంపై తన ధోరణిలో తాను మాట్లాడుతూ వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. టిఆర్‌ఎస్‌కు టిడిపి ఏ స్థాయిలోనూ పోటీ ఇవ్వలేదనే నిర్థారణకు వచ్చిన రేవంత్‌రెడ్డి, బలమైన సామాజిక వర్గాన్ని టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏకం చేయడం ద్వారా రాజకీయ భవిష్యత్తును రూపొందించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. తన రాజకీయ వ్యూహానికి టిడిపి ఒక వేదిక మాత్రమే అని గతంలో తరుచుగా చెబుతూ ఉండేవారు. దీనికి అనుగుణంగానే రేవంత్‌రెడ్డి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ టిడిపి నాయకులంతా తరుచుగా విజయవాడ వెళ్లి పార్టీ వ్యవహారాలపై చంద్రబాబుతో చర్చిస్తుంటే రేవంత్‌రెడ్డి మాత్రం దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. చివరకు ఎన్టీఆర్ భవన్‌లో లోకేశ్ తెలంగాణ సమీక్ష నిర్వహించినా సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంటున్నారు.

మల్లన్నసాగర్‌పై దీక్ష చేసిన సందర్భంగా ఎన్‌టిఆర్, చంద్రబాబుల ఫొటోలు లేకుండానే ప్రచారం పోస్టర్లు వేసిన రేవంత్ (ఫైల్‌ఫొటో)