రాష్ట్రీయం

మొక్కవోని దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 25: జలసంపద, పచ్చదనం, అభివృద్ధి మేళవించిన సుందర రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రజలంతా మమేకం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనలోనూ ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలన్నారు. తుళ్లూరు మండలం అనంతవరం వేదికగా వనమహోత్సవాన్ని బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు కృష్ణానది పరివాహక ప్రాంతంలోని రాజధానిలో ఎల్లప్పుడూ నీటి నిల్వలు 6 నుంచి 7 మీటర్ల లోపు ఉండే విధంగా వాటర్ మేనేజమెంట్‌ను అమలు చేస్తామన్నారు. అలాగే రాజధాని పరిధిలోని 18 ప్రాంతాల్లో కోటి మొక్కలు పెంచేందుకు నర్సరీలు ఏర్పాటు చేస్తామని, కృష్ణా నదిలో వాటర్ కార్స్ నడుపుతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల పెంపకానికి 350 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు అందించేందుకూ సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం 23 శాతమే ఉన్న అడవులను 50 శాతం వరకు పెంచటానికి కృషి చేస్తామన్నారు. అతివృష్టి, అనావృష్టికి కారణం పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయటమేనన్నారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల పొడవునా తీరప్రాంతం ఉన్నందున తుపాన్‌లు వచ్చే అవకాశం అధికంగా ఉందన్నారు. సముద్ర తీరప్రాంతంలో మడ అడవుల అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరూ 10 మొక్కలు చొప్పున 50 కోట్ల మొక్కలు నాటాలన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి మొక్కలు పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించి కార్తీక మాసంలో పూర్తి చేస్తామన్నారు. ప్రతి పాఠశాల విద్యార్థి గ్రీన్ కాప్స్‌లో సభ్యునిగా చేరి మొక్కలు పెంచాలన్నారు. రాష్ట్రంలోని 15,000 పాఠశాలల్లో 10.19 లక్షల మంది విద్యార్థులు సభ్యులుగా ఉన్నారన్నారు. వారంతా వనమహోత్సవంలో పాల్గొని 15 లక్షల మొక్కలు నాటుతున్నారన్నారు. మొక్కల పెంపకాన్ని బాల్యం నుంచే నేర్పాలనే ఉద్దేశ్యంతో ప్రతి హైస్కూల్‌లో నర్సరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.ప్రకృతి, మనుషులు వేర్వేరు కాదనే విషయాన్ని గుర్తించి మొక్కల పెంపకానికి అందరూ కృషి చేయాలన్నారు. మొక్కలకు నీళ్లు పోసే కార్యక్రమాన్ని డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తామన్నారు. ఒకప్పుడు రాజధాని నిర్మాణం ఒక కల అని పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడది నిజమైందన్నారు. 2022 నాటికి భారతదేశంలో మూడవ రాష్ట్రంగా, 2029కి మొదటిదిగా, 2050కి ప్రపంచంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మనిషిని చంపితే ఎంత నేరమో సింగపూర్‌లో చెట్లు నరికినా అంతే నేరమని చంద్రబాబు తెలిపారు. చెట్లు నరకాలంటే అక్కడ ప్రభుత్వ అనుమతి తీసుకొవాల్సిందేనన్నారు.

వరద సాయంగా ఏపికి 700కోట్లు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక అవసరాల కోసం, వరద సాయంగా కేంద్రప్రభుత్వం 700 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వరద సాయం కింద తక్షణమే వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం సైతం వరద సాయం ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ముందే కోరినా వరద సాయం చేయని కేంద్రం తమిళనాడు కోరగానే రూ. 940 కోట్లు మంజూరు చేసింది. దీనిపై ఆరోపణలు మిన్నుముట్టడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సమగ్ర నివేదికలు తెప్పించుకుని 700 కోట్ల రూపాయలను కేంద్ర ప్రణాళికా పథకాల నిధుల నుండి కేటాయించింది. భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అయ్యిందని, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం కేంద్రం తక్షణం ఆదుకోవాలని ఆర్ధిక సాయం అందించాలని సిఎం వారం క్రితం కోరారు. భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడమే గాక, చెరువులు, కుంటలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రహదారులు ఘోరంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వర్షాలకు రాష్ట్రంలో 35 మంది చనిపోయారని, 613 మూగజీవులు మృతి చెందాయని ముఖ్యమంత్రి తెలిపారు. 467 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, 2029 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని , రెండు లక్షల హెక్టార్లకు పైగా ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
550 సాగునీటి వనరులు నాశనమయ్యాయని చెప్పారు. 1860 కిలోమీటర్లు మేర రహదారి వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని మొత్తం మీద ప్రాథమికంగా నాలుగువేల కోట్ల రూపాయల వరకూ నష్టం జరిగిందని వివరించారు.