ఆంధ్రప్రదేశ్‌

రూ. 310కే సిమెంట్ బస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: రాష్ట్రంలో సిమెంట్ బస్తా తప్పనిసరిగా రూ. 310లకే విక్రయించాలని మంత్రి మండలి ఉప సంఘం ఉత్పత్తిదారులను ఆదేశించింది. సచివాలయంలో బుధవారం ఉదయం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రి మండలి ఉప సంఘం సభ్యులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు సమావేశమై మూడు అంశాలపై చర్చించారు. వివిధ శాఖల మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, అమర్‌నాథ్‌రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఉన్నతాధికారులు దీనికి అయ్యారు. తొలుత ఫెర్రో అల్లాయిస్ రంగంపై, తరువాత నిరుద్యోగ భృతి, సిమెంట్ ధరల అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు సమావేశ వివరాలను విలేఖరులకు వివరించారు. సామాన్యులు ఇబ్బంది పడకుండా సిమెంట్ బస్తా రూ. 310లకే విక్రయించాలని ఉప సంఘం ఆదేశించిందని, అందుకు ఉత్పత్తిదారులు అంగీకరించారని చెప్పారు. రేపటి నుంచే ఈ ధర అమలు చేస్తారన్నారు. గత నెలలో ఉత్పత్తిదారులతో జరిగిన సమావేశం తరువాత ధరలు కొంత తగ్గినట్లు తెలిపారు. వారం, పదిరోజుల తరువాత మళ్లీ సమీక్షిస్తామన్నారు. ఒకవేళ వాళ్లు చెప్పిన ధర కంటే ఎక్కువకు అమ్మితే దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని, ప్రభుత్వ సహాయాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. మైనింగ్, విద్యుత్ సరఫరా,ప్రభుత్వ చెల్లింపులు వంటి వాటిని ఆపివేస్తామన్నారు. పరిశ్రమల వారిని ఇబ్బందిపెట్టే ఉద్దేశం తమకులేదని, వారి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు.
* కాంట్రాక్టర్లతో సంబంధం లేకుండా!
ప్రభుత్వ పనులకు సరఫరా చేసే సిమెంట్‌కు సంబంధించిన డిడిలను కాంట్రాక్టర్లతో సంబంధం లేకుండా ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు చెప్పారు. హౌసింగ్, ఆర్ అండ్ బి, పోలవరం ప్రాజెక్టు, పంచాయతీరాజ్ శాఖల పనులకు ఎక్కువగా సిమెంట్ అవసరం ఉంటుందని తెలిపారు. సమయానికి సిమెంట్ సరఫరా చేయకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోతున్నట్లు చెప్పారు. అందువల్ల ఏ శాఖకు ఎంత సిమెంట్ కావాలో వివరాలు సేకరించినట్లు తెలిపారు.
మరో ఏడాది రాయితీకి సిఫారసు
రాష్ట్రంలోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమకు ప్రస్తుతం ఇచ్చే విద్యుత్ రాయితీని మరో ఏడాది పొడిగించడానికి ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మంత్రి మండలి ఉప సంఘం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో 35 ఫెర్రో అల్లాయిస్ కంపెనీలు ఉన్నాయని, పవర్ టారిఫ్ పెరగడం వల్ల అప్పట్లో 30 కంపెనీలు మూతపడ్డాయని చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఏడాది క్రితం విద్యుత్ చార్జీలను రూపాయిన్నర తగ్గించి రెండు ఏళ్లు ఇవ్వాలని ఆలోచన చేసి ఒక ఏడాదికి అనుమతి ఇచ్చినట్లు వివరించారు. ఏప్రిల్‌తో సంవత్సరం అయిపోయిందని, రెండో సంవత్సరం కూడా రాయితీ పొడిగించమని ఆ పరిశ్రమ వర్గాలు అడిగినట్లు తెలిపారు. గత ఏడాది రాయితీ ఇవ్వడం వల్ల 25 కంపెనీలు తెరిచారని చెప్పారు. 10 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయని, అయితే 6,800 మందికి ఉపాధి కల్పించినట్లు పరిశ్రమల శాఖ వారు తెలిపారని వివరించారు. ఈనేపథ్యంలో పీఆర్సీ చైర్మన్ కూడా వారికి ఒక ఏడాది రాయితీ ఇవ్వమని సిఫారసు చేసినట్లు చెప్పారు. దాంతో ఫెర్రో అల్లాయిస్ కంపెనీల వారితో మాట్లాడి తాముకూడా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని చెప్పామని, అంతేకాకుండా ఇదే చివరి అవకాశమని వారికి తెలిపినట్లు మంత్రులు చెప్పారు. అయితే వారికి రాయితీ మరో ఏడాది ఇవ్వమని మంత్రి మండలికి సిఫారసు చేయాలని మాత్రమే తాము నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి మండలి నిర్ణయం తరువాత వారికి రాయితీ కొనసాగిస్తారని కామినేని, అచ్చెన్నాయుడు వివరించారు. నిరుద్యోగులకు భృతి ఇచ్చే అంశంపై మంత్రి మండలి ఉప సంఘం చర్చించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్రంలో 12 లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. అయితే ఆ సంఖ్యను స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఎన్నికల హామీ ప్రకారం యువతకు న్యాయం చేస్తామన్నారు. వారికి వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఏవిధంగా ఇస్తున్నారో తెలుసుకుని, మన రాష్ట్రంలో పరిస్థితుల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. నిధులకు కొరత లేదని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో రూ. వెయ్యి నుంచి రూ. 1500 ఇస్తున్నారని, కొన్ని రాష్ట్రాల్లో వంద, రెండొందలు ఇస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరును అధ్యయనం చేస్తామని చెప్పారు. ఈవిషయమై జూన్‌లో సమావేశమై చర్చిస్తామన్నారు. జూలై నాటికి తుది నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు వివరించారు.

చిత్రం... మంత్రివర్గ ఉప సంఘం సమావేశ వివరాలు వెల్లడిస్తున్న కామినేని, అచ్చెన్నాయుడు