ఆంధ్రప్రదేశ్‌

పడగవిప్పిన ఫ్యాక్షన్.. కరణం వర్గీయులు ఇద్దరి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరుగురిపై 40మంది దాడి నలుగురి పరిస్థితి విషమం
సీఎం సీరియస్, అరెస్టులకు ఆదేశం
బాబే సమాధానం చెప్పాలన్న కరణం

అమరావతి, మే 19: ఫిరాయింపు రాజకీయాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఉప్పు నిప్పుగావున్న తెలుగుదేశం ఎమ్మెల్సీ కరణం బలరాం, అదే పార్టీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు పరాకాష్ఠకు చేరింది. ఫలితంగా శుక్రవారం రాత్రి కరణం బలరాం వర్గానికి చెందిన ఆరుగురిపై ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయులుగా భావిస్తోన్న 40మంది కాపుకాసి దాడికి పాల్పడ్డారు. దాడిలో ఇద్దరు మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అద్దంకి కేంద్రంగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న అధిపత్యపోరు అనేకమార్లు నాయకత్వం దృష్టికెళ్లినా ఫలితం కనిపించలేదు. నాయకత్వం ఎవరినీ నియంత్రించలేకపోయింది. ఫలితంగా వారిద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. వైకాపా నుంచి ఫిరాయించిన గొట్టిపాటి తెదేపాలో చేరి, తమ కార్యకర్తలపై పెత్తనం చేస్తున్నారని కరణం వర్గీయులు కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. జిల్లాస్థాయి పార్టీ సమావేశంలో బహిరంగ వేదికపైనే రెండు వర్గాలు ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే.
కరణం వర్గీయుల సమాచారం ప్రకారం తాజాగా కరణం బలరాం వర్గానికి చెందిన గోరంట్ల వెంకటేశ్వర్లు, గోరంట్ల పేరయ్య, గోరంట్ల పెద అంజయ్య, ఏగినాకి ముత్యాలరావు, వీరరాఘవయ్య, ఏగినాకి రామకోటయ్య ఒక పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా, బల్లికురువ మండలం వేమవరం గ్రామం స్పీడ్‌బ్రేకర్ వద్ద గొట్టిపాటి వర్గీయులుగా భావిస్తోన్న గొట్టిపాటి మారుతి, మాలంపాటి వెంకటేశ్వర్లు, శాఖమూరి సీతయ్య సహా 40మంది కాపు కాసి కళ్లలో కారం చల్లి మారణాయుధాలతో దాడి చేసి పరారయ్యారు. వీరిలో గోరంట్ల పెద అంజయ్య, ఏగినాకి కోటయ్యలు మృతి చెందగా, మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా దాడిలో తీవ్రంగా గాయపడిన ముత్యాలరావు గతంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చెందిన క్వారీని అడ్డుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2004 ఎన్నికల్లో తెదేపా కంచుకోట, బలరాంకు బలమున్న వేమవరం గ్రామంలో పోలింగ్ బూత్‌కు వచ్చిన గొట్టిపాటి రవిని అడ్డుకుని బయటకు లాగేసిన వారిలో మృతుడు అంజయ్య కూడా ఉన్నారు.
బాబు జవాబు చెప్పాలి: కరణం
తన వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు దాడి చేసిన వైనంపై ఎమ్మెల్సీ కరణం బలరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకత్వ తీరుపై విరుచుకుపడ్డారు. చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న తన వర్గీయులను పరామర్శించేందుకు వచ్చిన బలరాం పార్టీ అధినేత, సిఎం చంద్రబాబుకు నేరుగా ప్రశ్నలు సంధించారు. ‘ప్రశాంతంగా ఉన్న మాపై వైకాపా వాళ్లను తీసుకొచ్చి బలవంతంగా రుద్దారు. పార్టీకి పనిచేసిన కార్యకర్తలను వాళ్లు హత్య చేశారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. దీనిపై ఆయన ఏమంటారో బాబునే అడుగుతా. చాలాకాలంగా వాళ్లు ఇక్కడ పెత్తనం చేస్తున్నారు. ఈ హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నా’ అన్నారు.
బాబు ఆగ్రహం
అద్దంకి నియోజకవర్గంలో జరిగిన హత్యలు, దాడిపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డిజిపికి ఫోన్ చేసి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. చట్టాన్ని ఎవరు చేతులోకి తీసుకున్నా సహించేది లేదని హెచ్చరించారు.
అద్దంకిలో ఉద్రికత్త
తాజా పరిణామాలపై అద్దంకిలో భయాందోళన నెలకొంది. కరణం బలరాం వర్గీయులు ప్రతీకారదాడులకు దిగొచ్చన్న ముందస్తు యోచనతో పోలీసులు బందోబస్తు పెంచారు. ప్రధానంగా హత్య జరిగిన వేమవరం గ్రామం వద్ద భారీ పికెట్ ఏర్పాటు చేశారు. గొట్టిపాటిని పార్టీలో చేర్చుకోవద్దని చెప్పినా వినని నాయకత్వమే దీనికి బాధ్యత వహించాలని కరణం బలరాం వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. దీనికి బాధ్యులైన ఎమ్మెల్యే గొట్టిపాటి రవిపై హత్యానేరం నమోదు చేసి, అరెస్టు చేయాలని కరణం వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.

చిత్రం... ఆసుపత్రిలో మృతదేహాల వద్ద కరణం బలరాం