ఆంధ్రప్రదేశ్‌

‘ముందస్తు’ రాకపోవచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దేశంలో, రాష్ట్రంలో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ ఒంటరిగానే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. మోదీ ప్రధాని అయిన తరువాత పేదల కోసం 160 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యకర్తల ఖాతాల్లోకి జమ చేస్తున్నారని కన్నా ఆరోపించారు. ప్రధాని మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా మన రాష్ట్రానికే నిధులు అధికంగా ఇచ్చారని అన్నారు. కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకుంటూనే, మోదీని బద్నామ్ చేయడానికి చంద్రబాబు 2014 జూలై నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారని లక్ష్మీ ధ్వజమెత్తారు. సమయానుకూలంగా కొంతమంది డ్రామా ఆర్టిస్ట్‌లను రంగంలోకి దించుకుంటూ వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే, అందుకు మోదీయే కారణమని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ ఆయనకు జ్వరం వచ్చినా అందుకు ప్రధానే కారణమని అంటారేమోనని కన్నా ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి చేయాల్సిన దానికన్నా అధికంగానే మేలు చేసినందువలన ఓటు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు.
గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు తన ప్రచార ఆర్భాటానికి లఘు చిత్రాన్ని తీయించుకోడానికి అధిక సమయం కేటాయించడం, పుష్కరాలకు రైళ్లు, బస్సుల్లో వచ్చే యాత్రికులను ఆయన ఉన్న ఘాట్‌కే అధికారులు పంపించి, ఏ గేటూ తెరవకుండా గంటల తరబడి జనాన్ని నిలివేయడం వలన తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారని కన్నా అన్నారు. అయితే, ఈ పుష్కరాలకు మీడియా ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చిందని, దీంతో జనం అధిక సంఖ్యలో రావడం వలన 29 మంది మరణించారని సోమయాజులు కమిటీ నివేదిక ఇవ్వడం శోచనీయమని అన్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కన్నా డిమాండ్ చేశారు. 2014లో కాంగ్రెస్ రాష్ట్రానికి శని అన్న చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో జత కట్టడానికి ఎందుకు తహతహలాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పింది చంద్రబాబు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ద్రోహం చేసిన పార్టీతో చంద్రబాబు కలిసి ఎన్నికలకు వెళితే, ఇక్కడి ప్రజలు క్షమించరని అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని, ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడం వలనే, జనం ముందుకు రాలేకపోతున్నారని అన్నారు. చంద్రబాబు తన నీడను చూసి తానే భయపడుతున్నారని కన్నా అన్నారు.
ఈ విలేఖరుల సమావేశంలో ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మాజీ మేయర్ పులుసు జనార్థనరావు, బీజేపీ నగర అధ్యక్షుడు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.