సబ్ ఫీచర్

రాజకీయుల నోట..పరుష పదజాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏవిటండీ ఈ రాజకీయ నాయకులు మాట్లాడే భాష రోజురోజుకూ ఇలా దిగజారిపోతోంది..?’’ అన్నారు ఆకాశవాణి పూర్వ సంచాల కులు డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ ఓ రోజు పొద్దునే్న నాకు ఫోను చేసి.
ఆయన మృదు స్వభావులు. సున్నిత మనస్కులు. ఆకాశవాణి హైద రాబాదు కేంద్రం డైరెక్టరుగా పనిచేశారు. రేడియో కార్యక్రమాల్లో ఏదైనా అప్రాచ్యపు పదం దొర్లినా ఆయన విలవిలలాడేవారు. ఇక నేటి రాజకీయుల ఇష్టారాజ్యపు మాటల తూటాలు టీవీల్లో వింటూ ఇంకా ఎంత మధన పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
అనకూడని మాట, అనదగ్గ మాట అనే తేడా లేకుండా పోతోందని ఆయన బాధ. కానీ మనం చేయగలిగింది ఏముంది ? ఆయనంటే త్రేతాయుగం నాటి మనిషి.
త్రేతాయుగం అంటే జ్ఞాపకం వచ్చింది. ఆ కాలంలో కూడా ఇలా ప్రల్లదనపు మాటలు మాట్లాడేవాళళు లేకపోలేదు. సీతను అపహరించుకుని పోయి లంకలోని అశోకవనంలో బంధించిన రావణుడు సీతమ్మ వారితో అంటాడు ఇలా...
‘‘చనిపోయాడో, బతికున్నాడో తెలియని నీ మొగుడు రాముడి కోసం బాధపడుతూ నీ నిండు జీవితాన్ని ఎందుకిలా, ఎన్నాళ్ళిలా పాడు చేసుకుంటావు? నువ్వు ఊ.. అను, నా భార్యగా చేసుకుని నిన్ను లంకకు రాణిని చేస్తా. జీవితంలో కనీ వినీ ఎరుగని భోగాలు అనుభవించేలా చేస్తా!’’ అంటూ పరాయి స్ర్తీతో అనకూడని మాటలు అంటాడు.
దానికి సీత జవాబు చెప్పేముందు- అక్కడ కనపడ్డ ఒక గడ్డిపోచను తనకూ, రావణుడికీ నడుమ ఉంచుతుంది. ‘‘నా దృష్టిలో నువ్వు తృణప్రాయం’’ అనే సంకేతం ఇస్తూ.
ఇక- ద్వాపర యుగంలో ఉచితానుచితాల అన్వయం మరింత రూపు మార్చుకుంది.
నిండు కొలువులో ఏకవస్త్ర అయిన ద్రౌపదిని వలువలు ఊడ్చే ముందు, దుర్యోధనుడు ఆమెకు తన వామాంకాన్ని చేతితో చూపుతూ,‘‘రా! వచ్చి ఇక్కడ కూర్చో!’’ అని సైగ చేస్తాడు. సభలో ఉన్న భీష్మ ద్రోణాదులు సిగ్గుతో మెలికలు తిరుగుతారు.
ఇక- ఇప్పటి కలియుగం సంగతి చెప్పేది ఏముంది..?
విలువల పతనం అనేది ‘శంభుని శిరంబందుండి...’ అన్నట్టుగా అతివేగంగా కిందకు సాగుతోంది. ఔచిత్యం, అనౌచిత్యం అనే తేడా లేకుండా పోతోంది. అందరూ ‘ఔను’ అంటున్నప్పుడు ఇక ఈ తేడాపాళాల ప్రసక్తి ఏముంది..?
పూర్వం కవులు తమ రచనల అవతారికలో ఒక విన్నపం చేసుకునేవారు.
‘‘అనౌచిత్యంబు పరిహరించుచు, ఔచిత్యంబు పాటించుచు ఈ రచన చేశాను’’ అని పేర్కొనేవారు. తెలిసీ తెలియక ఏమైనా రాయకూడని పదాలు వాడామేమో అనే శంకతో.
ఇప్పుడా కుశంకలు దివిటీ పెట్టి వెతికినా కనబడవు.
‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా!’ అన్నాడు వేమన. అలాగే, విభక్తుల్లో సంబోధన ప్రథమా విభక్తి తరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కానవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ‘ఒసే’ అనడం, తండ్రిని ‘ఒరే’ అనడం ఈ మధ్య సినిమాల్లో షరామామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగా, వడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతోంది.
వెనుకటి రోజుల్లో ...
పిల్లలు ఒకర్నొకరు సరదాగా ‘గురూ.. గురూ..’ అని పిల్చుకుంటూ ఉంటే విన్న పెద్దలు గుర్రుమనే వారు. ‘అలాంటి అపభ్రంశపు మాటలు మళ్ళీ మాట్లాడితే జాగ్రత్త’ అంటూ తొడపాశం పెట్టేవాళ్లు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి, బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది. ఇంట్లో ‘అమ్మా’ అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం ‘మా అమ్మగారు’ అంటూ గౌరవంగా చెప్పుకునేవారు. ఉత్తరాలు రాసేటప్పుడు- ‘గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి’ అనో, ‘‘పూజ్యులైన తాతయ్యగారికి’ అనో వినమ్రత కనబరిచేవారు. వినయాన్ని సంస్కారంగా, విధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణకువగా అనుకునేవారు. సభ్యతా సంస్కారాలకు అదే కొలమానంగా భావించేవారు.
ఇక, గతంలో పత్రికల్లో వాడే భాష, సినిమాల్లో వినిపించే సంభాషణలు, చట్టసభల్లో జరిగే చర్చలు చాలా వరకు పరిధులకు, ప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి,దూరదర్శన్‌ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలు, వార్తలు గిరి గీసుకుని, మడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానంగా చెబుతాయన్న నింద తప్ప, సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు.
కానీ- కాలం ఒక్క తీరుగా ఉండదు కదా! జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టి, తరాలను బట్టి మారిపోతుంటాయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడం, ఆమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత ‘వేగవంతం’ చేయడంలో ఈనాటి ‘ఎ టూ జెడ్’ టీవీ చానళ్లు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.
తరాలు మారుతున్నప్పుడు, వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకు ఉండే ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు, మేధావులు పుడతారు, జర్నలిస్టులు పుడతారు, సంపాదకులు పుడతారు. కవులు, రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం వౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే, ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతూ ఉంటుంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వైరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి చానళ్ళకు, పత్రికలకు,పుస్తకాలకు, చట్టసభలకు విస్తరించి- సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు చెప్పే మాటల్లో, ప్రవచించే పలుకుల్లో, రాసే రాతల్లో సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు ఈనాటి సినిమాలే, ఈనాటి చానళ్ళే, ఈనాటి పత్రికలే, ఈనాటి పుస్తకాలే, ఈనాటి సాంఘిక మాధ్యమాలే, ఈనాటి చట్ట సభలే!
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్లుండరు. రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్లు మిగలరు. పాలితులను బట్టే పాలకులు. పాఠకులను బట్టే పత్రికలు. ప్రేక్షకులను బట్టే సినిమాలు. వీక్షకులను బట్టే చానళ్లు.

ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

--భండారు శ్రీనివాసరావు 98491 30595