సబ్ ఫీచర్

వత్తిళ్లకు దూరమైతే..ఉజ్వల భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు. అవి ఒకటి కాలం, రెండోది ప్రాణం. క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. భారతదేశ విద్యా వ్యవస్థలో పదవ తరగతి అనేది నిజంగా ఒక మైలురాయి వంటిది. విద్యార్థికి తన జీవన ప్రయాణంలో మొట్టమొదటి మెట్టు పదవతరగతి ఫలితాలు. విద్యార్థి తన గమ్యాన్ని ఎంచుకోవడంలో ఈ పది ఫలితాలు దోహదం చేస్తాయని, ఫలితాల ఆధారంగా లక్ష్య నిర్థారణ చేసుకోవాలి. పరీక్షలో తక్కువ మార్కులొచ్చాయనో, అనుత్తీర్ణులయ్యామనో బాధపడొద్దు. మార్కులు, ర్యాంకులే ప్రధానం కాదు. ప్రపంచంలో లక్ష్యాలెన్నో వున్నాయి. అందులో మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దానికి కావాల్సింది మనోధైర్యం, ఆత్మ విశ్వాసం, పట్టుదల.
మార్కులు కాదు ముఖ్యం
విద్యార్థులకు మార్కులు కాదు.. విజ్ఞానం ముఖ్యమనే విషయాన్ని తల్లిదండ్రులు ముందుగా గ్రహించాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచకూడదు. పిల్లలపై ఫలితాలు వచ్చేసమయంలో ఓ కనే్నసి ఉంచాలి. అధ్యాపకులు కూడా మార్కులు తక్కువగా వచ్చే విద్యార్థులను చిన్నచూపు చూడకూడదు. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా విద్యార్థులు డిప్రెషన్‌కు గురి కాకూడదు.
కొలమానం కాదు
విద్యార్థుల ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. మార్కుల ఆధారంగా వారి తెలివితేటలను కొలవకూడదు. ప్రపంచంలోని మేధావులంతా గొప్పగా మార్కులేమీ సాధించినవారుకాదు. పిల్లల చదువులను, మార్కులను తల్లిదండ్రులు వంశ ప్రతిష్ఠగా భావిస్తుంటారు. ఇది తప్పు. విద్యా సంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి పెట్టకూడదు.
స్థాయికి మించి..
స్థాయికి మించి లక్ష్యాలను పెట్టుకోవడం, వాటిని చేరుకోలేక ఏం చేయాలో తెలియక, చెడు ఆలోచనలు మనసులో చేరడం మూలంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి.
అవకాశాలను తెలియజేయాలి
పదవ తరగతి ఫెయిల్ అయినవారికి ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకోవడానికి మంచి అవకాశం ఉంది. పదవ తరగతి ఫెయిలైన విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ద్వారా తిరిగి ఉత్తీర్ణత పొందే అవకాశాలున్నాయనే నమ్మకాన్ని కలిగించాలి.
అండగా ఉండాలి
పదవ తరగతి ఫలితాల ప్రకటన కంటే ముందే పాఠశాలలో ఒక రోజు తల్లిదండ్రులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించి, ఏ విద్యార్థి కూడా అధైర్యపడకూడదని, నిరుత్సాహానికి గురికావద్దని, తాము అండగా ఉన్నామని ఉపాధ్యాయులు విద్యార్థులకు భరోసా ఇవ్వాలి. తల్లిదండ్రులు తమ పిల్లల గురించి అత్యధిక అంచనాలను కలిగి ఉండకూడదని, పిల్లల వాస్తవిక స్థాయిని గుర్తించేలా తల్లిదండ్రులకు అర్థం అయ్యేలా చెప్పాలి.
మానసిక ధైర్యం
ఫలితాలు విడుదలైన మరుసటి రోజునుండే సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థిని సన్నద్ధం చేయగలిగితే విద్యార్థిలో మానసిక ధైర్యం పెరుగుతుంది. సబ్జెక్టుల వారీగా ఫెయిలైన విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించాలి. ఇందుకోసం పాఠశాలలో సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులైన పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, ఉన్నత విద్యావంతులైన స్థానిక యువత సహకారంతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఒక్కొక్క సబ్జెక్టులో ఫెయిల్ కావడానికి గల కారణాలను విశే్లషించి, పునర్బోధన ద్వారా పునరాభ్యాసం కల్పించాలి. తక్కువ గ్రేడ్ వచ్చిందని నిరుత్సాహపడే విద్యార్థుల కోసం రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ గురించి తెలియజేసి దరఖాస్తు చేయించాలి.
స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులతో..
విద్యార్హతలను బట్టి స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో అవకాశం వుంటుంది. పదవ తరగతి ఫెయిల్ అయిన వారికి స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో చేరడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సులతో స్వతహాగా ఎవరిపై ఆధారపడకుండా బతకగలమన్న భరోసా ఉంటుంది. పాఠశాల విద్యాగమనంలో పబ్లిక్ పరీక్షలు ఒక మజిలీ వంటివి. భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలు ఎన్నో రాయాల్సి వుంటుంది. పరీక్షల గురించి ఏ విద్యార్థి కూడా ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటులను దూరం చేసుకోవాలి. పరీక్షల కన్నా జీవితం విలువైందని, జీవితం గొప్పతనాన్ని గుర్తించాలి. విద్యార్థుల్లో సానుకూల దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, జీవితంపట్ల నమ్మకాన్ని పెంచుకొని భవితకు బాటలు సుగమనం చేసుకోవాలి.
పాఠశాలల్లోనే కౌనె్సలింగ్
పాఠశాలల్లో విద్యార్థుల కోసం కౌనె్సలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయాలి. కౌనె్సలింగ్ కేంద్రంలో ఒక సైకాలజిస్ట్‌ను నియమించాలి. పిల్లల మానసిక తత్వమును బట్టి పిల్లల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. వీటి ద్వారా ఉత్తీర్ణత ప్రమాణాలను, నాణ్యతను పెంచడం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం, ఫెయిల్ వారిని గుర్తించి వీరిని ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీకోర్సులలో చేర్పించడం, చదువులలో వెనుకబడిన విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులవైపు ప్రేరేపించి జీవన నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుంది. విద్యార్థులు నిరాశకు లోనుకాకుండా, మానసిక దృఢత్వంతో సాధించాలనే కసిని పెంచుకోవాలి. పరీక్షలలో సాధించే మార్కులే జీవితానికి ప్రామాణికం కాదని, మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా సమస్యకు ఎదురొడ్డి నిలిచినపుడే జీవితం పరమార్థం అవుతుందని, ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు.

-డా అట్ల శ్రీనివాసరెడ్డి 97039 35321