సబ్ ఫీచర్

పోరాట ఫలితమే ‘విలీనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా - విలీనమా అని వాదనలు చేస్తున్నవారెవరూ ఆ రోజుకున్న ప్రాధాన్యతను, దాని నేపథ్యాన్ని ప్రస్తావించడంలేదు. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం పాలన నుండి వేరు చేసి, స్వతంత్ర భారతావనిలో కలిపేందుకు సెప్టెంబర్ 13, 1948న మొదలయిన పోలీస్ యాక్షన్, కేవలం నాలుగైదు రోజులలోనే ముగిసి, యావద్భారత ప్రజల ఆనందోత్సాహాలమధ్య, హైదరాబాద్ రాజ సంస్థానం సెప్టెంబర్ 17, 1948న భారతదేశంలో విలీనమయింది. అప్పటి వరంగల్ జిల్లా, ఇప్పటి ఖమ్మం జిల్లా, బోనకల్లు గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బొమ్మకంటి సత్యనారాయణ రావు రాసిన స్వాతంత్య్ర సమరయోధుల క్లుప్తమైన చరిత్రను, ‘హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటం’ శీర్షికతో అలనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక మాస పత్రిక ‘ఆంధ్రప్రదేశ్’ సుమారు ఐదు దశాబ్దాల క్రితం ప్రచురించింది.
హైదరాబాద్ సంస్థానం ప్రజలకు విముక్తి కల్గించేందుకు తమ సర్వస్వాన్ని ధారపోసి రాష్ట్ర ప్రజలకు వెలుతురును ప్రసాదించిన ఆనాటి సమరయోధులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ తాను ఆ వ్యాసం రాస్తున్నానని బొమ్మకంటి పేర్కొన్నారందులో. బొమ్మకంటి పోరాటంలో పాల్గొని కీలకమైన పాత్ర వహించడమే కాకుండా, ఆ తర్వాత కాలంలో మధిర శాసనసభ సభ్యుడుగా ఎన్నికై, దామోదరం సంజీవయ్య సిఎంగా ఉన్నరోజుల్లో, రాష్ట్ర రాజకీయాలలో కొన్నాళ్లు చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు.
హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో, 1938లో ప్రారంభమైన ప్రథమ సత్యాగ్రహానికి ఆంధ్ర ప్రాంతంలో జమలాపురం కేశవరావు, హైదరాబాద్ రాష్ట్రంలో స్వామి రామానంద తీర్థ నాయకత్వం వహించారు. కాంగ్రెస్ పార్టీపై నిషేధం విధించినపుడు అజ్ఞాతవాసం చేస్తూ, హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌లోని చిన్న ఇంట్లో జాతీయోద్యమాన్ని సజీవంగా వుంచి, మహోద్యమంగా మలిచి, చివరిదాకా నాయకత్వం వహించిన వ్యక్తి స్వామి రామానంద తీర్థ. ఆయనతోపాటు స్వాతంత్య్ర సమరాన్ని గమ్యస్థానానికి చేర్చినవారిలో బూర్గుల రామకృష్ణారావు, దిగంబర రావు బిందూ, మేల్కొటే, కొండా వెంకట రంగారెడ్డి, గోవింద దాస్ షర్రాఫ్, జనార్దనరావు దేశాయ్, జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, మర్రి చెన్నారెడ్డి, బొమ్మకంటి సత్యనారాయణరావు, హయగ్రీవాచార్యులు, పాగా పుల్లారెడ్డి, కోదాటి-కొమరగిరి-కాళోజి నారాయణరావులు, వి.బి.రాజు, ఎమ్మెస్ రాజలింగం, ఉమ్మెత్తల కేశవరావు, కె.వి.నరసింగరావు, పి.వి.నరసింహారావులు ప్రముఖులు. వీరంతా వారి వారి జిల్లాల్లో నాయకత్వం వహించారు.
‘రెస్పాన్సివ్ గవర్నమెంట్’ అని, ‘రెస్పాన్సిబిల్ గవర్నమెంట్’ అని తర్జన భర్జనలు జరిగి, ‘ఇండియన్ యూనియన్‌లో చేరండి’ అనే నినాదంతో ఉద్యమం మలుపుతిరిగింది. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో షోలాపూర్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రథమ సమావేశంలో పాల్గొన్న ప్రముఖుల్లో మాడపాటి, జమలాపురం, బొమ్మకంటి ముఖ్యులు. ఆ తర్వాత బొమ్మకంటి ప్రభృతులు విజయవాడ కేంద్రంగా పనిచేసేందుకు అక్కడకు చేరుకుని, అయ్యదేవర కాళేశ్వరరావు ఇంట్లో కార్యాలయం పెట్టుకుని పనిచేయసాగారు. సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుని, ఆంధ్ర ప్రాంతానికి జమలాపురం కేశవరావు నాయకత్వం వహించాలని, ఆయన జైలుకెళ్లినపుడు ఇన్‌ఛార్జిగా హయగ్రీవాచార్యులుండాలని, ప్రచార విభాగాన్ని విబి రాజు, ఎల్లల ఉద్యమాన్ని బొమ్మకంటి నిర్వహించాలని నిర్ణయించారు.
అప్పట్లో నెలకొన్న అరాచక పరిస్థితులు భారత ప్రభుత్వాన్ని అయోమయంలో పడవేశాయి. పరిష్కారానికి పోలీసు చర్య తప్ప వేరే మార్గం కనిపించలేదు. భారత ప్రభుత్వం సైన్యాన్ని ప్రజల సంరక్షణ కొరకై పంపించింది. దక్షిణాదిన సైన్యాన్ని తరలించినపుడు, ఆ ప్రాంతంలోని మిలటరీ అధినేతలు కల్నల్ అమృత్‌సింగ్, విజి సుబ్బరాయన్‌లు చిరస్మరణీమైన పాత్ర పోషించారు. జె.ఎన్.చౌదరి హైదరాబాద్‌లో ఝండా ఎగరవేయడంతో కథ సుఖాంతమైంది. హైదరాబాద్ సంస్థానంలో నివసించేవారు కూడా భారతీయులే కాబట్టి, భారతదేశంలో ‘విలీనం’ కాకుండా చేసేందుకు జరిగిన ప్రయత్నాలు, అవరోధాలు ఆనాటితో తొలగిపోయాయి. ప్రజావాహిని ఊపిరి పీల్చుకుంది. విజయదుందుభులు మ్రోగాయి. ప్రజా విజయం ఖాయమని గ్రహించిన నిజాం నవాబు, తెలివిగా ‘విలీనపత్రం’ సమర్పించుకున్నాడు. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో సఫలమయ్యాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ ప్రజల పాలిట ప్రాణదాతయ్యాడు.
బొమ్మకంటి పథకం

హైదరాబాద్ నవాబును ఓడించేందుకు బొమ్మకంటి లాంటి సమరయోధులు పథకం వేసుకున్నారు. పటేల్, పట్వారీలను రాజీనామా చేయమని కోరారు తొలుత. సంస్థానానికి భారత యూనియన్‌కు మధ్యనున్న సరిహద్దులను రూపుమాపేందుకు నిర్ణయించి, ‘కరోడ్గరి నాకాలను’ ధ్వంసం చేయసాగారు. లెవీ ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా ప్రజలను సమీకరించారు. ప్రజలపై దాడులు చేయడానికి నవాబు ప్రభుత్వం వాడుకుంటున్న గవర్నమెంట్ విశ్రాంతి భవనాలను నిర్మూలించడం మొదలైంది. రహదారి మార్గాల గుండా మిలటరీ రజాకార్లు ప్రయాణం చేయకుండా నిరోధించేందుకు బ్రిడ్జిలను ధ్వంసం చేశారు. బస్సులు, రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. గొరిల్లా దళాలతో మెరుపు దాడులు చేయసాగారు. గ్రామాలను రిపబ్లిక్‌లుగా ప్రకటించాలని, అక్కడ ప్రభుత్వ పాలన స్థానంలో గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలను సమీకరించి ఉద్యమంలో పాలుపంచుకునేట్లు చేయసాగారు.
సర్దార్ జమలాపురం కేశవరావు, ‘బుర్రకథ దళం’ వెంకట్ రాజుల నాయకత్వంలో, ఆగస్టు 7, 1948న బొమ్మకంటి ప్రభృతులు సత్యాగ్రహ ఉద్యమానికి బయల్దేరారు. సత్యాగ్రహం మొదలెట్టే ముందు, తాను జైలుకెళ్లాల్సి వస్తుందని, జీవితంలో మళ్లీ కలుస్తామో లేదో చెప్పలేనని, హయగ్రీవాచారి ఇన్‌చార్జిగా, వట్టికొండ రామకోటయ్య సహాయంతో ఉద్యమాన్ని కొనసాగించాల్సిన బాధ్యత బొమ్మకంటి మీద పెడుతున్నానని జమలాపురం హెచ్చరించారు. కేశవరావు సత్యాగ్రహం తర్వాత విజయవాడ చేరుకున్న బొమ్మకంటి సత్యనారాయణరావు, మాడపాటి, హయగ్రీవాచారి, వల్లూరి బసవరాజులు ‘అన్నదమ్ముల మాదిరి’ ఉద్యమాన్ని నిర్వహించే బాధ్యతను తమపై వేసుకున్నారు. స్వగ్రామం బోనకల్లులో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి బొమ్మకంటి అజ్ఞాతవాసం ప్రారంభించారు.
ప్రజల పోరాటం
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించడంతో నిజాంపై ప్రజలు తిరగబడ్డారు. ‘కమిటీ ఆఫ్ యాక్షన్’కు చైర్మన్‌గా వున్న దిగంబరావు బిందు సమరయోధులను ప్రోత్సహించారు. కార్యకర్తలకు సైనిక శిక్షణ ఇవ్వడానికి పండిట్ నరేంద్రజీ నాయకత్వంలో ఆర్య సమాజం వారు తోడ్పడ్డారు. క్యాంపులకు ఇన్‌చార్జులు, కమాండర్లు వుండేవారు. వారిలో జలగం వెంగళరావు, కోదాటి నారాయణరావు, పాగా పుల్లారెడ్డి, కె.వి.నరసింగరావు లాంటి ప్రముఖులున్నారు. పటేల్ పట్వారీలు దఫ్తరాలను పారవేసి పన్నుల వసూళ్లను నిలిపేశారు. గవర్నమెంటు ఆదాయం సమకూరుస్తున్న తాటి ఈత చెట్లను ప్రజలు నరికేశారు. రిజర్వ్ ఫారెస్టును నాశనం చేసి నష్టం కలిగించారు.
హైదరాబాద్ సంస్థానం విలీన పోరాటంలో అతి ముఖ్య ఘట్టం ‘రిపబ్లిక్ స్థాపన’. బొమ్మకంటి, హయగ్రీవాచారి పరిటాల గ్రామాలను ఆక్రమించుకుని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. బొమ్మకంటి పోలంపల్లికి వచ్చి, ఆయుధాలు తీసుకుని పరిటాలకు వెళ్లారు. ఆయన వెంట వున్న రామకోటేశ్వరరావు ప్రభృతులు వేసుకున్న మిలటరీ దుస్తులను చూసి, ఆఫీసర్లని భావించి సైనిక వందనం చేశారు నిజాం మిలటరీవారు. వందన స్వీకారం చేసి లోపలకు వెళ్లి కూర్చున్న కాసేపటికి, మిగతా బలగం వచ్చి నిజాం సైనికుల ఆయుధాలను లాక్కొని స్వాధీనం చేసుకుని, పరిటాల ఆఫీసు భవనంలో సభ ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో రిపబ్లిక్ అవతరణోత్సవం జరిగింది. మాడపాటిని ఊరేగించారు.
దరిమిలా, సంస్థానమంతా ప్రజా ఉద్యమాలు తీవ్రంగా జరిగి నిజాం ప్రభుత్వం పూర్తిగా స్తంభించింది. ఎంత పోరాటం చేసినా చేయగలిగినా, నిజాం ప్రభుత్వాన్ని కూలదోయగల శక్తి సమరయోధులకు లేదని భావించారు. ఆత్మరక్షణ కొరకు, చిల్లకల్లు-విజయవాడ దహదారి వద్ద వున్న భారత సైన్యం కమాండర్ అమృత్‌సింగ్‌ను, మద్రాసు పోలీసు శాఖకు చెందిన డిఐజి సుబ్బరాయన్‌ను కలిసి వ్యూహాన్ని పన్నారు బొమ్మకంటి, మాడపాటి, హయగ్రీవాచారి. సెప్టెంబర్ 6, 1948న యూనియన్ సైన్యాన్ని తరలించడం, దాని వెంట బొమ్మకంటి సత్యనారాయణరావు వెళ్లడం జరిగింది. కోదాడను ఆక్రమించిన సైన్యం, నిజాం కమాండర్ షేర్‌ఖాన్‌ను సైనికులతో సహా బంధించి తక్కెళ్లపాడు దగ్గరున్న రహదారిపై కూచోబెట్టి, తర్వాత విజయవాడకు తరలించారు. నిజాం సేనలు గంటసేపు కూడా పోరాడలేకపోయారు. నిజాం నవాబుకు యూనియన్ సైన్యానికి ఎదురుతిరిగి పోరాడే సత్తా లేదని నిరూపణ అయింది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. సెప్టెంబర్ 13, 1948న పూనాలో వున్న ఆయన స్వయంగా, స్వీయ పర్యవేక్షణలో, యూనియన్ సైన్యాన్ని నలుమూలల నుండి హైదరాబాద్ సంస్థానంలోకి పంపించారు. రజాకార్లు ఎక్కడివారక్కడ పారిపోయారు. బందరు, విజయవాడల నుండి పోవాల్సిన సైన్యాన్ని హైదరాబాద్ రహదారిపై నిలిపారు. మూసీ నదిపై వున్న వంతెనను రజాకార్లు ధ్వంసం చేయడంతో, దాని స్థానంలో భారత సైన్యం ఒక్కరోజులో ఇనుప వంతెన నిర్మించింది. చిట్యాల దగ్గరకు సైన్యం చేరుకోగానే కొంతసేపు ఆగమని సందేశం రావడంతో, బొమ్మకంటి సత్యనారాయణరావు జీపులో డ్రైవర్ గోకుల్ దాస్తోగ, మాడపాటి రామచంద్రరావుతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. సెప్టెంబర్ 17, 1948 నాటి రాత్రి బొల్లారంలో వున్న మున్షీగారింట్లో భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోయారు. మర్నాడు స్వామి రామానంద తీర్థను విడుదల చేశారు. సెప్టెంబర్ 18, 1948న మేజర్ జనరల్ చౌదరి భారత పతాకాన్ని ఎగురవేశారు. నిజాం హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్‌లో ‘విలీనమైంది’.

-వనం జ్వాలా నరసింహారావు