సబ్ ఫీచర్

రాజకీయ ఘనాపాఠి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ఇందిరాగాంధి శత జయంతి సందర్భంగా..
*
ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్-హర్మందిర్ సాహిబ్‌పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు సత్వంత్‌సింగ్, బియాంత్ సింగ్‌లు జరిపిన కాల్పుల్లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురై మరణించడానికి క్రితం రోజు జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, దేశ సేవలో తన ప్రాణాలు పోయినా బాధపడనని, చనిపోతే తన రక్తంలోని ప్రతి నెత్తురు బొట్టు జాతికి బలం చేకూరుస్తుందని యాదృచ్ఛికంగా అన్నదో లేదో, ఆమెలోని ఏదైనా అంతర్నిహిత శక్తి అలా అనిపించిందో భగవంతుడికే తెలియాలి. ఇందిరాగాంధీ మరణించి ఏళ్లు గడుస్తున్నా జాతీయ అంతర్జాతీయ రంగాలలో ఆమె మిగిల్చిన గుర్తులు అజరామరంగా అశేష ప్రజానీకం గుండెల్లో గూడుకట్టుకున్నాయి. కోట్లాది ప్రజలు ఆమెనెంతగా అభిమానించేవారో, అంత మోతాదులోనే ఆమెలోని మంచిచెడులను నిశితంగా విమర్శించేవారు ఇప్పటికీ చాలామంది వున్నారు. ఆమెదో అరుదైన వ్యక్తిత్వం.
జనవరి 1966 - మార్చి 1977 మధ్య మొదటి పర్యాయం, జనవరి 1980 అక్టోబర్ 1984మధ్య రెండో పర్యాయం, సుమారు పదహారేళ్లపాటు భారత ప్రధానమంత్రిగా వున్న ఇందిరాగాంధీ, తనదంటూ ప్రత్యేకంగా సంతరించుకున్న దృఢమైన ఆత్మస్థయిర్యం, నిరంకుశ ధోరణి, రాజీపడని మనస్తత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వంతో, అనునిత్యం సంక్లిష్టమైన పరిస్థితుల్లో వున్న దేశానికి, అత్యంత సమర్థవంతమైన పరిపాలనను అందించి చరిత్రలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. లాంఛనంగా రాజకీయాల్లోకి ప్రవేశించిందనడానికి సంకేతంగా, 1955లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా, 1959లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఇందిరాగాంధీ ఎన్నికైంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, తనకు ఆరంభంలో మద్దతు పలికి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న ‘సిండికేట్’ నాయకత్వాన్ని ధిక్కరించి, పార్టీని చీల్చి, భారత జాతీయ కాంగ్రెస్ అంటే తానే అన్న చందాన, మొత్తం పార్టీ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ఎమర్జెన్సీ అనంతరం ఓడిన అప్పటి కాంగ్రెస్ పార్టీని, అచిరకాలంలోనే గద్దెనెక్కించడానికి, మరోమారు చీల్చి, ఇందిరా కాంగ్రెస్‌గా నామకరణం చేసి, రెండేళ్లకే మళ్లీ అధికారంలోకి వచ్చి పాలనా పగ్గాలను, పార్టీ పగ్గాలను తన చేతుల్లో వుంచుకుంది. తనకు ఎదురులేకుండా, ఎదిరించినవారికి పుట్టగతులు లేకుండా, ఏకచ్ఛత్రాధిపత్యంగా, మకుటంలేని మహారాణిగా దేశాన్ని ఏలింది. నియంతృత్వ ప్రజాస్వామ్యమంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది.
రాజకీయాలకు నిలయమైన కుటుంబంలో జన్మించి, దేశంలో అత్యున్నత పదవికి ఎదిగిన జవహర్‌లాల్ అడుగుజాల్లో బహుముఖ రంగాల్లో తీర్చిదిద్దబడి, అవకాశం వచ్చిన వెంటనే అదే అత్యున్నత పదవిని పొంది, తండ్రికంటే మిన్నగా ఆ పదవికి వనె్న తెచ్చారు. తండ్రి చాటు బిడ్డగా వుంటూ, తండ్రికి అనధికారిక ఆంతరంగికురాలిగా, తండ్రి తర్వాత వారసత్వంగా అధికారాన్ని చేజిక్కించుకుని, తరతరాలపాటు తమ కుటుంబీకులకే అధికారం దక్కే విధంగా వ్యూహం పన్నిన ఇందిరాగాంధీ వంటి నేత ఎక్కడా కనబడరు. విధి వక్రించి, తాను అనుకున్న సంజయ్ గాంధీ ప్రధానమంత్రిగా తేలేకపోయిన ఇందిర, తన తదనంతరం రాజీవ్ గాంధీ ప్రధాని కావడానికి రంగం సిద్ధం చేసింది. భవిష్యత్‌లో ఆ పరంపర కొనసాగడానికి చేయాల్సినదంతా చేసింది. ఆమె అనుకున్నట్లే నెహ్రూ గాంధీ వారసత్వ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.
ఇందిర ప్రియదర్శిని తల్లిదండ్రులకు ఏకైక సంతానం. నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వ ఆద్యుడైన తాత మోలీలాల్, స్వాతంత్రోద్యమంలో మహాత్మాగాంధీ సరసన పోరాడిన సమరయోధుడు. ఆమె బాల్యమంతా ఒంటరితనంతోనే గడపాల్సి వచ్చింది. తాత, తండ్రి తరచుగా జైలుకెళ్లి వస్తుండడం ఇందిరాగాంధీకి గుర్తున్న విషయాల్లో ముఖ్యమైంది. చిన్నపిల్లల ఆట వస్తువులు కాని, ఆటలు కాని ఆమెకు తెలియవు. ఆడిన ఆటల్లా, ఒక నాయకురాలిగా, మూడేళ్ల వయసులోనే ఒక బల్లపైకెక్కి, ఇంట్లో పనిచేసే వారందరికీ రాజకీయ ఉపన్యాసాలివ్వడం- తనను తానే జోన్ ఆఫ్ ఆర్క్‌లాగా ఊహించుకోవడం. పెద్దవారెవరూ అందుబాటులో లేనందున యువరాణిలా ఎదుగుతున్న ఇందిరలో ఒకరకమైన అహంభావం పెరిగినట్లు ఆమే ఒక సందర్భంలో చెప్పింది.
అణుయుగంలో, అంతరిక్ష యుగంలో భారతదేశాన్ని అడుగుపెట్టించిన ఘనత ఇందిరాగాంధీదే. సోవియట్ వ్యోమనౌకలో భారతీయులను పంపడానికి చొరవ తీసుకుంది ఆమే. ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్‌ను ఘోరంగా ఓడించి, దానిలో అంతర్భాగంగా వున్న ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించడానికి కారకురాలైంది. ప్రపంచంలో భారతదేశాన్ని ఒక బలీయమైన శక్తిగా రూపుదిద్దిన ఘనత కూడా ఆమెదే. భారతదేశం అంతర్జాతీయ రంగంలో ఎవరి పక్షం వహించదని, తమ విదేశాంగ విధానం ‘్భరత అనుకూల విధానం’ అనీ ఎలుగెత్తి చాటిచెపుతూ, అలీన విధానాన్ని పాటించే దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి తీసుకెళ్లింది. సోవియట్ యూనియన్‌తో మైత్రి చేసినప్పటికీ అమెరికా వ్యతిరేకిగా ముద్రపడకుండా జాగ్రత్తపడింది. అవసరమైనపుడు, తప్పదనుకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఎదురుతిరిగి తనసత్తా ఏమిటో నిరూపించింది.
ఆమెలో పార్టీ పరంగా నియంతృత్వ పోకడలు విపరీతంగా కనిపించేవి. పాలనాపరంగా కూడా ప్రజాస్వామ్య పద్ధతులకంటే నియంతృత్వ, నిరంకుశత్వ పోకడలే ఎక్కువగా కనిపించేవి. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బలమైన కేంద్రం దిశగా ఆమె విధానాలుండేవి. తన పార్టీకి చెందిన ముఖ్యమంత్రులను ఇష్టమొచ్చిన రీతిలో మార్చడం, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురిచేయడం, అధికారాలను కేంద్రీకరించడం ఆనవాయితీగా మారిపోయింది. కమ్యూనిస్టు వ్యతిరేకతతో రాజకీయ అరంగేట్రం చేసిన ఇందిర, కాంగ్రెస్‌లోని సిండికేట్‌పై విజయం సాధించడానికి వామపక్షాలను కలుపుకుంది. ‘కమ్యూనిజం’ కంటే ‘కమ్యూనలిజం’ వల్లే ప్రమాదం ఎక్కువ అంటూ అలనాటి జనసంఘ్ లాంటి పార్టీలను ఎదగకుండా చేసింది. ఎప్పుడైతే, ఎమర్జెన్సీ విధింపునకు వ్యతిరేకంగా కాంగ్రెసేతర పార్టీలన్నీ ఏకమయ్యాయో, వారూ వీరూ అనే తేడా లేకుండా, తన విధానాలను వ్యతిరేకించిన అందరినీ జైళ్లకు పంపడానికి వెనుకాడలేదు. ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళికైనా, గరీబీ హటావో పథకమైనా, బ్యాంకుల జాతీయకరణైనా, గ్రామీణ బాంకుల స్థాపనైనా, రాజ్యాంగ సవరణలైనా, సవరణలలో భాగంగా అవతారికలో ‘సామ్యవాదం, లౌకికవాదం’ అన్న పదాలను చేర్చడమైనా, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకంటే ముఖ్యమైనవని చెప్పడమైనా, మరేదైనా, ఏమి చెప్పినా చేసినా, ఇందిరాగాంధీ మనసులో మాట ఒకటే. భారతదేశానికి నాయకత్వం వహించగలిగేది తానే అని, తాను దానికోసమే జన్మించానని ఆమె నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆమె అనుకున్న కార్యం సాధించడానికి దేనికైనా వెనుకాడకపోయేది. ఆ నమ్మకమే ఆమె గెలుపునకు సోపానాలయ్యాయి- ఓటమికి కారణాలయ్యాయి.
ఇందిరాగాంధీలో సహనం, అసహనం సమపాళ్లలో వుండేవని ఆమెను గురించిన కథనాల్లో పలువురు పేర్కొన్నారు. ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించేదో, ఎప్పుడు నిశ్శబ్దంగా పనులు చక్కబెట్టేదో, ఎందుకు ఒంటరిగా వుండదలుచుకునేదో, ఎప్పడు ఎందుకు ఏ పని చేసేదో కనుక్కోవడం అంత తేలిక కాదని మీడియాలో కథనాలొచ్చేవి. ఒకరిని చేరదీయడంలోను, ఇంకొకరిని పక్కన పెట్టడంలోను, ఆమెకు ఆమే సాటి. ఆమెలోని అసహనం పాలు ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువై, ఇంటర్వ్యూలలో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడమో, నిశ్శబ్దం పాటించడమో, అదోరకంగా నవ్వు ముఖం పెట్టడమో, ఎదురు ప్రశ్నలు వేయడమో చేసేదని విశే్లషకులు అంటుండేవారు.
జవహర్‌లాల్‌ను కలవడానికి వచ్చిన దేశ విదేశీయ ప్రముఖులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, సామాజిక శాస్తజ్ఞ్రులు, ఆయన పక్షాన ఆతిథ్య బాధ్యతలు బిడియంగా చేపట్టిన ఇందిరను, తండ్రి చాటు బిడ్డగా నెహ్రూ కూతురుగానే చూసేవారు. ఆమె మటుకు రాజకీయ పాత్ర పోషించకుండా వుండలేని పరిస్థితికి చేరుకుంది. జవహర్‌లాల్ వలె దేశ విదేశాల్లో కలియతిరగడంతో, లక్షలాదిమంది భారతీయులకు, చాలామంది విదేశ ప్రముఖులకు, ఇందిరాగాంధీ సుపరిచితురాలైంది. 1955లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీకి ఎన్నుకోవడంతో, జాతీయ స్థాయిలో స్వతంత్రంగా గుర్తింపు లభించినట్లయింది. నాలుగేళ్ల అనంతరం, నాలుగు పదుల వయసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఇందిర, ఏడాది కాలంలో తన రాజకీయ సమర్థతను, కాఠిన్యాన్ని ప్రదర్శించిందనాలి. ప్రపంచ చరిత్రలోనే ప్రప్రథమంగా బాలట్ ద్వారా అధికారంలోకి వచ్చిన కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేయించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత జరిగిన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం సాధించి పెట్టింది. తండ్రి చెంత తానుండాల్సిన అవసరం దృష్ట్యా, తన ఆలోచనా సరళికి తగ్గరీతిలో పార్టీని నడిపించే స్థాయికి తానింకా ఎదగలేదని భావించిన దృష్ట్యా, ఇందిరాగాంధీ మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సుముఖత చూపలేదు. తండ్రి మరణానంతరం లాల్‌బహదూర్ మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖను చేపట్టింది. శాస్ర్తీ హఠాన్మరణం దరిమిలా, కాంగ్రెస్ అధిష్ఠానం ఇష్టం వున్నా లేకపోయినా, ఇందిరను ప్రధానమంత్రిని చేశారు. ఇక అక్కడనుంచి ఇందిర అధ్యాయం మొదలైంది.
ఇందిర దేశానికి ఏం చేసిందో ఏం చేయలేదో అనే విషయం విశే్లషకులకు వదిలేయవచ్చేమోకాని, తెలంగాణకు సంబంధించినంతవరకు మాత్రం అన్యాయమే చేసిందనాలి. స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో 1969 నాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం దరిమిలా ప్రజాభిప్రాయానికి తలవంచి తెలంగాణ ఏర్పాటు చేయాల్సిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ నిరంకుశ ధోరణితో వ్యవహరించి అలా కాకుండా చేయడాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇక ఆ తర్వాత జరిగిన చరిత్ర తెలిసిందే!

-వనం జ్వాలా నరసింహారావు