జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, మార్చి 21: ప్రపంచంలో తీవ్రవాద దాడులు 1993లో జరిగిన ముంబయి వరుస పేలుళ్లతోనే ప్రారంభమయ్యాయని, ఈ పేలుళ్లకు పెద్ద మొత్తంలో ఆర్డిఎక్స్ (రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లోజివ్)ను ఉపయోగించారని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారీ మొత్తంలో ఆర్డిఎక్స్ను ఉపయోగించింది ఈ పేలుళ్లలోనేనని సుప్రీం కోర్టు గురువారం నాడు పేర్కొంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, ఎయిరిండియా భవనాలతో పాటు ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ పేలుళ్లలో 257 మంది మృతిచెందగా, మరో 713 మంది గాయపడిన విషయం విదితమే. భారత్లో తొలిసారి ఆర్డిఎక్స్ను ఉపయోగించి వరుసగా నిర్వహించిన ఈ శక్తివంతమైన పేలుళ్లలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, ఎయిరిండియా భవనాలతో పాటు వర్లీలోని సెంచరీ బజార్, దాదర్లోని కత్తా బజార్, ప్లాజా థియేటర్, జుహూ, శాంతాక్రజ్, బాంద్రాల్లోని సెంచర్, సీ-రాక్ ఐదు నక్షత్రాల హోటళ్ల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా ముష్కరులు ముంబయిలోని జవేరీ బజార్, శివసేన భవన్ పక్కన గల పెట్రోల్ పంప్ వద్ద కూడా ఈ పేలుళ్లు నిర్వహించడంతో పాటు మాహిమ్లోని మత్స్యకారుల కాలనీపైన, అలాగే సహారా అంతర్జాతీయ విమానాశ్రయంలోని బే-52పైన గ్రెనేడ్లు విసిరారు.
Add new comment