తెలంగాణ

పోలింగ్‌పైనే పార్టీల దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన వరంగల్ ఉప ఎన్నిక సంరంభం ఆరంభమైంది. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల్లో గెలుపుపైకన్నా ఓటింగ్ శాతం ఎంత ఉంటుంది? విజేత మెజారిటీ ఎంత? అనే అంశాలపైనే ఉత్కంఠత నెలకొంది. గత ఎన్నికల్లో 76.15శాతం పోలింగ్ జరిగింది. 2009లో 69.22శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికల్లో పోలింగ్ సహజంగా తక్కువగానే ఉంటుంది. పోలింగ్ శాతం తగ్గకుండా అన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగానే ప్రయత్నించాయి. అయితే ఓటింగ్ శాతం తగ్గితే ఆమేరకు విజేత మెజారిటీ కూడా తగ్గుతుంది. ఇదిలావుంటే, వరంగల్ ఉప ఎన్నికల్లో అధికారపక్షం గెలుపుపై ధీమాతో ఉంటే, మెజారిటీ ఎంత అనే దానిపైనే అన్ని పార్టీల్లో చర్చ సాగుతోంది. పైకి ఇతర పార్టీలు మేం గెలుస్తాం అని చెబుతున్నా, ప్రధానంగా మెజారిటీ తగ్గింపుపైనే ఆశతో ఉన్నారు. కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల్లో ప్రచారం చేసింది. రాజయ్య కోడలు మరణంతో కాంగ్రెస్ షాక్‌తిన్నా వెంటనే కోలుకోని అభ్యర్థిని మార్చడంతోపాటు రాజయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, ప్రచారంలోకి దిగింది. అధికారపక్షం తరుపున సిఎం కెసిఆర్‌తోపాటు మంత్రులంతా ప్రచారంలో పాల్గొన్నారు. బిజెపి తరఫున కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తరఫున జాతీయ నేతలు పలువురు ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్, కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. బిజెపి తరఫున చివరి నిమిషంలో ఎన్‌ఆర్‌ఐ దేవయ్యను అమెరికా నుంచి పిలిపించి నామినేషన్ వేయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్ పోటీలో ఉన్నారు. మొదట్లో నల్లా ప్రచారం అంతంత మాత్రంగానే ఉన్నా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సుడిగాలి పర్యటనతో ఆ పార్టీలో ఉత్సాహం నెలకొంది.
ఎన్నికల బరిలో మొత్తం 23మంది ఉంటే, ప్రధానంగా టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్య పోటీ నెలకొంది. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి జరిపిన ప్రచారంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నా, ఆ పార్టీ పరిస్థితి జిల్లాలో అంతంత మాత్రమే. ఇక బిజెపి అభ్యర్థికి ప్రధానంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకుర్తిలోనే హడావుడి కనిపించింది.
ఇదిలావుంటే, పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో ఉన్నవారందిరికీ ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్‌లోనూ తొలి ఓటరుకు ఎన్నికల సిబ్బంది గులాబీ పూవు ఇచ్చి స్వాగతం పలుకుతారు. ప్రతి పోలింగ్ బూత్‌లో ఓటింగ్‌ను లైవ్‌ను రికార్డు చేస్తారు. దీనికోసం ఎనిమిది వందల మంది విద్యార్థుల సేవలు ఉపయోగిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మొత్తం 1778 పోలింగ్ స్టేషన్లు ఉండగా, వీటిలో 605 పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి సమస్యలు ఉండవని గుర్తించారు. 642 సెన్సిటివ్, 498 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. 33 పోలింగ్ స్టేషన్లు తీవ్రవాద ప్రభావం ఉన్నవాటిగా గుర్తించారు. పోలింగ్‌ను బహిష్కరించాలని తీవ్రవాద సంస్థలు పిలుపునిచ్చినందున ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఓటర్లకు ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉండాలి. ఇప్పటి వరకు 1.88 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఒక కారు, 5035 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 864 మద్యం కేసులు, 196 బెల్ట్ షాపులపై కేసులు పెట్టారు. పోలింగ్ జరిగే శనివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఎగ్జిట్ పోల్‌పై ఎలాంటి చర్చ జరపవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ జరిగే 21న, ఓట్ల లెక్కింపు జరిగే 24న డ్రై డేగా ప్రకటించారు. ఆ రెండు రోజులు మద్యం అమ్మకాలను నిషేధించారు. ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కోరారు.

చిత్రం.. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇవిఎంలను సిద్ధం చేస్తున్న అధికారులు