అంతర్జాతీయం
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 4: పాకిస్తాన్లోని సింధ్ ప్రావీన్స్లో ఒక దేవాలయానికి చెందిన భూమిపై వివాదం రాజుకుంది. ఘర్షణలో ఇద్దరు హిందువులు తీవ్రంగా గాపడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సింధ్ ప్రావీన్స్లోని ఉమేర్కోట్లో సుమారు వందేళ్ల నాటి పురాతన అఖారో ఆలయం ఉంది. సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయానికి ఆనుకొని కొన్ని దుకాణ సముదాయాలు ఉన్నాయి. ఇటీవల కొంత మంది ఆలయానికి చెందిన స్థలంలోకి చొచ్చుకొచ్చి నిర్మాణాలను చేపట్టడంతో వివాదం తలెత్తింది. నిర్మాణాలకు హిందువులు అడ్డు చెప్పారు. శనివారం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దుకాణాలను నిర్మిస్తున్న వ్యాపారులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు హిందువులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేశారు. అయితే, అక్కడ ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతునే ఉంది.
Add new comment