తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్
గోలకొండ వజ్రం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వారం దాటలేదు. సినారె మరణం తర్వాత కొంత కలకలం. ఆయన లేని లోటు ఒక కారణం. ఇక ఆయన కళ్లు తెరవరని తెలిసి, కొందరు తెరతీస్తున్నారు అపవాదనలకి, వివాదాలకి. మొన్న 15న హనుమకొండకి వెళ్ళాను. అక్కడ తెలంగాణ రచయితల వేదిక (తెరవే) వరంగల్ శాఖ సినారె నివాళి సభ ఏర్పాటుచేసింది. అదే రోజు ఉదయం మహబూబాబాదు వెళ్లాను కవి అన్వర్తో కలిసి.. అక్కడ కొందరు రచయితలను కలవడానికి. వచ్చేటప్పుడు ఆ ఊరి బస్టాండ్లో సినారె ఫ్లెక్సీ కనబడింది. దాన్ని చూస్తున్న ఒకరిద్దరు తమలో తాము సినారె గురించి చర్చించుకుంటున్నారు. అప్పుడు సిఎం కెసిఆర్ ఆదేశాలు గుర్తొచ్చాయి. సినారె అంత్యక్రియలకు హాజరయ్యే వారి కోసం సిఎం ఆదేశాలపై ప్రతి జిల్లా నుండి రెండు బస్సులు హైదరాబాద్కి ఏర్పాటుచేశారు. ఇది ఒక కవికి ఇచ్చిన గౌరవం. అందుకు సంతోషమే. కానీ, కవులను ఎవరు సంప్రదించాలి. బస్సుల వివరాల గురించి చెప్పి వారిని తయారుచేయాలి కదా! బస్సుల ఏర్పాటు ముఖ్యం కాదు. బస్సుల్లో ఎవరు వెళ్ళగలరో వారిని గుర్తించడం ముఖ్యం. ఆ పని సజావుగా జరగలేదు కాబట్టి ఆ ఊరి నుండి బయలుదేరిన రెండు బస్సుల్లో ఎవరూ వెళ్ళలేకపోయారు.
అట్లని అక్కడ నుండి ఎవరూ వెళ్ళలేదని కాదు. రైళ్ళల్లోనో, బస్సుల్లోనో వెళ్లినవారు ఉన్నారు. అదీ ప్రభుత్వానికి, పౌర సమాజం బాధ్యతకి మధ్య ఉన్న తేడా. ఒకటి రెండు సాహిత్య, సాహిత్యేతర సంస్థలవారు కొన్ని జిల్లాలలో తామే బస్సులు ఏర్పాటుచేస్తున్నట్లు ఎస్సెమ్మెస్ సందేశాలు ఇచ్చారు కవులకు. కాని అవి సర్కారీ సంస్థలుగా పేరొందాయి కాబట్టి వారి సందేశాలను ఎవరూ ఖాతరు చేయలేదు. ఆ విధంగానూ సినారెకి అవమానం జరిగింది. నిజానికి సినారె ప్రభుత్వానుకూల కవి అయినా, ఎందుకోగాని, ప్రభుత్వ లాంఛనాలతో జరిగే అంతిమ సంస్కారాలకి కవులు సర్కారు ఏర్పాట్లను సున్నితంగా తిరస్కరించారు. హైదరాబాదులోని సుదూర ప్రాంతాలలో ఉన్న కవులు ఎంతమందిని అంతిమ సంస్కారాలకి తీసుకుపోయారో తెలుసుకోవలసి వుంది.
ఇక దృశ్యాలలోని విచిత్రాలు అనేకం. కొన్ని సీమాంధ్ర చానెళ్ళలో విచిత్రంగా వారి ప్రాంతానికి చెందిన ‘పెద్దలు’ కొందరు సినారె అంత్యక్రియలను జరిపే అర్హత తమకే ఉం దన్నట్లుగా సినారె పార్థివ శరీరం పక్కనే తిష్టవేసుకున్నారు. మొదట ఐదా రు గంటలు వారినే చూ పించారు. సినారె మరణవార్త, దృశ్యాల కన్నా ఎక్కువ ప్రాధాన్యత కోన్కిస్కాగాళ్ళ ఇంటర్వ్యూలతో, వారి హాసవదనాల విచారవాక్కులనదగిన మాటలను పదే పదే రిపీట్ చేసి బోర్ కొట్టించారు. సినారెను సినీ కవిగానే ప్రొజెక్టు చేసిన చానళ్ళకి చాలా సమయం వరకు అతని బహుముఖీన పార్శ్వాలు అర్థం కాలేదు. ఆ రకంగా కొంత అప్రతిష్ట మూట కట్టుకుంటున్న సినీ రంగానికి సినారె మరణం ఒక బహనా దొరికిందని అనిపించింది. సినారె మరణించిన రోజునాటి రాత్రి హైదరాబాద్లో పత్రికా సంపాదకులు, విశ్వవిద్యాలయ పూర్వ ఉపాధ్యక్షులు, ప్రస్తుత ఆచార్యులు, రచయితలు కొందరు ప్రైవేటుగా సంతాపసభ ఏర్పాటుచేశారు. దానిలో కొన్ని అపవాదులు విన్నాం. సినారె మరణించిన రోజే ఇలాంటి మాటలు వినవలసి రావడంలోని మనస్తత్వం గురించి ఆలోచించాలి.
హనుమకొండలోని నివాళి సభకి వచ్చిన కోడం కుమారస్వామి అనే రచయిత మాట్లాడుతూ, జ్ఞానపీఠ పురస్కారం డబ్బులిచ్చి తెచ్చుకున్నాడని కొందరు అనడం తనకు బాధ కలిగించిందని చెప్పాడు. ఒక లెజండరీ మరణించాక అతనిపై కథనాలు వెలువడడం మామూలే. వాటిలో కొన్ని మంచివి కావచ్చు లేదా అభూత కల్పనలు కావచ్చు. పురాభావనలు (mythification) ప్రచారం చేయడం మానవ బలహీనత. తమకంటే వంద రెట్లు పెద్దవారికి తమ మనసులోని అశాంతిని లేదా గౌరవాన్ని భూతద్దంలో అతికించి పెట్టడం వల్ల తమ అహాన్ని కొంతమేర శాంతింపజేసుకుంటారు. అదే జరిగింది మొన్న.
నిజానికి సినారె విగ్రహాలు పెట్టడానికి అతను మరణించి నాలుగు రోజులు కాకుండానే- ‘విగ్రహం’గా చేయడంలో ఏదో మతలబు ఉందనిపిస్తుంది. జయశంకర్ మరణించిన రోజు ఇలాగే ఉండింది. ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి నివాళులర్పించారు. అతని అంత్యక్రియలకి సర్కారువారు ఎలాంటి బస్సులు ఏర్పాటు చేయలేదు. ఐనా ఊరూరా సభలు, సమావేశాలు జరిపి తమ ఆదరం చాటుకున్నారు. సినిమా రంగం రేపుసినారెని అలవోకగా విస్మరిస్తుంది. పాలకపక్షాలకి అతనో కరివేపాకు అవుతాడు. రెండు రాష్ట్రాలలోని ప్రభుత్వాలకు అతనొక ప్రకటన మాత్రమేనా? నిజానికి అతని గీతాలే అతనికి ఖ్యాతి. ప్రజాదరణ. అతని సాహిత్య కృషే అతడిని నిలుపుతుంది. కాళోజీకి వరంగల్లో ఎలాంటి గతి పట్టిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఎస్టాబ్లిష్మెంట్కి దూరంగా కవిత్వం రాసిన కాళోజీని అందులో భాగం చేసినవారు క్షంతవ్యులు కారు. ఎస్టాబ్లిష్మెంట్లో చాలావరకు భాగం అయిన సినారెకి ప్రభుత్వం వల్ల ఒనగూరేది ఏమి ఉంటుందనేది ఆలోచనీయం.
చాలామందికి తెలియని విషయం ఏమంటే దేశంలోనే మొదటిసారి డా. బి.ఆర్.అంబేద్కర్ రచనలు- ప్రసంగాలు పది సంపుటాలను తెలుగులోకి అనువదించే పనికి తెలుగు విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీ చేయడంలో సినారె వల్లే సాధ్యమైంది. ఆ పనిని ఈ రచయితకి అప్పగించి ఏడాదిన్నరలో పది సంపుటాలు వెలువరింపజేశాడు. డెబ్భై ఏళ్ళు దాటిన వయోవృద్ధులపై ముప్ఫై వీడియో ఇంటర్వ్యూలు తీయించాడు సినారె. అలాంటి సినారె జీవితం గొ ప్పదా? కవిత్వం గొప్పదా? ఏది అని అడిగితే రెండూ అనక తప్పదు. సినారె నిగర్వి. ఎవరినీ నిందించి ఎరగని సౌశీల్యం. అతని కలం అభ్యుదయ గీతం. అతని ప్రాపంచిక దృక్పథం మనిషే. కష్టపడి పాండిత్యం సంపాదించాడు. ఆ సాహిత్యాన్ని తిరిగి ప్రజలకు అందించడంలో అతని పాత్ర కీలకమైంది. నోటి, రాత సాహిత్య సంప్రదాయాలతో తన ముద్ర వేసిన కవి.
అతడికి కొన్ని బలహీనతలున్నాయి.. నిత్య కవిత్వారాధన. ఏడాదికో కవితా సంకలనం ప్రచురణ. కొత్త కవులతో నిత్యం పోటీపడడం, తన సంచిత కీర్తిమత్వాన్ని సాహిత్య సభలకి తీర్చిదిద్దడం. అత్యున్నత అవార్డులు పొందినా ఎక్కడా విరామం లేని కలం ధీరత. వేలాది ‘ముందుమాట’లు రాసి యువకవులను ప్రోత్సహించడం. మంచితనానికి అతనో బ్యూటీస్పాట్. పరిపాలనా రంగం, సినీ రంగం సాహిత్య పరంగా కొంత, సీరియస్ సాంస్కృతిక మేధావిగా తయారుకావడానికి దూరం చేశాయా? అనిపిస్తుంది. రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థల అధ్యక్షునిగా కాకుండా ఒక చిన్న సారస్వత పరిషత్ అధ్యక్షునిగా ఉంటూ ఆనందం పొందిన విలక్షణ మనిషి. సేవలు అందించిన కార్యదక్షత. మనకి తెలియకుండానే కొన్ని రికార్డులు నెలకొని ఉంటాయి. అతను సాధించిన రికార్డులను సుదూరంలో మరెవరూ సాధించలేరు. అనితర సాధ్యం అతని జీవితం. అతను కనపడని రెండో గోలకొండ వజ్రం!
*