భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా -68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీరంగుత్తి: ఇక్కడే అయ్యప్ప స్వామి సైనికుల ఆయుధాలు రావిచెట్టు క్రింద పెట్టించినందువల్ల యాత్రకు దీక్ష స్వీకరిం వచ్చిన స్వాములు తాము తెచ్చిన శరము, కత్తి, గద మొదలైన ఆయుధాలను ఈ ప్రదేశంలో వుంచుతారు! గంట తెచ్చిన వాళ్లు గంటను గుడిలో కడతారు!
శీరం గుత్తినుండి కొద్ది దూరంలో శబరిగిరీశుని ఆలయం దర్శనమిస్తుంది! అదే స్వామి సన్నిధానం! అక్కడికి చేరడంతో శ్రమ అంతా మాయమై అలౌకికానందంతో మనస్సు, శరీరం పవరశించిపోతాయి!
స్వామి సన్నిధానం
గర్భగుడిలోని స్వామిని ఎప్పుడెప్పుడు కన్నుల కరువుదీరా దర్శిద్దామా అన్న ఆత్రుత అందరూ దీక్షాధారులలో, భక్తులలో అధికవౌతుంటుంది! ఒక వరుసలో శరణుఘోష చెప్పుకుంటూ తూర్పు నుండి స్వామి సన్నిధికి తీసుకువెళ్ళే పద్ధెనిమిది పవిత్రమైన మెట్లును దీక్షాధారులు ఎక్కటం ప్రారంభిస్తారు.
పదునెట్టాంబడి - పద్ధెనిమిది మెట్లు:ఇవి పరశురాముని చేత ప్రథమంగా నిర్మింపబడినవి! పద్ధెనిమిది మంది దేవతలు తమ శక్తులను వీటిలో విలీనం కావించటం, ఈ మెట్ల మీదగా నడిచి అయ్యప్పస్వామి తన పీఠాన్ని చేరి ఆసీనుడు కావటం జరిగాయి! స్వామి పాద స్పర్శ నోచుకున్న ఈ మహిమాన్వితమైన మెట్లపై కాలు పెట్టడానికి దీక్షాధారులు మాత్రమే అర్హులు! ఇతరులు ఈ మెట్లపై నుండి కాకుండా మరో ప్రక్కగా వున్న మార్గాన వెళ్లి స్వామిని దర్శించుకుంటారు.
పడిపూజ:ఈ మెట్లకు రోజు వాటి పవిత్రత చెదరకుండా వుండటానికి ప్రధాన తంత్రి పూజారులు షోడశోపచారాలతో పూజలు నిర్వర్తిస్తూ వుంటారు! ఇందువల్ల పొరబాటున దీక్ష స్వీకరించని వాళ్లు ఎవరైనా పాదాలు మోపడం జరిగితే అందువల్ల జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం జరిగి వాటి పవిత్రత తరిగిపోకుండా ఉంటుంది!
మెట్లు ఎక్కటం:మెట్ల మొదట్లో ఒక ప్రక్క స్వామి మిత్రుడైన కరప్ప స్వామి, మరోప్రక్క ఆయన భార్య కరప్పమ్మ విగ్రహాలు ఉంటాయి! వాటికి కొబ్బరికాయలు కొట్టి నమస్కరించి దీక్షాధారులు ఇరుముడి తలమీద జాగ్రత్తగా పెట్టుకుని ఒక్కొక్క మెట్టుగా ఎక్కడం ప్రారంభిస్తారు!
మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్కటి చొప్పున కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఈర్ష్య, దంభాలనే అష్టరాగాలను మొదటి ఎనిమిది మెట్లు ఎక్కుతూ వాటిని విడిచిపెడుతున్నట్లు స్వామికి మానసికంగా చెప్పుకోవాలి! మెట్లు యొక్క దేవతకు నమస్కరించుకోవాలి! తరువాతి ఐదు మెట్లు ఎక్కేటప్పుడు వరసగా నాలుకతో పలికిన తప్పులను కళ్లతో చూసిన చెడును, చెవులతో విన్న పాపపు మాటలను, చేతులతో కాళ్ళతో చేసిన పాపాలను (పంచేంద్రియాలవల్ల జరిగిన అపరాధాలను) మన్నించమని ప్రార్థిస్తూ దేవతలకు నమస్కరిస్తూ ఎక్కాలి! తరువాత మూడు మెట్లమీద వరసగా సత్వగుణాన్ని వృద్ధి చేయమనీ, రజో, తమో గుణాలను అణివేయమనీ ప్రార్థిస్తూ పైకెక్కాలి! చివరగా వున్న రెండు మెట్లలో పదిహేడవ మెట్టుమీద అవిద్యవల్ల వచ్చే అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. పద్ధెనిమిదవ మెట్టు మీద నిలబడి జ్ఞానాన్ని ప్రసాదించే సద్విద్య ప్రసాదించమని నమస్కరిస్తూ స్వామి సన్నిధానాన్ని చేరుకోవాలి! ఈ విధంగా అష్టరాగాలను, పంచతత్వాల చేత జరిగే పాపాలను, త్రిగుణాలను విద్య, అవిద్యలనే వాటిని మొత్తం పద్దెనిమిదింటిని పద్ధెనిమిది మెట్లమీద అదుపు చేసి పరిశుద్ధాత్మలతో మెట్ల మార్గాన సన్నిధానాన్ని చేరుకుంటారు దీక్షాధారులైన భక్తులు. (ప్రారంభంలో దీక్షాధారులు మెట్లు కొక్కటి చొప్పున కొబ్బరికాయలు కొడుతుండేవారు! ఆ విధంగా చేయడంవల్ల రాతి మెట్లు శిథిలమవుతుండటం గమనించి కొబ్బరికాయలు కొట్టకూడదని నియమం ఏర్పర్చటం, మెట్లకు రక్షణగా పంచలోహపు తొడుగులను (తాంత్రిక పూజాదులతో శక్తివంతం చేసినవి) ప్రధాన తంత్రుల సహాయంతో రాతిమెట్లకు అమర్చడం జరిగిందట 1985 ప్రాంతంలో) ఇప్పుడు లోహపు తొడుగుతో బంగారంలా మెరుస్తున్న పద్ధెనిమిది మెట్లను ఎక్కి స్వామి సన్నిధిని చేరుకుంటారు దీక్షాధారులు!
మూల విగ్రహం: మెట్లు ఎక్కగానే ముందుగా ద్వజస్తంభం కనిపిస్తుంది! ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేస్తుంటే గణపతి, నాగరాజుల చిన్న గుడులు కనిపిస్తాయి! వాటికి నమస్కరించి అయ్యప్పస్వామి మూల విగ్రహంని దర్శించుకుంటారు!
మణికంఠుని మూల విగ్రహం సుమారు 18 అంగుళాల ఎత్తులో, పంచలోహ మూర్తిగా, చిన్ముద్రా, అభయముద్రలతో పట్టబంధముతో పీఠంపై ఆసీనమై దర్శనమిస్తుంది! అత్యంత మనోహరము, శక్తివంతమూ అయిన మూల విగ్రహాన్ని చూస్తూ భక్త్యావేశంతో పరవశించిపోతారు దీక్షాధారులు మరొకదారినుండి వచ్చి దర్శించుకున్న ఇతర భక్తజనులు! ఈ విగ్రహానికే అన్ని రకాల అభిషేకాలు, పూజలు జరుగుతుంటాయి.

-ఇంకా ఉంది

-డా. టి. కళ్యాణీ సచ్చిదానందం