తెలంగాణ

మిడ్ మానేరు కాంట్రాక్ట్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 26: భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే, ఈ అనుభవాలతో భవిష్యత్‌లో అనర్థాలు జరుగకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. వరద ప్రాంతాలలో పర్యటించేందుకు జిల్లాకు వచ్చిన సిఎం సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువ మానేరు నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో మిడ్‌మానేరుకు గండి పడిందన్నారు. మిడ్‌మానేరు పనులు దశాబ్దకాలంగా జాప్యం కావడం వల్లే ఈ అనర్థం జరిగిందని ఆయన అన్నారు. పనుల్లో జాప్యం చేసిన వర్కింగ్ ఏజెన్సీ కాంట్రాక్ట్ రద్దు చేసి వెంటనే కొత్త టెండర్లు పిలవాలని అధికారులను ఆయన ఆదేశించారు. మిడ్‌మానేరు ఆనకట్ట 130 మీటర్ల మేర దెబ్బతిందని, ఇకపై వరదలు వచ్చినా పెద్దగా నష్టం లేదని అధికారులు సిఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇకపై ప్రమాదం లేనందున సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారిని తిరిగి వారివారి గ్రామాలకు చేర్చాలని సూచించారు. వర్కింగ్ ఏజెన్సీలు తమకు అప్పగించిన పనులు సకాలంలో చేసేవిధంగా అవసరమైన నిబంధనలు రూపొందించాలని, 5 శాతం మించిన లెస్‌కు పోకుండా చూడాలని, లెస్ టెండర్లు వేసినప్పుడు అంత మొత్తం బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నీటి పారుదల శాఖకు భారీ ఎత్తున నిధులు కేటాయించి పనులు చేపడుతున్న నేపథ్యంలో పనుల్లో వేగం అవసరమని తెలిపారు. 123 జిఓ ప్రకారం మంచి పరిహారం ఇస్తున్న నేపథ్యంలో భూసేకరణ, కొనుగోలు త్వరితగతిన పూర్తికావాలని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు మిడ్‌మానేరు చాలా కీలకమైనదని, మిడ్‌మానేరు పనులు నాణ్యతతో వేగంగా పూర్తి కావాలని ఆయన సూచించారు. గోదావరి వరదల నేపథ్యంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరంగల్ జిల్లా రామన్నగూడెం, ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాజెక్టుల వద్ద పెరుగుతున్న ఇన్‌ఫ్లోలకు అనుగుణంగా ఔట్‌ఫ్లోలు పెంచాలన్నారు. కరీంనగర్‌లోని ఎల్‌ఎండి నుంచి విడుదలయ్యే నీటిని ఖమ్మం, నల్గొండ జిల్లాల దాకా చేర్చాలని ఆదేశించారు.
మహారాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వరద అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నాటక నుంచి వచ్చే వరదను బట్టి సింగూర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లోను ఎప్పటికప్పుడు నిర్ణయించాలని సూచించారు. భారీ వర్షాలు కురవడం వల్ల రాష్ట్రంలోని చెరువులన్నీ నిండాయని, అలుగుపోస్తున్నాయని చెప్పారు. అన్నదాతలు ఆనందంలో ఉన్నారని, మిషన్ కాకతీయ ద్వారా పనులు చేసిన చెరువులలో ఒక కట్టకు కూడా ఇబ్బంది కలగకపోవడం గమనార్హమని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పనులవల్ల చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని, కట్టలు బలపడ్డాయని అన్నారు. ఈ పరిస్థితిని ప్రజలు గమనించాలని కోరారు. ఇంతకన్నా తక్కువ వర్షం, తక్కువ వరదలు వచ్చిన సందర్భాల్లో కూడా వందలాది చెరువు కట్టలు తెగిపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ పనులకు ప్రశంసలు వస్తున్నాయని అన్నారు.
వర్షాల వల్ల, వరదల వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చినా ముఖ్యంగా మనుషులు, పశువుల ప్రాణాలు కాపాడడానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. వరదలతో జరిగిన నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు, ఇళ్లు కోల్పోయిన వారికి వెంటనే పరిహారం ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు తన్నీరు హరీష్‌రావు, ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం మిడ్‌మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులపై మంత్రులతో కలిసి సిఎం కెసిఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు.