కృష్ణ

రేపు మెగా బిసి రుణమేలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, ఫిబ్రవరి 11: చంద్రన్న స్వయం ఉపాధి మెగా బిసి రుణ మేలాలో రూ.261 కోట్లను లబ్ధిదారులకు ఆర్థిక చేయూత అందించనున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి రవీంద్ర నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే చంద్రన్న స్వయం ఉపాధి మెగా బిసి రుణ మేలాలో రెండవ విడత కృష్ణాజిల్లాలో రూ.261కోట్లను లబ్ధిదారులకు ఆర్థిక చేయూత అందించేందుకు రుణాలను పంపిణీ చేయనున్నమన్నారు. బిసి కార్పొరేషన్ ద్వారా 34,193 మంది లబ్ధిదారులకు రూ.228కోట్లలో రూ.114 కోట్లు సబ్సిడీపోను, మిగిలిన రూ.114 కోట్లు రుణాలుగాను, బిసి ఫెడరేషన్ ద్వారా 6,153 మంది లబ్ధిదారులకు 33 కోట్లలో 16.50 కోట్లు సబ్సిడీపోను, 16.50 రుణాలకుగాను అందించనున్నామని తెలిపారు. మొదటి విడత 12 జిల్లాల్లో నిర్వహించిన మెగా బిసి రుణమేలా ద్వారా రూ.252 కోట్లను పంపిణీ చేసి బిసి వర్గాలకు ఆర్థిక చేయూత అందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల అభివృద్ధికి సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తుందని, సిఎం ఆయా వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. 10ఏళ్ల కాలంలో వెనకబడిన తరగతుల వర్గాలు నిర్లక్ష్యానికి గురైయ్యాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బిసి సబ్ ప్లాన్ ద్వారా రూ.6640 కోట్లు కేటాయించామన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా బిసి వర్గాల అభ్యున్నతికి 21 శాతం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. విద్యాపరంగాను ఆయా వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు చేస్తున్నామని గతంలో చెల్లించవలసిన వెయ్యికోట్ల రూపాయలతో కలిపి మొత్తం 1500 కోట్ల రూపాయలను చెల్లించామన్నారు. విదేశాల్లో చదువుకునేందుకు ప్రతి విద్యార్థికి 10 లక్షల రూపాయల చొప్పున అందించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం స్టడి సర్కిల్స్ ద్వారా పోటీ పరీక్షలలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ నెల 13న శనివారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే చంద్రన్న స్వయం ఉపాధి మెగా బిసి రుణమేలాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు జిల్లాలోని చేతి వృత్తులు, కులవృత్తులు ఏర్పాటు చేసే స్టాల్స్‌ను ప్రతి ఒక్కరూ సందర్శంచి అవగాహన కల్పించుకోవాలని మంత్రి కోరారు. మీడియా సమావేశంలో బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర బిసి ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కృష్ణమోహన్, బిసి కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్ధన్ పాల్గొన్నారు.

ప్రశాంతంగా ముగిసిన గుణదలమాత మహోత్సవాలు
పటమట, ఫిబ్రవరి 11: మూడు రోజులుగా జరుగుతున్న గుణదలమాత మహోత్సవాలు గురువారం రాత్రితో ప్రశాంతంగా ముగిశాయి. అమ్మా ధున్యులం.. మరిమమాత ధన్యులం.. దయచూపే మాతా ధన్యులం,, అంటూ లక్షలాది మంది భక్తులు గుణదలమాతను వేడుకున్నారు. తేజోమయి..కరుణచూపవా.. అంటూ భక్తజనం తరలివచ్చి మొక్కుబడులు తీర్చుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఆశేష సంఖ్యంలో ఉత్సవాలకు భక్తులు విచ్చేయడంతో గుణదల కొండ ప్రాంతాలు, వీధులన్నీ జనసంద్రమయ్యాయి. కొండపై మరియమాతను, కొండ శిఖరాన ఏసుప్రభువును భక్తులు బారులుతీర్చి దర్శించుకున్నారు. గుణదల బిషప్ గ్రాసి హైస్కూల్ గ్రౌండ్‌లోప్రత్యేకంగా అలంకరించిన పూజాపీఠంపై విజయవాడ కతోలిక పీఠం పీఠాధిపతులు తెలగతోటి జోసఫ్ రాజారావు, నల్కొండ పీఠాధిపతులు గోవిందు జోజి, కర్నూలు మాజీ పీఠాధిపతులు మాథ్యు చెరియన్ కునె్నల్, గుణదలమాత పుణ్యక్షేత్రం రెక్టర్ యం.చిన్నప్ప, ఛాన్స్‌లర్ జె.జాన్‌రాజు తదితర గురువులు ఉత్సవాల ముగింపు‘సమిష్టిదివ్యపూజాబలి’ సమర్పించారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు భక్తులకు దివ్య సందేశమిస్తూ 1858లో ఫ్రాన్సుదేశంలోని లూర్ధునగర్‌లో బెర్నెదత్ అనే బాలికకు లూర్ధుమాత దర్శనమిచ్చిందని తెలిపారు. తెల్లని వస్తమ్రైన అంగీతో లూర్ధుమాత బెర్నెదత్‌కు దర్శినమిచ్చిన సమయంలో ఆ దర్శన ప్రాంతమంతా సుగంధ పరిమరాలగా మారిందన్నారు. ఇప్పటికీ లూర్ధునగర్‌లో ఫిబ్రవరి 11న 50 లక్షల మంది భక్తులు, వ్యాధిగ్రస్థులు సందర్శించి అనేక మేలులు పొందుతున్నారన్నారు. మరియతల్లి చెప్పిన ప్రకారం ఎవరైతే దేవుని ప్రేమను ఆహ్వానిస్తారో వారు దేవుని కృప కటాక్షాలు పాత్రులవుతారని అన్నారు. మరియమాత బైబిల్ మాతగా, కారుణ్య మాతగా కూడా విరాజిల్లుతుందన్నారు. క్రీస్తుప్రభువును ఈ లోకానికి తీసుకురావడానికి మరితల్లిని ఎంచుకున్నారని తెలిపారు. గుణలమాత ప్రియ బిడ్డలుగా జీవిస్తున్న భక్తులు హృదయపరివర్తన పొంది ఉత్సవాలు నుండి తిరిగి వెళ్లాలన్నారు. పూజానంతరం బిషప్ రాజారావు, పుణ్యక్షేత్రం రెక్టర్ యం.చిన్నప్ప, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్ మువ్వలప్రసాద్, పొక్రైయిటర్ యం.గాబ్రియేలు, ఎడ్యుకేషన్ డస్క్ వైస్ ఛైర్మన్ కొండ్రు సింహారాయులు, ఫాదర్ లాము జయరాజు, ఫాదర్ పి.డి.దత్త్, ఫాదర్ గోళ్ళ విజయకుమార్ తదితర గురువులు వేలాది మంది కతోలిక క్రైస్తవులకు దివ్యసత్ప్రసాదం అందజేశారు. బిషప్ తెలగతోటి రాజారావును, బిషప్ గోవిందు జోజిని, బిషప్ మాధ్యు చెరియన్ కునె్నల్‌ను పుణ్యక్షేత్రం రెక్టర్ చిన్నప్ప ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎస్.సి.కార్పొరేషన్ ఛైర్మన్ జుపూడి ప్రభాకరరావు, ఫాదర్ తెలగతోటి పౌలు, ఫాదర్ మువ్వలప్రసాద్, ఫాదర్ దూసి రవిశేఖర్, ఫాదర్ దేవకుమార్ తదితరులు గురువులు, మఠకన్యలు, భక్తులు పాల్గొన్నారు. మూడు రోజులు తిరునాళ్లకు సుమారు 10 లక్షల మంది భక్తులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

ముస్లిం రిజర్వేషన్లను 8 శాతానికి పెంచాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 13: ముస్లింలు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిసి చర్చించాలని గురువారం నగరంలో జరిగిన ముస్లిం మేధావుల ఫోరం సదస్సు నిర్ణయించింది. తమ డిమాండ్లపై సిఎం సానుకూల స్పందించని పక్షంలో భారీఎత్తున ముస్లింలను సమీకరించి ముస్లిం గర్జన నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఫోరం కన్వీనర్ డాక్టర్ అబ్దుల్ రెహమాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కో-కన్వీనర్ ఫారూఖ్ షుబ్లీ ఎం, శాసనసభ్యులు జలీల్‌ఖాన్, డాక్టర్ ఎంఎ రెహమాన్, న్యాయవాది ఎంఎ రహీం, సీనియర్ జర్నలిస్టు షఫీ అహ్మద్ పాషా, వ్యాపారవేత్తలు అబ్దుల్ బషీర్, ఎండి అల్లావుద్దీన్, ఎండి జానీ, ఎండి హనీఫ్, న్యాయవాది సయ్యద్ అల్త్ఫా, తదితరులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పలు వర్గాల సంక్షేమానికి చేయూతనిస్తూ ఇతోధిక కేటాయింపులు కేటాయిస్తూ కూడా మైనార్టీ ముస్లిం వర్గాల పట్ల చిన్నచూపు చూపటం దురదృష్టకరమన్నారు. గత వార్షిక బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించి 2014 ఎన్నికల మేనిఫెస్టోకు తిలోదకాలివ్వటం శోచనీయమన్నారు.
ప్రస్తుత మైనార్టీలకు అమలవుతున్న 4శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని, జనాభా ప్రాతిపదికన 8 శాతానికి పొడిగించాలని విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పక్కాగా అమలుచేయాలని, వచ్చే వార్షిక బడ్జెట్‌లో ముస్లిం మైనార్టీలకు వెయ్యి కోట్లు కేటాయించాలని జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ సిఫార్స్‌లను అమలుపర్చాలని, ముస్లిం మైనార్టీ వర్గాల వారికి కేజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అందించాలని, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆర్థిక పరిపుష్టి కల్పించి బ్యాంకులతో పనిలేకుండా అర్హులైనవారికి వడ్డీలేని రుణ సౌకర్యాన్ని కల్పించాలని, గతంలో సిఎం హామీనిచ్చిన విధంగా లారీ స్టాండ్‌లో హజ్ హౌస్ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న గృహాల్లో మైనార్టీలకు 15 శాతం కేటాయించాలని, వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపడుతూ వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టాలని, ముసాఫిర్ ఖానా పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రిచే శంకుస్థాపన చేయించాలని, ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం మసీదు ఇమామ్‌లకు, వౌజన్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలని, మైనార్టీ కార్పొరేషన్‌కు ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తూ కేంద్రం నుంచి వక్ఫ్ నిధులు అధికంగా రాబట్టాలని తీర్మానం చేశారు.

సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 11: గతంలో మాదిరిగా నగరంలో నీటి ఎద్దడి ఎదురవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకొంటున్నామని, ప్రస్తుతం సరఫరా చేసే నీటితోపాటు మరో 15ఎంఎల్‌డి నీటిని సరఫరా చేసేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసి కార్యరూపంలోకి తీసుకొస్తున్నట్టు నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కౌన్సిల్ భవనంలోని తన ఛాంబర్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మేయర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ గత పాలకుల హయాంలో నీటి సమస్యలను తట్టుకోలేక ఖాళీ బిందెలతో ప్రదర్శనలు చేసిన ఉదంతాలు అందరికీ తెలిసిందేనని, అయితే గత సంవత్సరం తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంచినీటి సరఫరాను మెరుగుపర్చిన కారణంగా నీటి కోసం ప్రజల నిరసన ప్రదర్శనలు చేసిన ఘటనలు లేవన్న విషయాన్ని గుర్తించాలన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద 8 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని, ఆ నిధులు విడుదలైయ్యే లోపుగా విఎంసికి చెందిన జనరల్ ఫండ్ నిధులు రెండున్నర కోట్ల రూపాయల విలువైన పనులను కార్యరూపంలోకి తీసుకొచ్చామని, త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తయి పూర్తిస్థాయి పనుల నిర్వహణ చేపడతామన్నారు. నగరంలోని మూడు సర్కిల్ పరిధికి చెందిన కార్పొరేటర్లందరితోపాటు అధికారులను కూడా కలిసి నిర్వహించిన సమావేశంలో వారు నివేదించిన సమస్యల కనుగుణంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించినట్టు తెలిపారు. మొదటి సర్కిల్ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గానికి రూ.69లక్షల 26వేలు, రెండవ సర్కిల్ పరిధిలోని సెంట్రల్ నియోజకవర్గానికి రూ.66లక్షలు, మూడవ సర్కిల్ పరిధిలోని తూర్పు నియోజకవర్గానికి అత్యధికంగా 99లక్షల 44వేల రూపాయల అంచనాలతో యాక్షన్ ప్లాన్‌ను రూపొందించామన్నారు. వాస్తవానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం నగరంలోని ప్రతి మనిషికి రోజుకు 150 ఎంఎల్‌డి నీటిని సరఫరా చేయాలని ఉండగా విఎంసి ఇప్పటికే 160 ఎంఎల్‌డి నీటిని సరఫరా చేస్తోందని, అయితే నగర ప్రజల మరిన్ని అవసరాలను తీర్చేందుకు గాను అందనంగా మరో 15 ఎంఎల్‌టి నీటిని అంటే 175 ఎంఎల్‌డి నీటిని సరఫరా చేసేందుకు అంచనాలను రూపొందించామన్నారు. సెంట్రల్ పరిధి డివిజన్లలో 46 బోర్లను ఏర్పాటు చేయడంతోపాటు మరో 3 ట్రాక్టర్లతో నీటి సరఫరా చేయనున్నట్టు తెలిపారు. అలాగే మరికొన్న ప్రాంతాల్లో నీటి ఉధృతి పెంచేందుకు ఆరున్నర లక్షల రూపాయలతోవిద్యుత్ మోటార్లను ఏర్పాటు చేస్తామన్నారు. తూర్పు నియోజకవర్గంలో మొత్తం 10బోర్లు 5 ట్రాక్టర్లతో నీటిని సరఫరా చేస్తామని, ప్రస్తుతం ఉన్న 10ఎంజిడి ప్లాంట్ నిరుపయోగమైనందున బోర్లను ఏర్పాటుచేసి మంచినీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. ఎంతో వ్యయ ప్రయాశలతో అవసరానికి మించి సరఫరా చేస్తున్న నీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే నీటి కుళాయిలకు హెడ్స్‌ను ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టితే మరింత మెరుగైన మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుంటుందన్నారు. అలాగే ప్రస్తుతం తాము ఏర్పాటుచేసే సరఫరా కాకుండా ఎక్కడైనా నీటి ఇబ్బందులు ఎదురైతే సత్వరమే ఆయా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొంటామన్నారు.

రవాణాశాఖ కార్యాలయంపైఎసిబి దాడులు
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 11: డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతున్న క్రమంలో వస్తున్న ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించింది. దీనిలో భాగంగా గురువారం కార్యాలయంపై ఏసిబి డిఎస్పీ వి గోపాలకృష్ణ నేతృత్వంలో అధికార బృందం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆర్టీఏలో ఏజెంట్ల వ్యవస్థ రద్దయి, పౌరసేవలు పాదర్శకంగా కొనసాగుతున్నా.. అది నామమాత్రమేనని ఈదాడుల్లో గుర్తించారు. ముఖ్యంగా ఎల్‌ఎల్‌ఆర్ విభాగం అవకతవకలు గుర్తించారు. అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎంవివి సన్యాసినాయుడు పర్యవేక్షణలో ఆర్టీఏ కానిస్టేబుల్ భద్రాచలం నేతృత్వంలో పరీక్ష రాయకుండానే వాహన యజమానులకు దొడ్డిదారిన లైసెన్స్‌లు మంజూరు చేస్తున్నట్లు ప్రాధమికంగా వెల్లడైంది. కార్యాలయంలోని ఎల్‌ఎల్‌ఆర్ విభాగంలో అవకతవకలు గుర్తించారు. ఇక్కడ ఉన్న అధికారులకు ఇందిరాగాంధీ మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఉన్న దళారులు కస్టమర్ వద్ద డబ్బు తీసుకుని ఫైల్‌ను లోపలకు పంపి సెల్‌ఫోన్ ద్వారా సమాచారం లేదా చీటి మీద రాసి పంపగానే పని షురూ అవుతుంది. ఈప్రక్రియకు సంబంధించి కాంపెక్స్‌లోని షాపు నెంబర్ 24పై కూడా దాడులు నిర్వహించిన అధికారులు ఎల్‌ఎల్‌ఆర్ విభాగం చూసే బ్రోకర్లు అడబాల పవన్‌కుమార్, కోలా త్రినాధ్‌బాబు, నేషనల్ పర్మిట్లు చూసే బ్రోకర్లు పిల్లి దుర్గప్రసాద్, రామిశెట్టి వెంకట నాగమల్లేశ్వరరావు, వాహన రిజిస్ట్రేషన్ల వ్యవహారం చూసే దోసెనపూడి ప్రకాశరావు, మునగ జనార్ధన్, అరిగె నారెన్‌కుమార్‌లతోపాటు ఇన్సూరెన్స్ వ్యవహారం చూసే దేవరపల్లి సాయికోటేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్‌పెక్టర్ సన్యాసినాయుడు, కానిస్టేబుల్ భద్రాచలం కూడా అదుపులో ఉన్నారు. వీరి నుంచి అధికారులు సమాచారం రాబడుతున్నారు. ఆర్టీఓ పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం ఈ అవినీతి వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేసిన మీదట నిందితులను నిగ్గు తేల్చి అరెస్టు చేస్తామని డిఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. అదుపులో ఉన్న వారి నుంచి రెండు లక్షల 13వేల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఏసిబి సిఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.

మహోన్నత వ్యక్తి పండిట్ దీనదయాళ్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 11: మానవ జీవన వికాసానికి ‘ఏకాత్మా మానవతా దర్శన్’ సిద్ధాంతాన్ని రూపొందించి జాతీయ రాజకీయాలకు దశ దిశ కల్పించిన మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయగా విశాఖ ఎంపి, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు వర్ణించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 48వ వర్ధంతి కార్యక్రమం భాజపా రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హరిబాబు, ముందుగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన ‘ఏకాత్మ మానవతా దర్శన్’ ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా ప్రజలకు మేలు చేసేదిగా ప్రశంసలందుకుందన్నారు. దీంతో తమకు ప్రజల్లో ఆదరణ తగ్గి, పలుకుబడి కోల్పోతామనే భయంతో కమ్యూనిస్టులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయను అజ్ఞాత వ్యక్తులచే మొగల్ సరాయ్ రైల్వేస్టేషన్ వద్ద 1968లో హత్య చేయించారన్నారు. దీన్ దయాళ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పార్టీ కార్యకర్తలంతా ప్రజలకు సేవ చేయాలని, పార్టీని అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి జిఆర్ రవీంద్రరాజు, ఎస్‌సి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ కుమారస్వామి, సక్కుర్తి శ్రీనివాసరావు, ఎం.వెంకటసుబ్బయ్య, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మల అంజిబాబు, కార్యాలయం కార్యదర్శి పాలూరి శ్రీనివాసరావు, గుజరాత్ అసోసియేషన్ అధ్యక్షుడు పీయూష్ దేశాయ్ పాల్గొన్నారు.