తెలంగాణ
రైతు చెంతకు పరిశోధన ఫలితాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడిపరిశ్రమ, పశుపోషణ, కోళ్లపరిశ్రమ, ఉద్యానపంటలు, పట్టు పరిశ్రమలపై రైతుల్లో ఆసక్తి కలిగించాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ‘మేనేజ్’ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్) నేతృత్వంలో ‘నార్మ్’ (నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్) ఆడిటోరియంలో ‘స్కిల్ డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్’పై సోమవారం జరిగిన రీజనల్ వర్క్షాప్లో మంత్రి మాట్లాడారు. శాస్తవ్రేత్తలు చేస్తున్న పరిశోధనా ఫలితాలు రైతులకు చేరాలని, ఈ పరిశోధనా ఫలితాలు పొలాల్లో అమల్లోకి రావాలని, అప్పుడే ఈ పరిశోధనల వల్ల సమాజానికి లాభం జరుగుతుందన్నారు. వ్యవసాయంపై వచ్చే ఆదాయంతో పాటు అనుబంధ రంగాలను రైతులు చేపడితే అదనంగా ఆదాయం లభిస్తుందన్నారు. ఈ కోణంలో రైతుల్లో చైతన్యం కలగాలని, వారిలో విశ్వాసం ఏర్పడాలని, సాంకేతికంగా, ఆర్థికంగా చేయూత ఇవ్వగలగాలని మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం వ్యవసాయ అధికారులతో పాటు బ్యాంకర్లు కూడా ముందుకు రావాలని కోరారు. పంటలపై పెట్టుబడి తగ్గేలా చూడటం, ఉత్పత్తి పెరగడంతోపాటు గిట్టుబాటు ధరలు లభించాల్సి ఉందన్నారు. రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిపోయి, అదనపు ఆదాయా న్ని రైతులు బ్యాంకుల్లో డిపాజిట్ చేసే స్థాయికి ఎదగాల్సి ఉందన్నారు.
ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, సరైన ఆదాయం లేకపోవడంతో వారు తమ పిల్లలకు మంచి విద్యను అందించలేకపోతున్నారని, మెరుగైన జీవనాన్ని పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న రుణాల పరిమాణాన్ని పెంచుతోందని, అయితే రుణాల అవసరమే లేని పరిస్థితికి రైతులు చేరాలన్నదే తన ఉద్దేశమన్నారు. పాలీహౌజ్లకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఎకరాకు 40 లక్షల రూపాయలు ఖర్చయితే, 30 లక్షల రూపాయలు సబ్సిడీగా ఇస్తున్నామని మంత్రి పోచారం తెలిపారు. ఇప్పటి వరకు 1000 ఎకరాల్లో పాలీహౌజ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చామని, వచ్చే ఏడాది 3000 ఎకరాల్లో పాలీహౌజ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్నారు. దేశంలో మొట్టమొదటి సారి 2000 హెక్టార్లకు ఒక ఎఇఓ (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్) ను నియమించామని మంత్రి తెలిపారు. ప్రతి ఎఇఓ పరిధిలో మినీ భూసారపరీక్షా కేంద్రం నెలకొల్పాలని నిర్ణయించామన్నారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండాలని, అవసరమైన పెట్టుబడులు పెట్టగలిగే స్థితికి రావాలని, యంత్రాల ఉపయోగం చేయగలగాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ అడిషనల్ సెక్రటరీ రాఘవేంద్రసింగ్, తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, మేనేజ్ డైరెక్టర్ జనరల్ వి.ఉషారాణి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్- చాన్సలర్ డాక్టర్ వి.ప్రవీణ్రావు మాట్లాడారు. ఎనిమిది రాష్ట్రాల నుండి 400 మంది సేద్యం రంగం నిపుణులు పాల్గొన్నారు.
చిత్రం..నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఆడిటోరియంలో ‘వ్యవసాయంలో నైపుణ్యాభివృద్ధి’ పై మాట్లాడుతున్న మంత్రి పోచారం