రాష్ట్రీయం

తుళ్లూరుకు ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజధాని ప్రాంతంలో సీన్ రివర్స్
స్తంభించిన క్రయవిక్రయాలు
రైతుల్ని దెబ్బతీసిన సిఆర్‌డిఏ నిబంధనలు
నిరాశతో సర్కారుకు భూములిచ్చిన రైతులు
భూసేకరణే ప్రయోజనకరమని తాజా నినాదం
మళ్లీ కథ మొదటికొచ్చే అవకాశం!
విజయవాడ, మార్చి 12: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రస్తావన వచ్చిన వెంటనే గుర్తొచ్చేది తుళ్లూరు. రాజధాని ప్రాంతంలో కీలక గ్రామం ఇది. రాజధాని నిర్మాణంలో తళ్లూరు కేంద్రబిందువుగా నిలిచింది. రాజధాని వస్తే తమ భూములు బంగారు గనులైపోతాయని రైతులు భావించారు. ఉన్న భూమిలో సగం ప్రభుత్వానికిచ్చి, మిగిలిన భూమిని అమ్ముకున్నా జీవితంలో స్థిరపడిపోతామని కలలు గన్నారు. బంగారం పండే నేలపై మమకారం చంపుకొని చాలామంది రైతులు ప్రభుత్వం అడిగిందే తడవుగా తమ భూములను అప్పగించారు. భూములిచ్చే సమయంలో సిఆర్‌డిఏ ఇక్కడి రైతులకు ఒక వెసులుబాటు కల్పించింది. భూములు తమకు ఇచ్చినప్పటికీ, వేరెవరైనా వచ్చి ఎక్కువ ధర చెల్లిస్తామంటే వారికి అమ్ముకోవచ్చని పేర్కొంది. రాజధానిగా అమరావతిని ప్రకటించిన వెంటనే ఇక్కడి భూముల ధరలు అమాంతం పెరిగి, కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రాజధాని ప్రకటనకు ముందు ఇక్కడ ఎకరా భూమి విలువ 5 నుంచి 7 లక్షల రూపాయలు ఉంటే, రాజధానిని ప్రకటించిన తరువాత ఏకంగా కోటీ 30లక్షల రూపాయలకు పెరిగిపోయింది. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ కన్నా ఓపెన్ మార్కెట్ ధర మూడు రెట్లు అధికంగా పలికింది. అయితే, ఇక్కడి రైతులు మరింత ఎక్కువ ధర వస్తుందని ఆశపడి భూములను విక్రయించలేదు. కొద్ది నెలల ముందు వీరు భూములు విక్రయించుకుంటే కోటీశ్వరులయ్యేవారు. కానీ హఠాత్తుగా ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.
రాజధాని పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కళ్ళెం వేసేందుకు సిఆర్‌డిఏ కొన్ని నిబంధనలు విధించింది. ఎవరికి వారు తమ ఇష్టం వచ్చినట్టు వెంచర్లు వేయడానికి వీల్లేదనే నిబంధన ప్రధానమైంది. వెంచర్ వేయాలంటే సిఆర్‌డిఏ అనుమతి తప్పనిసరి అనే నిబంధన పెట్టింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనడానికి ముందుకు రాలేదు. అలాగే రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో రాష్ట్ర ప్రభుత్వం చతికిలపడిపోయింది. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ పవిత్ర నీరు - మట్టి ఇచ్చివెళ్లారు తప్ప, నిర్మాణానికి కావాల్సిన నిధులు మాత్రం నేటికీ విదిల్చలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ కేవలం 850 కోట్ల రూపాయలే ఇచ్చింది. దీంతో రాజధాని ప్రాంతంలో వౌలిక సదుపాయాలు మాత్రమే చేపట్టాలని నిబంధన విధించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఖజానా వట్టిపోయి ఉంది. రాజధానికి సంబంధించిన భవనాలు నిర్మించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించటం లేదు. రాష్ట్ర బడ్జెట్‌లో 1500 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెపుతున్నా, అంత మొత్తాన్ని ఈ సంవత్సరంలో ఖర్చుచేసే అవకాశం లేదు. ఇప్పటికే 200 కోట్ల రూపాయల వ్యయంతో సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరం ఇంతకు మించి రాజధాని భవనాలు నిర్మించే సూచనలు కనిపించడం లేదు. రాజధాని ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశాలు కూడా లేవు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజధాని పరిధిలో భూములు కొనడానికి ముందుకు రావడం లేదు. దీంతో తుళ్లూరు గ్రామంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఇదిలావుంటే, రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతున్నారు. వాస్తవానికి అంత భూమి ప్రభుత్వం చేతికి అందలేదని తెలుస్తోంది. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన అధిక శాతం రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడక కోర్టులను ఆశ్రయించారు. ఇప్పటికే సుమారు 500లకు పైగా కేసులు కోర్టుల్లో ఉన్నాయి. మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం, బేతపూడి గ్రామాల్లోని రైతులు కూడా భూములు ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నారు. కొందరు రైతులు భూసమీకరణలో ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చారు. అయితే, భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రక్రియ ఇప్పటికీ మొదలుకాలేదు. దీనికోసం రైతులు ఎదురుచూడాలనుకోవడం లేదు. ఇప్పటివరకూ రాజధానికి భూములు ఇవ్వని రైతుల భూములను భూసేకరణ కింద తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇటీవలే 177 ఎకరాలకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. భూసమీకరణ కన్నా భూసేకరణతో ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ప్రచారం జరగడంతో ఇప్పటికే భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులు కూడా వాటిని వెనక్కు తీసుకుని భూసేకరణకు వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో రాజధాని భూముల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని కోసం భూములను సేకరించడానికి ప్రభుత్వం సృష్టించిన హైప్‌లో చాలామంది రైతులు చిక్కుకున్నారు. ప్రభుత్వం పేర్కొన్నంత గొప్పగా భూముల ధరలు పెరగలేదు. కొన్నిచోట్ల పెరిగినా, కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

కెవిజి శ్రీనివాస్