రాష్ట్ర వార్తలు

బొబ్బిలి, ఫిబ్రవరి 22: విజయనగరం జిల్లా బొబ్బిలిలో బుధవారం కవలలు సందడి చేశారు. వీరి భావాలు, అభిప్రాయాలు, ఆశయాలు దాదాపు ఒకేలా ఉండటం పరిపాటి. ఇటువంటి కవలలను ఒకే వేదికపైకి తేవడం గొప్ప విషయమే. 1976లో ఫిబ్రవరి 22న పోలెండ్ దేశస్థులు కవలల దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో ఈ సంస్కృతి అలవడింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఉన్న బొబ్బిలి ఫిల్మ్ సొసైటీ నిర్వాహకులు స్థానిక కళింగవైశ్య భవనంలో బుధవారం కవలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రాంతంతోపాటు చుట్టు ప్రక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కవలలను సేకరించి ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. పట్టణ పరిధిలో ఉన్న వివిధ ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కవలల విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొని పలువురి ఆశ్చర్యచకితులను చేశారు. దాదాపు 20 కవలల జంటలు పాల్గొని పలువురి మన్ననలు పొందారు. అరుదుగా కనిపించే ఇటువంటి కవల పిల్లలను తిలకించేందుకు ప్రజలు తరలివచ్చి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బొబ్బిలి ఫిల్మ్ సొసైటీ నిర్వహకులు ఎం.విజయమోహన్, సురవౌళి, జి. శ్రీనివాసరావులను అభినందించారు. (చిత్రం) కవలల దినోత్సవం సందర్భంగా బొబ్బిలిలో ఒకే వేదికపైకి వచ్చిన చిన్నారులు
Add new comment