జాతీయ వార్తలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: సుప్రీంకోర్టు నూటా ఇరవై రెండు 2జి టెలికాం లైనన్సులను రద్దు చేయటంతో యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలు సంక్షోభంలో పడిపోయాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి సుప్రీం కోర్టు తీర్పు మూలంగా ఉత్పన్నమైన పరిస్థితుల గురించి చర్చించటంతోపాటు తీసుకోవలసిన తదుపరి చర్యల గురించి మంతనాలు జరిపారు. కోర్టు తీర్పు రాగానే మన్మోహన్ సింగ్ మొదట కేంద్ర మానవ వనరులు, టెలీకమ్యూనికేషన్ల శాఖ మంత్రి కపిల్ సిబల్తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. సంకీర్ణ ప్రభుత్వంపై, టెలికమ్యూనికేషన్ల రంగంపై తీర్పు మూలంగా పడే ప్రతికూల ప్రభావం గురించి చర్చించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా కోర్టు తీర్పు మూలంగా ఉత్పన్నమైన పరిస్థితులను వివరించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విడిగా సమావేశమై సుప్రీంకోర్టు తీర్పు మూలంగా కాంగ్రెస్ పార్టీ, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పడే ప్రభావం గురించి సమీక్షించారు. ప్రతిక్షం ముఖ్యంగా బిజెపి రాజకీయంగా చేసే దాడిని ఎలా తిప్పికొట్టాలి, మన్మోహన్ సింగ్, చిదంబరంలు వెంటనే రాజీనామా చేయాలనే ఆ పార్టీ డిమాండ్ను ఎలా ఎదుర్కొనాలనే అంశంపై చర్చలు జరిపారు. డిఎంకెకు చెందిన మాజీ టెలికాం మంత్రి ఏ.రాజాతోపాటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తప్పు పట్టటం ద్వారా కోర్టు తీర్పు ప్రభావం నుండి బైటపడేందుకు ఎత్తులు వేస్తున్నారు. కోర్టు తీర్పు ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదని, టెలికాం విధానాన్ని తప్పు పట్టినందున ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్న విధంగా హోంమంత్రి పి.చిదంబరం లేదా మరో మంత్రి రాజీనామా చేయవలసిన అసరం లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. ప్రతిపక్షం 2జి లైసెన్సుల రద్దును ప్రస్తావించటం ద్వారా ఈ నెలాఖరులో ప్రారంభమవుతున్న బడ్జెట్ సమావేశాలను అడ్డుకుంటాయని కాంగ్రెస్ అంచనా వేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఉత్తరప్రదేశ్, గోవా అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చునని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నైతికంగా కొంత దెబ్బ తగులుతుందని పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు.
సుప్రీం కోర్టు హోం మంత్రి పి.చిదంబరంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవటం ఆయన నిర్దోషిత్వాన్ని రుజువు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం అధ్యక్షుడు జనార్దన్ ద్వివేదీ తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం స్పందిస్తుంది తప్ప పార్టీ కాదని ఆయన స్పష్టం చేశారు. కోర్టు తీర్పును పార్టీ గౌరవిస్తుందంటూ తీర్పు పూర్తి పాఠాన్ని చదివిన అనంతరం పార్టీ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని జనార్దన్ ద్వివేదీ విలేఖరులతో చెప్పారు. తీర్పు పూర్తి పాఠాన్ని చదువకుండా వ్యాఖ్యానించటం మంచిది కాదని పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ స్పష్టం చేశారు. లోక్సభ నాయకుడు, ఆర్థిక మంత్రి ప్రణమ్ ముఖర్జీ కోర్టు తీర్పుపై వ్యాఖ్యానిస్తూ ప్రభుత్వం అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన అనంతరం ఏం చేయాలనేది నిర్ణయిస్తుందని చెప్పారు. 2జి స్పెక్ట్రం వంటి సీరియస్ వ్యవహారంపై తొందరపడి వ్యాఖ్యానించటం ఎంత మాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు.
====================
చిదంబరానికి రక్షణ కవచం
యూపీఏ వ్యూహం సిద్ధం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: సుప్రీం కోర్టు గురువారం 2జి స్పెక్ట్రమ్ వ్యవహారంపై ఇచ్చిన తీర్పులో చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా హోంమంత్రి పి చిదంబరాన్ని కాపాడుకునే వ్యూహానికి యుపిఏ సంకీర్ణ సర్కారు తుది మెరుగులు దిద్దుతోంది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం మంత్రివర్గ సమావేశంలో సుప్రీం తీర్పు గురించి సమీక్షించిన అనంతరం లోక్సభ నాయకుడు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, మానవ వనరులు, టెలి కమ్యూనికేషన్ల మంత్రి కపిల్ సిబల్, రక్షణ మంత్రి ఏకె ఆంటోని, హోంమంత్రి పి చిదంబరంతో సమావేశమై ప్రభుత్వ వ్యూహాన్ని ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. యూపీఏ సీనియర్ మంత్రులతో జరిపిన చర్చల గురించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు వివరించిన అనంతరం సర్కారు వ్యూహంపై తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జిఎస్ సింఘ్వి, ఏకె గాంగూలీ గురువారం 2జిపై తీర్పు చెబుతూ అప్పటి టెలి కమ్యూనికేషన్ల మంత్రి ఏ రాజా కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన సలహాను బేఖాతరు చేశారని వ్యాఖ్యానించటం తెలిసిందే. అప్పటి ఆర్థిక శాఖ, ప్రస్తుత హోంమంత్రి పి చిదంబరంతోపాటు ప్రధాని మన్మోహన్ కార్యాలయం 2జి స్పెక్ట్రం కేటాయింపుపై ఇచ్చిన సలహాను రాజా పట్టించుకోలేదని సుప్రీం కోర్టు తీర్పులో వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు చిదంబరం వ్యవహారాన్ని ట్రయల్ కోర్టుకు వదిలివేయటం కూడా తెలిసిందే. ట్రయల్ కోర్టు చిదంబరం వ్యవహారంపై విచారణ ప్రారంభించినప్పుడు సుప్రీం కోర్టు గురువారం తమ తీర్పులో ఆర్థిక శాఖ ఇచ్చిన సలహాను రాజా బేఖాతరు చేశారని చేసిన వ్యాఖ్యను ఉపయోగించుకోవటం ద్వారా పిటిషనర్ సుబ్రమణ్య స్వామి వాదనను దెబ్బ తీయాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ట్రయల్ కోర్టు ఈనెల 4న చిదంబరంపై సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్న విచారణకు స్వీకరిస్తుంది. 2జి కేసులో చిదంబరాన్ని కూడా సహనిందితుడిగా పరిగణించి విచారించాలని సుబ్రమణ్యస్వామి తమ పిటిషన్లో కోరారు.
Comments
Hari (not verified)
Fri, 02/03/2012 - 04:54
Permalink
Why PM still in office?
P.S.R.SWAMI (not verified)
Fri, 02/03/2012 - 07:59
Permalink
2G Spectrum SC Judgment
APR (not verified)
Fri, 02/03/2012 - 20:46
Permalink
Singh JI sitting on PM's seat
Add new comment