ఉత్తరాయణం

తెలుగుభాషను కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని అలనాడు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషా సంస్కృతీ వైభవాలను కొనియాడారు. ప్రపంచ భాషలలో తెలుగు అనేక అద్భుతాలను ప్రోది చేసుకున్న భాషగా, ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా ఎందరో ఏనాడో ఒప్పుకున్నారన్నది జగమెరిగిన సత్యం. అలాంటి మధురమైన, అద్భుతమైన భాషను తెలుగువాళ్ళే భ్రష్టుపట్టిస్తున్నారన్నది ఎంతో బాధ కలిగించే విషయం. ‘నేషనల్ సెంటర్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్’ సంస్థ 2011 జనాభా ప్రాతిపదికగా చేసిన అధ్యయన నివేదిక ప్రకారం దేశంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 1971లో 8.16 శాతంతో రెండవ స్థానంలో వుండగా, ప్రస్తుతం 6.6 శాతంతో నాలుగో స్థానానికి పడిపోవడం బాధాకరం. తెలుగు భాషను ఇంతలా అశ్రద్ధ చేయడం సహించరాని విషయం. దేశంలో హిందీ మాట్లాడేవారి సంఖ్య నాలుగు శాతం పెరగగా, ప్రాంతీయ భాషలలో మరాఠీ ఆరవ స్థానం నుండి మూడవ స్థానానికి ఎదగడం అదే సమయంలో తెలుగు భాష స్థానం పడిపోవడం ఆందోళనకరం. ఇక మాతృభాషలో పాలన విషయంలో 82 శాతంతో యుపి, బిహార్, హర్యానా వంటి హిందీ రాష్ట్రాలు, 79 శాతంతో తమిళం పోటీ పడడం చూస్తుంటే వారికి తమ భాషల పట్ల గౌరవం, వాటిని కాపాడుకోవాలనే తపన స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్యాంగంలోని 99 నాన్ షెడ్యూల్డ్ భాషల్లో దాదాపు 17 భాషలు కనుమరుగు కావడంతోపాటు వేగంగా అంతరించిపోతున్న భాషల్లో తెలుగు ఒకటి అన్న సదరు నివేదికతోనైనా తెలుగు ప్రజలు అప్రమత్తం కావాలి. మాతృభాష పట్ల ఎనలేని ప్రేమ, తపన, గౌరవంతో ఆయా భాషల పరిరక్షణ కోసం పొరుగు రాష్ట్రాలు చేస్తున్న కృషిని చూసైనా మనకు కనువిప్పు కలగాలి. ఆంగ్లం, హిందీ భాషలను నేర్చుకోవాలన్న ఆసక్తి, తపన వుండడంలో తప్పులేదు కాని అదే సమయంలో తెలుగు నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదన్న పనికిమాలిన అభిప్రాయాలను విడిచిపెట్టి, తెలుగు భాష నేర్చుకునేలా ప్రతి తెలుగువాడు కృషిచేయాలి. మాతృభాషలు కనుమరుగు కాకూడదన్న సదుద్దేశంతో గతంలో పెద్దలు త్రిభాషా సూత్రాన్ని విద్యావిధానంలో పొందుపరిచారు. ఆ త్రిభాషా సూత్రంలో ఫెంచ్, జర్మనీ, సంస్కృతం వంటి విదేశీ భాషలను అమలు చేసి తెలుగును విస్మరించడం క్షమార్హం కాదు. తెలుగు కుటుంబంలో పుట్టి, తెలుగు మాట్లాడడం, రాయడం రాదని గొప్పగా చెప్పుకోవడం ఒక రివాజుగా మారింది. విదేశాలలో స్థిరపడినవారు తమ పిల్లలకు తెలుగు నేర్పించడంలో అనితర సాధ్యమైన కృషి చేస్తుంటే మన దేశంలో వున్నవారు తెలుగును విస్మరించడం, తెలుగు భాషపై నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించడం, జన్మనిచ్చిన మాతృమూర్తిని అశ్రద్ధ చేయడంతో సమానం. ప్రభుత్వాలు కూడా తెలుగు భాష పరిరక్షణపై ఉపన్యాసాలు దంచడం, శుష్కవాగ్దానాలు కురిపించడం మాని, ఒక సమగ్ర ప్రణాళికతో తెలుగు భాషను, దాని వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషిచేయాలి. గతంలో తెలుగు భాషలో 100 శాతం పాలనను చేపడతామన్న వాగ్దానాన్ని మన ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలి. గ్రామ స్థాయి నుండి పాలనను తెలుగులోనే అమలు చేసేందుకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయ్యాలి. ప్రతి తెలుగు వ్యక్తి తెలుగు భాషలో పాండిత్యం సాధించే విధంగా మన విద్యా విధానాన్ని తక్షణం సంస్కరించాల్సిన ఆవశ్యకత ఎంతో వుంది. తాజా నివేదికతోనైనా మన కళ్ళు తెరుచుకొని తేనెకన్నా తీయనైన మన భాష ఔన్నత్యాన్ని, ప్రాశస్త్యాన్ని కాపాడే ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేయాలి.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం
టీచర్ల కొరతతో సమస్యలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత చాలా తీవ్రంగానే ఉంది. ఎంతోమంది టీచర్లకు పదోన్నతులు లేక మూడు సంవత్సరాలు దాటింది. చాలామంది ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. తెలంగాణలో ఇటీవల జరిగిన టీచర్ల బదిలీలతో మారుమూల గ్రామాల్లోని చాలా పాఠశాలల్లో బోధనాసిబ్బంది నామమాత్రంగా ఉన్నారు. టీచర్లు లేనందున ఈ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు సుముఖత చూపడం లేదు. టీచర్లు, విద్యార్థులు లేక చాలా స్కూళ్లు బోసిపోతున్నాయి. ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యా వాలంటీర్లను నియమించడం వల్ల బోధనలో నాణ్యత అంతంత మాత్రమే. డెప్యుటేషన్ల వల్ల ప్రాథమిక పాఠశాలలు దెబ్బతింటున్నాయి. భాషా పండితులకు, పి.ఇ.టి.లకు పదోన్నతులు ఇవ్వాలి. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ప్రకటించాలి. సర్కారీ బడుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా విద్యార్థులకు న్యాయం చేయాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్