ఉత్తరాయణం

ఇంత అత్యుత్సాహమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చట్టానికి కళ్లు ఉండరాదంటే’ అందరి పట్లా సమదృష్టి ఉండాలని అర్థం. అయితే, చట్టాన్ని అమలుచేసే వారిలో ఆ సమదృష్టి లేకపోతే సమాజానికి తీరని నష్టం. పైగా అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రమాదకరమైన ధోరణి. దేశవ్యాప్తంగా ఐదుగురు పౌర హక్కుల నేతలను తాజాగా అరెస్టు చేయడం సంచలనం కలిగించింది. వారిని అరెస్టు చేయడంలో నిబంధనల్ని పాటించలేదంటూ మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. అంటే ఆ నేతల హక్కులకే దిక్కులేకుండా పోయిందన్న మాట. పాలక వర్గాలకు విభిన్న భావజాలం కలిగినందున వారికి సంబంధించి నిబంధనల్ని పాటించడం, పాటించకపోవడం అన్నది అధికారులకు ‘అంతగా పట్టించుకోవాల్సిన’ విషయం కాలేదన్న మాట. ఈ తరహా ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకి శోభనిస్తుందా? ఈ ఉదంతం గురించి వ్యాఖ్యానించిన సుప్రీం కోర్టు ‘అసమ్మతి అన్నది సేఫ్టీవాల్వ్ లాంటిది. అది లేకపోతే సమాజం ప్రెజర్ కుక్కర్‌లా పేలిపోతుంది’- అంటూ ప్రభుత్వానికి మంచిమాట చెప్పింది. అరెస్టయిన నేతలంతా కోరేగామ్ అల్లర్లను ప్రేరేపించారన్నది ఆరోపణ. ఆ అల్లర్లలో ప్రత్యక్ష పాత్ర వహించిన ఒక వర్గం వారిపై ఏ చర్యలూ లేవని, ఆ దరిదాపుల్లో లేని పౌర హక్కుల నేతలపై అత్యుత్సాహపు చర్యలు తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా దేశ ప్రధానిని హతమార్చేందుకు కుట్ర పన్నిన నిషేధిత మావోయిస్టులకు పౌరహక్కుల నేతలు సహకరిస్తున్నట్టు ఉత్తరం దొరికిందన్నది మహారాష్ట్ర పోలీసుల ఆరోపణ. అది తీవ్రమైనదే. ప్రధానికే కాదు సామాన్య పౌరునికి ఆ రకమైన అపాయం ఉన్నా సీరియస్‌గా తీసుకోవాల్సిందే. అయితే ఆ తరహా ఉత్తరాలు, మెసేజ్‌ల్లో విశ్వసనీయత ఎంత అన్నది? ముందు నిర్ధారణ చేసుకోవాలి. నకిలీ వార్తల యుగంలో మరీ కచ్చితంగా పాటించాల్సిన నియమమిది. భావజాలాలకు అతీతంగా చట్టం అమలులో స్థిరత్వం, న్యాయం ఉండాలి.
- డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం

తెలుగుభాషకు గ్రహణం
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉనికిని, గుర్తింపును తెచ్చిన కన్నతల్లి వంటి మాతృభాష నేడు నిరాదరణకు గురవుతోంది. మాతృభాషను కాపాడవలసిన తెలుగుబిడ్డలు పరాయి భాషల మోజులో పడడం అత్యంత దురదృష్టకరం. ప్రపంచ భాషలలోనే అత్యంత ప్రాచీన భాషగా, ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా ప్రఖ్యాతి పొందిన తెలుగు భాష మనవారికే రుచించక పోవడం విడ్డూరం. మాతృభాషలను ప్రేమించడం ఎలాగో మన పొరుగు రాష్ట్రాలవారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా వుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, వృత్తికి సంబంధించిన విషయాలను పక్కనపెడితే, మిగతా వ్యవహారాలన్నీ తమ మాతృభాషలోనే జరుపుతారు. 12వ తరగతి వరకు మాతృభాషకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. మాతృభాషలో చదువుకున్నవారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కొంత ప్రత్యేక వెసులుబాటు వుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మాతృభాష ఒక అంశంగా వుంటుంది. మాట తీరు, కట్టుబొట్టూ అన్నీ వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. వారితో పోల్చుకుంటే మన భాషాభిమానం ఏపాటిదో ప్రతీ తెలుగువారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. తెలుగేతర ప్రాంత పాలకులైన అక్బర్ పాదుషా తెలుగు పట్ల ఆసక్తి చూపటం, కన్నడ ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’అని ప్రశంసించడం తెలుగు గొప్పదనాన్ని సూచిస్తోంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు వారి మాతృభాషలను అభివృద్ధిచేసుకోగా, తెలుగు రాష్ట్రాలు మాత్రం మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఒక భాషను నిర్లక్ష్యం చేయడం అంటే ఒక సంస్కృతిని, ఒక సంప్రదాయాన్ని, ఒక జీవన శైలిని నిర్లక్ష్యం చేయడమే. మాతృభాషకు ద్రోహం చెయ్యడం అంటే ఆ భాషను మాట్లాడుతున్న కోట్లాది మంది మనోభావాలకు, భావోద్వేగాలకు, అభివృద్ధికి ద్రోహం చేసినట్లే. తెలుగుభాష పరిరక్షణ కోసం ప్రతి తెలుగువాడూ గిడుగు రామమూర్తిలా నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది.
-సిహెచ్.ప్రతాప్.