వినమరుగైన
రాజమన్నారు నాటికలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రేమాభిమానాలు, గౌరవం, నమ్మకం, పారదర్శకత లేని తమ దంపతీబంధం నుంచి స్వతంత్రురాలవుతుంది ఎంతో ఆవేదనతో.
ఆదర్శాలను, ఆచరణకు మధ్య పరిణామం వున్నది. పరివర్తన వున్నది. సంఘర్షణ వున్నది. సంవేదన వున్నది. ఆ స్పృహ లేకుండానే కేవలం ఆవేశంతో ఆనాటికి అందివచ్చిన ఆదర్శాన్ని ఆచరించ పూనుకోవడం అవివేకమే. సుంస్కరణవాదానికి, సంఘ పరిస్థితులకు నడుమ అలాంటివారు తప్పల్లా తేలిపోతారు. అంతఃచేతన లేని అటువంటి క్షణిక సంస్కారంలోని బోలుతనాన్ని ఎండకట్టడంవల్లనే ఏమి మగవాళ్ళు! నాటిక ఉత్తమ నాటిక అయింది.
ఇక వేశ్యా విటులకు నడుమ దంపతీ సంబంధం సాధ్యమేనా? ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలు ఉండవా? ఒకరి గౌరవ మర్యాదలను మరొకరు కాపాడలేరా?’’
ఈ ఇతివృత్తంతో రాసిన నిష్ఫలం నాటికలో.. చిత్రరేఖా మనసా వాచా కర్మణా జమీందారుకు కట్టుబడి వున్నది కట్టుకున్న భార్యలాగానే. అయితేనేమి, ‘‘సానిదానికి పాతివ్రత్యమా?’’ అంటూ అహంకారంతో ఛీత్కరించిన జమిందారిణితోనే వెళ్లాడు జమీందారు చిత్రరేఖను తృణప్రాయంగా త్యజించి.
అసలు చిత్రరేఖ ప్రేమాభిమానాల గాఢతను స్పృశించగల సమర్థతగానీ, అందుకోగల అర్హత కానీ కలవాడేనా ఆ జమిందారు అని అనిపిస్తుంది చివరికి.
‘‘వేశ్యలకు ప్రేమాభిమానాలు అంటవని అంటాము. పాపము వారికా రెండూ నిష్ఫలాలు’’ అంటారు రాజమన్నారు. నాటికలో పతాకతోనే భరతం పలకకుండా అంతకు ధీటైన ప్రతిపతాకను ఇవ్వడంలో రాజమన్నారు ముఖ్యులు.
వైకుంఠంతో సమాచార సంబంధం పెట్టుకున్నట్లు పల్లె ప్రజలను మోసగిస్తాడు వైకుంఠాచార్యులు. అతని ఉపాయంతోనే అతనికి సమాధి కట్టబోతారు పట్నవాసులు. ఇది పాక. తిరిగి అదే ఉపాయంతో పట్నవాసుల్నే ఊరివారితో ఊరినుంచి తరిమిస్తాడు వైకుంఠాచార్యులు. అది ప్రతిపతాక.
సంభాషణల కల్పన చాలా సరళంగా, క్లుప్తంగా, తేటగా, లోతుగా సాగుతుంది. పాత్రలను బట్టే భాష. ఆ మాటల్లో చతురత వుంది. హాస్యం వుంది. అన్నిటికి మించి ఆర్తి వుంది. ఆవేదన వుంది.
‘‘సానిదానికి ఇంత నీతి ఉండడం వింతగా ఉంది కదూ?’’ (నిష్ఫలం)
‘‘మానవజాతి జ్ఞానం లేని శైశవదశలోనే ఇంకా ఉంది... ప్రియతమా! లోకాన్నింకా ప్రేమ జయించే కాలం రాలేదు. ప్రేమ రాజ్యస్థాపనకు ఈ మానవ ప్రపంచం ఇంకా సిద్ధం కాలేదు’’- (నందిని)
‘‘ప్రభా! నీవు వద్దంటే విన్నాను గాను- నినె్నంత కష్టపెట్టాను’’ (పరకీయ)
‘‘చేసింది తప్పే. నేనేమి చెయ్యను చిన్నతనం. ఆయన మాట నేనెలా తోసివెయ్యడం’’ ( వృధాయాసం)
‘‘ప్రేమ స్వరూపమే తెలియని రోజుల్లో నా భావాలకి అర్థతాత్పర్యాలు లేవనుకోండి. ప్రేమ స్వరూపం తెలుసుకున్నపుడు ప్రేమ లేదని నిశ్చయించాను’’ (విముక్తి)
‘‘ఎందుకా! అవును. అర్థం కాదు మీకు- వేశ్యకు హృదయం ఉండదు. ప్రేమ ఉండదు. విశ్వాసం, కృతజ్ఞత ఏమీ ఉండవు!’’ (నిష్ఫలం)
‘‘ప్రతి మానవ వ్యక్తిలో జడ్జీ గుణం ఉంటుంది. అంటే న్యాయాన్యాయాల్ని తీర్మానించడం. ఒక కార్యం సబబా బేసబబా అని ప్రతిరోజూ ప్రతి ఒక్కరం తీర్పు చెపుతూ ఉంటాం (భార్యాభర్తలు)
‘‘నాకు తెలుసును. దేన్నిగాని చంపుతున్నపుడు బాధ సహజం. ఇపుడు మోహాన్ని చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. అందుకే బాధ’’ (పరకీయ)
రాజమన్నారు నాటికలలో భిన్న సంస్కార స్వభావాలకు చెందిన మనుషులు నిండి వుంటారు. స్వేచ్ఛా పిపాసకు సంఘ పరిస్థితులకు మధ్యన మనుగడ సాగించే రకరకాల మనుషులు. ఆ మనుషుల మనసులోని అనేకానేక కోణాలు. ఒక కోణంలోంచి మరో కోణం. ఒకదానికి సమాంతరంగా మరోటి. ఒకదాన్ని ఖండిస్తూ ఇంకోటి.
శ్రీపాదవారు అన్నట్లుగా రాజమన్నారు నాటికలను అర్థం చేసుకోవడానికి మానసత్వము మాత్రమే చాలదు, మానవత్వము కావాలి.
ప్రదర్శన కళ అయిన నాటిక రచయిత రచనతోనే పూర్తికాదు. రచనలోని ఆర్ద్రతనూ, రచయిత ఆంతర్యాన్ని నటీనటులు తమ కళాకౌశలంతో ఆవిష్కరించగలిగితేనే ఆ నాటిక రసమవంతమవుతుంది. సున్నిత భావాలతో నిండిన రాజమన్నారు నాటికలను ఆ కాలంలోని కళాకారులు ఎలా ప్రదర్శించి వుంటారో అని ఊహిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అంతకుమించి ఆనందమూ కలుగుతుంది.
కొద్ది ఆవరణలో కొన్ని పాత్రలతో ఉన్నత సాహిత్య ప్రయోజనాన్ని సాధిస్తారు రాజమన్నారు.
తెలుగు రంగస్థల అభివృద్ధికి విశేష కృషి చేసిన శ్రీ కూర్మా వేణుగోపాలస్వామి గారు తెలుగు సాహిత్య లబ్దప్రతిష్టులు శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారూ రాజమన్నారు నాటికల ఔన్నత్యాన్ని ఎంతో ప్రశంసించారు. రాజమన్నారును ఆధునిక తెలుగు నాటక పరివర్తన సంధికర్తగా కొనియాడారు. సహస్రాధిక శీతల కిరణాలను వెదజల్లుతూ రాజమన్నారు లేఖినిలో వెలువడిన స్ర్తిమూర్తికి వారు నీరాజనం పట్టారు.
ఆనాటి నాటక రంగంలోనూ, సాహిత్య రంగంలోనూ ప్రత్యేక ముద్రనూ, గౌరవ స్థానాన్ని పొందిన ఈ నాటికలు ఈ తరానికి తెరుమరుగయ్యాయి. రాజమన్నారు వరుసలోని వారైన చలం, ముద్దుకృష్ణ, బుచ్చిబాబు తదితరుల రచనలతో పోలిస్తే- రాజమన్నారు నాటికలకు రావలసినంత ప్రాచుర్యం కానీ ప్రాధాన్యత కానీ రాలేదనే చెప్పాలి. బహుశా రాజమన్నారు తన రచనా మాధ్యమాన్ని కథలకూ నవలలకూ విస్తరించకుండా ఏకాంకికలకూ, నాటికలకూ పరిమితం చేయడం వల్లనే కావచ్చునేమో.. ఒకవేళ అదే కారణం అనుకుంటే అదే అతని ప్రత్యేకత!
తెలుగు నాటక ప్రియులూ, సాహిత్యాభిమానలు రాజమన్నారు నాటికలను పునఃపరిశీలించి పునఃపరిశోధించాల్సి ఉంది. పూర్వ వైభవాన్ని పునఃస్థాపించాల్సి వుంది.
ఈ పని ఎప్పుడో చేయవలసినది.
ఇప్పటికీ మించిపోలేదు!
*
-అయిపోయంది
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..