వీరాజీయం

భాజపా ఎన్నికల రాదారిలో అయోధ్య ఓ ‘స్పీడ్ బ్రేకర్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఏకుమేకైపోయి చాలా కాలమైంది. ఆ మాటకొస్తే ‘సంఘ్ పరివార్’లో ఎవరు ఇప్పుడు ‘జో హుకుం సర్కార్! మోదీ సాబ్ జిందాబాద్!’ అంటూ చిడతలు పట్టుకొని తిరుగుతున్నారు? శివసేన పార్టీ ముందే భాజపాకు పక్కలో బల్లెంలా తయారయ్యింది. ఏదో సామెత చెబుతారే అలాగ - యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హాలనే రెండు సింహాలు పబ్లిగ్గా మోదీజీని, భాజపా సర్కార్‌ని కూడా నిందిస్తూ తిడుతూ ఎడాపెడా వాయించేస్తున్నారు. మోదీజీ, అమిత్‌షాలు మిక్కిలి పరిశోధనలు చేసి కనుగొని అలనాడు నలభైమూడు ఏండ్లకి పూర్వం- ఇందిరమ్మ అను ‘హిట్లరమ్మ’ విధించిన ఎమర్జెన్సీని తలుచుకుని వర్ణించి వర్ణించి వార్షికోత్సవం చేస్తూ ఉంటే- రెండోవైపు బుల్లితెర మీద యశ్వంత్ సిన్హా దేశంలో అంతకన్నా ఎక్కువ అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని- నేరుగానే కేంద్ర సర్కార్ పాలనని తూర్పారబట్టాడు. ఇవాళ యాభై ఏండ్ల వయస్సుకి అటుకొంచెం, ఇటుకొంచెంగా వున్న వాళ్ళకి తప్ప- మోదీ గారు జైట్లీ అండ్ పార్టీ వేసిన ‘ఎమర్జెన్సీ వీరంగం’ అర్థం కాకపోగా ప్రత్యర్థులకి ఛాన్స్ దొరికింది. ఇవాళ అంతకన్నా ఎక్కువ ఆర్థిక ఎమర్జెన్సీ రాజ్యం ఏలుతోందని మాయావతి చురకలు తగిలించింది. హిట్లర్, ఔరంగజేబ్‌లు ఏమి పుణ్యం చేసుకున్నారో గాని - ఇందిరమ్మ హిట్లర్ అయితే- నరేంద్రదాస్ మోదీ ఔరంగజేబ్ అని - కాస్సేపు తిట్టుకున్నారు ఇరువర్గాల వారు. కాని అసలు హీరోప్రవీణ్‌దాస్ (తొగాడియా) అయినాడు. విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు కొత్తగా అంతర్ రాష్ట్రీయ హిందూ పరిషత్ పార్టీని నెలకొల్పి జైశ్రీరాం అంటూ యుద్ధ్భేరీ మోగించడానికి ఇదే అదను తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో తొగాడియా పత్రికలవారి ముందు- ‘నన్ను ఎన్‌కౌంటర్ చేసేస్తారని భయంగా ఉన్నాదం’టూ భాజాపా మీద తీవ్రమయిన ఆరోపణలు చెయ్యడం- పాత కేసులు తిరగదోడుతున్నారని, కక్ష సాధిస్తున్నారని చెప్పడం కొంతమందికయినా జ్ఞాపకం వుండే వుంటుంది.
ఆయనో పుస్తకం రాశాడు- అది ఇప్పుడు విడుదల చేస్తానని పరోక్షంగా బెదిరిస్తున్నాడంటారు పరిశీలకులు. చేసుకోనీండి అన్నాడో మోదీ వీరాభిమాని- తాటాకు చప్పుళ్ళకు భయపడే కుందేళ్ళు ఎవరూ లేరిక్కడ.. అని కూడా ప్రకటించాడు. కాని అట్లా అనకురా బాబూ.. ఏ పుట్టలో ఏ పాముందో అన్నాడో లీడరు ఆ పుస్తకం పేరు- ‘శాఫ్రాన్ రెఫ్లెక్షన్స్- ఫేసెస్ అండ్ మాస్క్‌స్’- అర్ధం అయ్యిందా? మొత్తం గుట్టు రట్టు చేసేశానని సదరు గ్రంథంలో అంటున్నాడు ప్రవీణ్‌భాయి. ఆ పుస్తకంలో రామజన్మభూమి, అయోధ్య మందిరం, గోవధ నిషేధం మీద రహస్య నిర్ణయాలు వగైరా విశేషాలను పేజీ పేజీకి బట్టబయలు చేసేస్తుందని, మోదీజీని ఇరకాటంలోపెట్టే అవకాశాలు మెండుగా వున్నాయని అనుమానం. అదే నిజమైతే- భాజపా విధాత నరేంద్ర దాసుడు ‘నా మస్తకాన్ని రోట్లో పెట్టండిరా’ అంటూ బాధపడిపోయే ప్రమాదం పొంచి వున్నదని భాజపా అభిజ్ఞవర్గాల భోగట్టా. ఇప్పుడు ప్రవీణ్‌జీ అంతర్రాష్ట్రీయ హిందువుడు. యుపి- సాధుపుంగవుడు, మధుర- సాధుజనుడు కాదు. శంఖంతోపాటు ఆయుధాలనూ ధరించి- రామలల్లాకి- మోదీ అండ్ పార్టీ చేసిన ‘‘మోసపూరిత ద్రోహాన్ని’’ ఎండగట్టడమే తక్షణ కర్తవ్యంగా రంగంలోకి దూకాడు. గవర్నమెంటు హామీని మరిచింది కనుక- అయోధ్య సాక్షిగా రాంలల్లాకోసం- ఇరవై కోట్ల (అందులో ఎక్కువమంది వోటర్లు వుంటారు కదా?)- సంతకాలు సేకరిస్తానంటున్నాడు. ఇవతల అరివీర భయంకర నినద భీకర గర్జనలతో మోదీజీ- ఎమర్జన్సీ ఖండిస్తూ వుండగా అవతల నాగపూరులో మీడియా ముందు- తన ‘తురుపుముక్కని’ రేఖమాత్రంగా చూపెట్టాడు ప్రవీణ్‌భాయా. ఎంతమంది కార్‌సేవకులు (కరకాదు కార్ సేవకులు) రామజన్మభూమిలో గుడికోసం ప్రాణాలు కూడా అర్పించారో గుర్తుచేస్తూ.. ఆ రాముడి గుడి పేరెట్టుకుని అధికారంలోకి వచ్చిన భాజపా- ఇవాళ రాముడి ఊసే ఎత్తడం లేదని- సుప్రీమ్ కోర్టుని అడ్డం పెట్టుకుని అయోధ్య అంశాన్ని నాన్చుతూ- భక్తకోటిని మోసం చేసిందని తనదైన శైలిలో ఆరోపించాడు తొగాడియా భాయ్.
అంతా హడావుడి చేశారు. ఇదుగో గుడి నిర్మాణం రెడీ అయిపోయింది.. సుప్రీం కోర్టు పదవిలో వున్న జడ్జినే కమిటీలో కూర్చోబెట్టి- సయోధ్య కుదిర్చి ఆలయానికి ‘రాళ్లెత్తు’తాము అంటూ - సుబ్రమణ్యస్వామి సాక్షిగా ఇచ్చకాలు చేసారు. ఇంచుమించు అంపశయ్య మీద వున్న లాల్ కిషన్‌జీని- రాష్టప్రతి, ఉప రాష్టప్రతి పదవుల ఆరాటం నుంచి తప్పించడానికే ‘డ్రామా’ ఆడారని ఎందరో అన్నారు. అందర్నీపోయి వేరువేరుగా ఒప్పించలేరుగా? రాముడిని నెత్తిన పెట్టుకుని- వాజపేయి ‘ముఖతొడుగు’ ధరించి దేశాటనం చేసి భాజపా కోసం, అయోధ్య రాముని గుడికోసం దేశం చుట్టి వచ్చిన- అద్వానీజీ నేడు అధ్వాన నాయకుడైపోయాడు. మురళీమనోహర్ జోషీ వారణాసికి కూడా పనికిరాకుండాపోయాడు. మళ్లీ అదే రామ్‌లల్లాని జెండా మీద పెట్టుకొని, 2019 ఎన్నికలను వీలయితే ఇంకా కొంచెం ముందుగానే తరిద్దామనుకుంటున్న భాజపాకి ‘వెదర్‌కాక్’ అనగా - గాలికోడి లాంటి వాడు యోగి మహారాజ్. ఈమధ్యనే రాముడిని ఎన్నికల రథం మీద పెట్టుకుంటామని- కొన్ని పత్రికల్లో వ్యాసాలకి చాలినన్ని ఫీలర్లు వదిలిపెట్టాడు యోగి ఆదిత్యనాథ్.
అట్టి తరి- తొగాడియా అయోధ్యకు నడుము కట్టుకొని- ప్రస్థానం మొదలెడుతూ నరేంద్రుని సింహాసనానికి తగిలేలా కొన్ని చోదితాస్త్రాలను ప్రయోగించాడు. అంతేనా? ఒక శ్రీముఖం కూడా పంపించాడు. మోదీకి అక్టోబర్ దాకా గడువు కూడా ఇచ్చాడులెండి. ఈలోగా అయోధ్య దేవాలయ నిర్మాణం కోసం గవర్నమెంటు రామ్ టెంపల్‌ని సోమనాథ దేవాలయం మాదిరి ప్రణాళికతో నిర్మించడానికి వీలుగా పార్లమెంట్ ద్వారా చట్టాన్ని తీసుకురావాలి లేదా నా సత్తా చూపిస్తానని అన్నాడు. అగ్గిబరాటాల్లాంటి హిందూత్వ ఉద్యమకారులు తొగాడియా, ఉమాభారతి మొదలైనవారు రంగంలోకి దూకారో చిచ్చిరపిడుగులైపోతారు నాయనోయ్!- అన్నదో బామ్మగారు. కాని, మోదీ తలచుకుంటే ఏదైనా చెయ్యగలడన్న నమ్మకం ఎంతో మంది పెద్దలకి వుంది. కాని- సంఘ్ పరివార్ అనుయాయుల్లాగ మోదీజీ జై- జై శ్రీరాం- అంటూ అభివాదం అభినందనం కూడా చెప్పడు తొగాడియా.. అదేమీ నామోషీయో? అన్నాడో అసంతృప్త కార్యకర్త. అదట్లుండ నిండు. ప్రవీణ్ తొగాడియా పుస్తకాన్ని కూడా ప్రక్కన పెట్టండి- అదేమీ ఆసక్తి కలిగించేది కాబోదుగా, హాట్ సమోసాల లాగా లాగించడానికి? ఈలోగా తొగాడియా ఒక ముసాయిదా ‘బిల్లు’ తయారించి తెచ్చాడు. ఇది రాజ్యాంగ నిపుణులు, సుప్రీం కోర్టు మాజీలు మొదలైన పెద్దలు కాచి వడబోసి తయారుచేసిన ‘‘గుడి నిర్మాణ ప్రణాళిక’’. ఈ మాదిరిగా లోక్‌సభలో బిల్లు రూపొందించమంటున్నాడు, అరవై రెండు సంవత్సరాల వయస్సు అందులో సగం ‘సంఘ్’ అనుభవం వున్న ఈ హిందూ వీరుడు. హిందువులను మభ్యపెట్టడం ఇంకానా? ఇకపై చెల్లదు అన్నాడు.
కొత్త పార్టీ పెట్టిన తరువాత- మోదీజీ మీదే నేరుగా విల్లు ఎక్కుపెట్టిన అయోధ్య మందిర ముఖ్య ‘కార్’ సేవకుడైన తొగాడియా ఇప్పుడు మరీ ఉగ్రంగా వున్నాడు. మోదీగారికి విదేశాల్లో మసీదులకు పోయే తీరిక వున్నది కాని రామ్‌జన్మభూమిని దర్శించి ‘రాంలల్లా’కి ప్రణమిల్లే కోరిక లేదని తప్పుపడుతున్నాడు తొగాడియాజీ. మొదట్లో మేము సోమనాథ దేవాలయం మాదిరిగానే- అయోధ్య రామమందిరం నిర్మిస్తాం అని చెప్పినప్పుడు కోర్టులు లిటికేషన్లు జ్ఞాపకం లేదా? వీరికి? అని సూటిగా అడిగాడు హిందూపరిషత్ నాయకుడు.
ఇప్పుడు ఈ ‘రామమందిర’ వీరుడు నేరుగా అయోధ్యకి చేరుకుంటున్నాడు. అక్కడ రామజన్మభూమి న్యాస్ చైర్మన్ మహంతి నిత్యగోపాలదాస్‌తోనూ, ప్రస్తుతం ఆపద్ధర్మ పూజారి మహంత సత్యేంద్రదాస్, డా.రామ్విలాస్ వేదాంతిలతోనూ చర్చలు మంతనాలు ‘‘షురూ’’.
ఇదంతా చూడగా- సంఘ్ పరివార్‌లోనే వేరు కుంపట్లు, వేర్వేరు ఫ్రంట్లు వగైరా తలెత్తుతాయేమోనని బిక్కమొహంతో అడిగాడు- ఓ ఆశాజీవి అయిన కార్యకర్త. జవాబిచ్చేందుకు అమిత్‌షా, యోగి వగైరాలు లేరా?
బై ది బై.. ఈజ్ అయోధ్య ఎ పొలిటికల్ ప్రాబ్లం? ఆర్ ఎ సెంటిమెంట్??
*

--వీరాజీయం....సెల్: 92900 99512