విండో

స్తంభించిన బ్రెజిల్ వెబ్ సైట్లు

  • -వి.ఆర్.సి.మూర్తి
  • 28/01/2012

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలలో వెబ్ సైట్లు కొన్ని ఒకే సారి పని చేకుండా అయిపోయాయి. గత శుక్ర, శనివారాలలో దక్షిణ అమెరికా బ్రెజిలాన్‌లోని వెబ్‌సైట్ల వేగం మందగించింది. ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరూ మొదట ఊహించలేక పోయారు. బ్రెజిల్ గాయని వెబ్‌సైట్ కూడా ఒపెన్ కాలేదు. ఇలా చాలా వెబ్‌సైట్లు, ఇటు హాంకాంగ్‌లో కూడా ఒపెన్ కాలేదు. వెబ్‌సైట్ చిరునామా టైప్‌చేసినా రీ డైరెక్ట్‌తో మరో వెబ్‌పేజీకి మారడంతో అర్థంకాని పరిస్థితి ఎదురైంది. ఇలాంటి పరిణామాలు ఇదివరకు ఎన్నడూ సంభవించలేదని నిపుణులు చెప్పారు. కొన్ని వెబ్‌సైట్లు ఆ తర్వాత పనిచేయకుండా పోయాయి. హాంకాంగ్‌కు చెందిన మెగా అప్‌లోడ్ వెబ్ సైటును సుమారు 150 మిలియన్ల మంది సాలీనా సందర్శిస్తుంటారు. కానీ కేవలం ఈ దాడులు జరిగిన సమయంలో ఒక రోజు సుమారు 50 మిలియన్ల మంది సందర్శించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అన్ని వెబ్‌సైట్లపై జరుగుతున్న హిట్టింగ్‌లో నాలుగు శాతం. కానీ ఇలా ఒకేఒక వెబ్‌సైట్‌కు ఏక కాలంలో ఎక్కువ సందర్శకుల తాకిడి ఎక్కువ అవడం, డౌన్‌లోడ్ అప్‌లోడ్ పెరగడం వల్ల ఇలాంటి పరిణామం సంభవించిందని చెబుతున్నారు. అలాంటప్పుడు కొన్ని వెబ్‌సైట్ల వేగం మందగించడం మాట ఏమిటన్న ప్రశ్నకు జవాబు లభించడంలేదు. కానీ వెబ్‌సైట్లపై హాకర్ల దాడుల వల్ల సుమారు భారీ నష్టం జరిగినట్లు చెబుతున్నారు.

సైబర్ ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్
వెబ్‌సైట్లపై నియంత్రణ ప్రారంభం అయింది. లైంగికపరమైన నేరాలు చేసేవిధింగా ప్రోత్సహిస్తున్న వెబ్‌సైట్లను అరికట్టడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని భారత దేశం భావించింది. ఈ నేపధ్యంలోనే ఇంటర్‌నెట్ ఉపయోగించే విధానాలలో ప్రత్యేక శిక్షణ గరపాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పిల్లలు వాడే కంప్యూటరు పెద్దవాళ్ల నియంత్రణలో ఉండేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించేలా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, ఇంటర్‌నెట్ సెంటర్ యజమానులకు శిక్షణనిచ్చే బాధ్యతను చేపట్టాలని సంబంధింత శాఖలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వ్యక్తిగత వెబ్‌సైట్లలో అభ్యంతర కరమైన అంశాలను తొలగించాలని అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలకు ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. వెబ్‌సైట్ల వడపోత కార్యక్రమంలో భాగంగా అండర్ కవర్ సైబర్ ఆపరేషన్లు చేపట్టడానికి వీలుగా తగు అధికారాలు సంబంధిత శాఖలకు సంక్రమించాయి.

పెరుగుతున్న ఇంటర్‌నెట్ యూజర్లు
ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా ఇంటర్‌నెట్ యూజర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అరచేతిని పెట్టి సూర్యకాంతిని ఆపలేమన్న చందంగా పరిస్థితి తయారైంది. దైనందిన జీవితంలో ఇంటర్‌నెట్ ఒక భాగం అయింది. లాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, ట్యాబ్‌లెట్‌లు, ఐప్యాడ్‌లు, స్మాట్‌ఫోన్లు ఇలా మాధ్యమాలు ఏవైనా ఇంటర్‌నెట్ లేనిదే గడువలేని వారి సంఖ్య 2.1 బిలియన్స్‌కు చేరుకుంది. ఇ-మెయిల్ పుట్టి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇంటర్‌నెట్ యూజర్ల తీరుతెన్నులపై ప్రత్యేక సర్వేలు చేపట్టారు. మొదటి ఇ-మెయిల్ 1971 డిసెంబర్ 10 ప్రారంభమైంది. రే టామ్ లిన్స్‌సన్ మొదటి ఇ-మెయిల్‌ను ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్‌కు పంపి చూపారు. ఇలా ప్రారంభమైన ఇ-మెయిల్ అంచలంచలుగా పుంజుకుంది. వెబ్ చిరునామాకు ప్రత్యామ్నాయం ఇ-మెయిల్ అడ్రస్ అన్న తీరులో మార్పులు చెందాయి. 2011 సంవత్సరం చివరినాటికి ఆసియాలో 922 మిలియన్ మంది ఇంటర్‌నెట్ యూజర్లు ఉండగా, యూరప్‌లో476 మిలియన్ల మంది, ఉత్తర అమెరికాలో 271 మిలియన్ల మంది, చైనాలో 485 మిలియన్ల మంది ఉన్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికి ఇ-మెయిల్ ఎకౌంట్‌లను తరచూ ఉపయోగిస్తున్న వారి సంఖ్య 3.1 బిలియన్లకు చేరుకుంది. కేవలం ఒక హాట్‌మెయిల్ వినియోగదారుల సంఖ్య డిసెంబర్ నాటికి 360 మిలియన్లకు చేరుకుంది. వెబ్‌సైట్లలలో 555 మిలియన్లు ఉండగా, డొమైనీ రిజిస్ట్రేషన్స్ 220 మిలియన్లు ఉన్నాయి. ఇందులో డాట్‌కామ్‌లు 95.5 మిలియన్లకు చేరుకున్నాయి. సోషల్ నెట్‌వర్క్ విషయానికివస్తే ఫేస్‌బుక్‌లో ఈ సంవత్సరం కొత్తగా వినియోగదారులుగా చేరినవారి సంఖ్య 200 మిలియన్లకు చేరింది. ఇది ఇలా ఉంటే అంతా పారదర్శకం అయింది. వ్యక్తిగతమైన విషయాలను సైతం వెబ్‌లో పోస్టింగ్ చేస్తున్నారు. ఇందులో వ్యక్తిగత బ్లాగ్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

చీకటి రోజు
ఇంటర్‌నెట్‌లో ఈ నెల 18న దాదాపు అన్ని వెబ్‌పేజీలన్నీ చీకటిరోజుగా ప్రకటించాయి. అమెరికా చేపట్టిన పైరసీ బిల్లును వ్యతిరేకిస్తున్న సుమారు 75 వేల వెబ్‌సైట్లు 24 గంటల బ్లాక్‌డేను ప్రకటించాయి. కొన్ని సైట్లు బాక్ డే సందర్భంగా తమలోగో బదులుగా నల్లని ముసుగును వేయగా, మరికొన్ని సైట్లు ఏకంగా తమ సేవలను స్తంభింపజేశాయి. వీకీపిడియా ఒక రోజు పనిచేయలేదు. గత సంవత్సరం మే నెలలో అమెరికా ప్రభుత్వం చేపట్టిన ప్రొటక్ట్ ఐపి ( పిపిఎ) చట్టంపై క్రమంగా నిరసనలు ప్రారంభం అయినాయి. దాదాపు ఎక్కువ వెబ్‌సైట్లు ఈ దారిలో నడుస్తున్నాయి. స్టాప్ ఆన్‌లైన్ పైరసీ యాక్ట్ పేర పైరసీ నిరోధబిల్లుపై యుద్ధం ప్రకటించారు. పైరసీ నిరోధం ఉండాల్సిందే కానీ అన్ని వేళలా ఇది సాధ్యంకాదు. వినియోగదారులకు అన్నివిషయాలు తెలియడానికే ప్రత్యేక వెబ్ సైట్లు వెలిసాయి. ఇలా ఒక ప్రత్యేక చట్టం ముసుగులో ఇంటర్‌నెట్ వెబ్‌పేజీలపై ఆంక్షలు గుప్పిస్తే నూటికి 90 శాతం వెబ్ సైట్లు మూసుకోవాల్సిందే. వాస్తవానికి అన్ని పారదర్శకం కావాలి, పైరసీకి సరైన భాష్యం చెప్పాలి అని వికీపిడియా, గుగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, అమెజాన్ అని తదితర వెబ్‌సైట్‌లు బ్లాక్ డే సందర్భంగా పోస్టింగ్‌లు చేశాయి. ఆన్‌లైన్‌లో వినియోగదారుల ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్లు అన్ని వేళలా వినియోగదారుల ప్రవర్తనను నియంత్రించజాలవు, పైరసీ పేరుతో కాపీ రైట్ చట్టనికి మరింత పదను పెట్టే అమెరికా సభలో ప్రవేశపెట్టిన బిల్లుపట్ల డార్క్ 24 పేర నిరసన వ్యక్తం చేశారు. అనుకున్నట్లు అన్ని సవ్యంగా జరిగి అమెరికాలో చట్టం ఫిబ్రవరి నుంచి అమలులోకి వస్తుంది. అదే జరిగితే డొమైనీలు, బ్లాగర్ డాట్ కామ్ సైట్లు అన్ని బ్లాక్ చేయవచ్చు. ఆయా సైట్లు నిర్వహిస్తున్న వాళ్లను వారి ఇ-మెయిల్ చిరునామా ఆధారంగా పట్టుకుని కటకటాల్లోకి తోయవచ్చు.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading